Begin typing your search above and press return to search.

కడప స్టీల్ ప్లాంట్ బాబు వల్లే ఆలస్యం

By:  Tupaki Desk   |   16 Jun 2018 8:26 AM GMT
కడప స్టీల్ ప్లాంట్ బాబు వల్లే ఆలస్యం
X
చంద్రబాబు అన్ని రంగాల్లో పూర్తిగా విఫలమయ్యారని వైసీపీ సీనియర్ నేత - ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. తిరుపతిలో నిర్వహించిన వైఎస్సార్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించి ఆయన మాట్లాడారు. కమీషన్ల కోసమే పోలవారాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారని.. ఇందులో చంద్రబాబుకు ముడుపులు ముట్టాయని స్పష్టం చేశారు. మొదటి నుంచి ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న పార్టీ వైసీపీనేనని.. టీడీపీకి ఏమాత్రం చిత్తశుద్ధి లేదన్నారు. తక్షణమే తెలుగుదేశం ఎంపీలు తమతో పాటు కలిసి రావాలంటూ పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదా వస్తే ప్రతి జిల్లా ఒక హైదరాబాద్ అవుతుందన్నారు.

రాయలసీమపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని వైవీ మండిపడ్డారు. కడప స్టీల్ ప్లాంట్ ఇప్పటికే ప్రారంభం కావాల్సి ఉన్నా చంద్రబాబు నిర్లక్ష్యం కారణంగానే ఇప్పటికీ ప్లాంట్ ఏర్పాటు కావడం లేదని ఆయన మండిపడ్డారు. ఏ ఒక్కరోజైనా ఉక్కు పరిశ్రమ గురించి మాట్లాడారా అంటూ చంద్రబాబును నిలదీశారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని అన్నారు.

చంద్రగిరిలో వైసీపీ క్రికెట్ టోర్నమెంట్ చాలా గొప్ప కార్యక్రమమని అన్నారు. చంద్రబాబు ప్రభుత్వం క్రీడలను పూర్తిగా పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో యువతకు ఒక్క ఉద్యోగం రాలేదని.. కానీ నారా లోకేష్ కు మాత్రం మంత్రి పదవి వచ్చిందంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి హోదానే అత్యవసరం అని స్పష్టం చేశారు. హోదా వస్తేనే యువతకు ఉపాధి అవకాశాలని తెలిపారు.