Begin typing your search above and press return to search.

బాబు మాటఃపులివెందుల్లో గెలుస్తా..నేనే సీఎం

By:  Tupaki Desk   |   20 March 2017 2:13 PM GMT
బాబు మాటఃపులివెందుల్లో గెలుస్తా..నేనే సీఎం
X
ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్య‌ర్థులు అంద‌రూ గెలుపొందడంపై ఆ పార్టీ అధినేత - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు ఫుల్ జోష్‌ లో ఉన్నారు. అందుకే రాబోయే ఎన్నిక‌ల గురించి ప్ర‌స్తావించ‌డ‌మే కాకుండా కీల‌క నియోజ‌క‌వ‌ర్గాల ఫ‌లితాల‌ను సైతం బాబు చెప్పేస్తున్నారు. ఫ‌లితాల త‌ర్వాత మీడియాతో చిట్ చాటు చేస్తూ 2019 ఎన్నికలు ఏకపక్షమేనని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తెలిపారు. రాబోయే 2019 ఎన్నికల్లో పులివెందుల స్థానం టీడీపీదేనని అన్నారు. ప్రజలు అభివృద్ది, సంక్షేమం, ఆనందం కోరుకుంటున్నారని చంద్రబాబునాయుడు అన్నారు. ఆ మూడు నేను ఇస్తున్నప్పుడు మరో పార్టీతో ప్రజలకు పనేముందని చంద్రబాబు అన్నారు.

ఈ సంద‌ర్భంగా పులివెందులలో పోటీ చేయాలన్న జగన్‌ సవాల్‌ పై చంద్ర‌బాబు స్పందించారు. రాబోయే ఎన్నిక‌ల్లో పులివెందుల‌లో పోటీ చేయ‌డ‌మే కాదు గెలుస్తామ‌మ‌న్నారు.అభ్యర్థులను కొనుగోలు చేశారని జగన్‌ అంటున్నారని.. డబ్బులు ఎవరి వద్ద ఉన్నాయో ప్రజలకు తెలుసని బాబు అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నాటికి వైసీపీకి గుర్తింపే రాలేదని అలాంటప్పుడు తమ వాళ్లని జగన్‌ ఎలా చెప్పుకుంటాడని చంద్రబాబు అన్నారు. ఖర్చులకు, అంచనాలకు తేడా తెలియని స్థాయిలో ప్రతిపక్ష నేత ఉన్నారన్నారు. ప్రతిపక్ష నేత నేర్చుకునే ప్రయత్నం చేయరు, చెప్పినా వినరన్నారు. జగన్‌ది ఏడాది జైలుకెళ్లిన నేరచరిత్ర అన్నారు. జైలుకు వెళ్లివచ్చిన నాయకుడిని చూసి వైసీపీ సభ్యులు సిగ్గుపడాలని చంద్రబాబునాయుడు తెలిపారు. రాజకీయ లబ్దికోసమే వైసీపీ సభ్యుల ఆందోళన తప్ప మరొకటి కాదన్నారు. పోలవరాన్ని అడ్డుకోవడమే వైసీపీ పనిగా పెట్టుకుందన్నారు. అవినీతిలో కూరుకుపోయిన వాళ్లకు అన్నీ అలాగే కనిపిస్తాయన్నారు. దావోస్‌ పర్యటనకు వెళ్లినప్పుడు పెట్టుబడులకు ఆహ్వానిస్తే అవినీతి రాష్ట్రమని చెప్పారన్నారు. అది గతమని.. ప్రస్తుతం అవినీతి రహిత పాలన అందిస్తున్నానని చెప్పాల్సి వచ్చిందని బాబు అన్నారు.

కాగా, అసెంబ్లీలో మాట్లాడుతున్న స‌మ‌యంలో చంద్రబాబు విపక్ష సభ్యులపై ఫైర్ అయ్యారు. వృద్ధి రేటు గురించి చెబుతుండగా నినాదాలతో అడ్డుకోవాలని ప్రయత్నించిన విపక్ష సభ్యులను ఉద్దేశించి, ఎమ్మెల్యేలంటే మైకులు విరగ్గొట్టడం కాదనీ, బెంచీలు ఎక్కడం, స్పీకర్ పై దాడి చేయడం కాదని బాబు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఆర్థికాంశాల పట్ల అవగాహన కూడా ఉండాలి కాబ‌ట్టే తాను ఆర్థిక పాఠాలు చెబుతున్నానని చంద్రబాబు అన్నారు. మంచి పనులు చేసినంత కాలం తానే ముఖ్యమంత్రినని ఉద్ఘాటించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/