Begin typing your search above and press return to search.

కేసీఆర్ కు పూర్తి రివ‌ర్స్‌ లో వెళ్తున్న బాబు

By:  Tupaki Desk   |   10 Jan 2017 4:56 PM GMT
కేసీఆర్ కు పూర్తి రివ‌ర్స్‌ లో వెళ్తున్న బాబు
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పై ఉన్న విమ‌ర్శ‌ల్లో మొద‌టిది ముఖ్య‌మంత్రి కార్యాల‌యం వైపు అస‌లు రానేరారు అని. కార‌ణాలు ఏవైనా కేసీఆర్ సీఎం ఆఫీసుకు రాక‌పోయిన‌ప్ప‌టికీ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుంచి మాత్రం ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల‌ను భేషుగ్గా నిర్వ‌హించేస్తుంటారు. కానీ ఏపీ సీఎం చంద్ర‌బాబు తెలంగాణ‌ కేసీఆర్‌ కు భిన్నంగా న‌డుచుకుంటున్నారు. వెలగపూడి సచివాలయంలో సీఎం బ్లాక్‌ ప్రారంభమైనప్పటి నుంచి చంద్రబాబు విజ‌య‌వాడ‌లోని క్యాంప్ ఆఫీసు వైపు రావడం లేదు. సీఎం అటువైపు చూసి దాదాపు నెలరోజుల పైమాటే అయింద‌ని అంటున్నారు. క్యాంపు కార్యాలయానికి సీఎం రాకపోవడంతో మంత్రులు - ఎమ్మెల్యేలు కూడా ఇటువైపు చూడడం మానేశారు. మీడియా సమావేశాలు కూడా ఇక్కడ జరపడం లేదు. కేవలం అలంకారప్రాయంగానే సీఎం క్యాంపు కార్యాలయం కనిపిస్తుంది.

సీఎం క్యాంపు కార్యాల‌యానికి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు రాక‌పోవ‌డంలో కొత్త స‌మ‌స్య కూడా ఉంద‌ని అంటున్నారు. ముఖ్య‌మంత్రి - రాష్ట్ర మంత్రులు రాక‌పోయినప్ప‌టికీ సీఎం క్యాంపు కార్యాలయానికి అదే గస్తీ.. అదే భద్రత కొనసాగుతోంది. రహదారిపై పెద్ద పెద్ద బారికేడ్లు - సీసీ కెమేరాలు - పోలీసు సెక్యూరిటీ మామూలుగానే ఉంది. సీఎం రానప్పుడు, లేనప్పుడు కూడా అదే భద్రతతో వచ్చేపోయే వారికి ట్రాఫిక్‌ కష్టాలు తప్పడం లేదని వాపోతున్నారు. సీఎం క్యాంపు ఆఫీసును ఆనుకుని ఉన్న కోర్టు దగ్గర నిత్యం రద్దీ వాతావరణం కనిపిస్తుంది. ఆదే దారిలో మరో చివర ఉన్న రైతుబజార్‌కు వచ్చే జనాలు ఎక్కువే. ఆ దారిలో రాకపోకలు సాగించే ప్రజలు ఈ ట్రాఫిక్‌ నిబంధనలు, వలయాలతో నానా ఇబ్బందులు పడుతున్నారు. సీఎం ఉన్న సమయంలో అయితే ఈ నిబంధనలు పాటించడం తప్పనిసరి కాని ఇపుడు త‌మ‌ను అన‌వ‌స‌రంగా ఈ రూపంలో ఇర‌కాటం పాలు చేయ‌డం ఎందుక‌ని స్థానికులు ప్ర‌శ్నిస్తున్నారు.

ఇదిలాఉండ‌గా... సీఎం క్యాంపు కార్యాలయం వద్ద భద్రత నిమిత్తం సుమారు 60 మంది పోలీసులు విధులు నిర్వహిస్తారు. ఇందుకోసం దాదాపు అధికశాతం మంది పోలీసులు ఇతర జిల్లాల నుంచి వచ్చిన వారే. అంతేకాదు నెలలు తరబడి ఇక్కడే విధులు నిర్వహిస్తున్నారు. సాధారణంగా 15 రోజులు మహా అయితే నెలరోజులు విధుల నిమిత్తం ఇతర ప్రాంతాల నుంచి పోలీసులు వస్తారు. అయితే ఇక్కడ మాత్రం నెలల తరబడి ఉండిపోవడంతో నానా ఇబ్బందులు పడుతున్నామని పోలీసులు వాపోతున్నారు. ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితి తమదని వాపోతున్నారు. నోట్ల రద్దు నుంచి కూడా ఇక్కడే ఉండడంతో ఇంట్లో డబ్బులకు కుటుంబ సభ్యులు చాలా ఇబ్బందులు పడ్డారని చెప్పారు. ఏటీఎం కార్డులు తమ దగ్గరే ఉండడం - ఖాతాలు తమ పేరుతోనే ఉండడంతో డబ్బులు పంపలేకపోయామని తెలిపారు. ఇప్పటికీ ఇక్కడే ఉంటున్నామని, సెలవులు ఎప్పుడు ఇస్తారో అని ఎదురుచూస్తూ ఉండిపోయామని వాపోతున్నారు. క్యాంపు కార్యాలయం వైపు రద్దీని దృష్టిలో ఉంచుకుని, పోలీసులు అవస్థలు పరిగణలోనికి తీసుకుని తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు, పోలీసులు కోరుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/