Begin typing your search above and press return to search.

విశాఖ మీద కొత్త ఎత్తుగ‌డ మొద‌లైంది

By:  Tupaki Desk   |   29 Sep 2016 11:31 AM GMT
విశాఖ మీద కొత్త ఎత్తుగ‌డ మొద‌లైంది
X
స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు... 2014లో జ‌రిగిన‌ సార్వ‌త్రిక ఎన్నిక‌ల త‌ర్వాత సుమారు రెండున్న‌రేళ్ల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ లో జ‌ర‌గ‌నున్న ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌లు. 2019 ఎన్నిక‌ల‌కు కూడా దాదాపు ఇంతే స‌మ‌యం ఉంది. ఈ నేప‌థ్యంలో అధికారంలో టీడీపీ-బీజేపీలు ఈ పోరును ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకొని ముందుకు సాగుతున్నాయి. అయితే గ్రేట‌ర్ విశాఖ ఎన్నిక‌ల‌పై ప్ర‌త్యేకంగా దృష్టిసారించాయ‌ని చెప్తున్నారు. అయితే ఈ విష‌యాన్ని నేరుగా చెప్ప‌కుండా ప‌రోక్షంగా ప్ర‌చారం చేస్తున్నాయ‌నే చ‌ర్చ సాగుతోంది. ఐఎఫ్‌ ఆర్‌ - సిఐఐ స‌మ్మిట్‌ - బ్రిక్స్ స‌ద‌స్సు - అంతర్జాతీయ సీ ఫుడ్‌ ఫెస్టివల్‌ తదితర మెగా కార్యక్రమాలతో ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నాలు చేస్తున్నాయని అంటున్నారు.

2012 ఫిబ్రవరి 25తో జీవీఎంసీ పాలకవర్గం రద్దయింది. తొలుత కాంగ్రెస్‌ - తరువాత టీడీపీ ప్రభుత్వాలు నాలుగున్నరేళ్లుగా ప్రత్యేకాధికారుల పాలనతోనే నడిపిస్తున్నాయి. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఇటీవల హైకోర్టు తీర్పు ఇవ్వడంతో చంద్రబాబు ప్రభుత్వం అనివార్యంగా ఎన్నికలకు సిద్ధపడుతోంది. అయితే జీవీఎంసీ ఎన్నికల్లో నెగ్గుకురావడానికి టీడీపీ-బీజేపీలు మల్లగుల్లాలు పడుతున్నాయి. టీడీపీ గద్దెనెక్కి రెండున్నరేళ్లయినా ఒక్క హామీనీ అమలు చేయకపోవడంపై గ్రేటర్‌ విశాఖ ప్రజల్లో అసంతృప్తి గూడు కట్టుకుంది. అయితే చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయి ఈవెంట్లు విశాఖలో నిర్వహించి అదే అభివృద్ధిగా - ఘనతగా చెప్పుకొనే ప్రయత్నం చేస్తోందని ప‌లువురు విమ‌ర్శిస్తున్నారు. ఈ ఏడాది జనవరిలో భారతీయ పరిశ్రమల సమాఖ్య (సిఐఐ) సమావేశం - ఫిబ్రవరిలో అంతర్జాతీయ నౌకా విన్యాసం (ఐఎఫ్‌ ఆర్‌) విశాఖలో జరిగాయి. ఈనెలలో బ్రిక్స్‌ దేశాల పట్టణీకరణ సదస్సు - సముద్ర ఆహార ఉత్పత్తుల సమ్మేళనం నిర్వహించారు. గతేడాది చివర్లో కామన్వెల్త్‌ దేశాల స్పీకర్ల సదస్సు ఇక్కడే నిర్వహించారు. ఈ ఏడాది చివర్లో సిఐఐ సదస్సును నిర్వహించే ప్రయత్నాల్లో ఉన్నారు. నెలకు కనీసం రెండు సార్లు విశాఖ వస్తున్న చంద్రబాబు ప్రతి సందర్భంలోనూ ఈ ఈవెంట్ల గురించే గొప్పగా చెబుతున్నారు. నగర ప్రజలకు పూర్తిస్థాయిలో తాగునీటి కల్పన - మురుగునీటి వ్యవస్థ ప్రక్షాళన - ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణ - విద్య - వైద్యం - గృహవసతి - ఉపాధి వంటివి పట్టకుండా ఈ ఈవెంట్లతో ఏం ఒరుగుతుందన్న ప్రశ్న సర్వత్రా వినిపిస్తోంది. పైగా ఈ కార్యక్రమాల కోసం జివిఎంసి - వుడా నుంచి రూ.కోట్లు ఖర్చు చేయిస్తున్నారు. దీంతో ఆ మేరకు ప్రజల అభివృద్ధికి నిధులు కుంటుపడుతున్నాయి.

ఉత్తరాంధ్ర జిల్లాలకు కేంద్రం అంతంతమాత్రంగా విదుల్చుతున్న రూ. 50 కోట్ల ప్రత్యేక ప్యాకేజీ నిధులను కూడా ఖర్చు చేయలేని రాష్ట్ర ప్రభుత్వ పెద్దల వైఫల్యాలపై మేథావులంతా ఘోషిస్తున్నారు. ఐటి రంగంలో పెట్టుబడులు రాక నిరుద్యోగులు రగిలిపోతున్నారు. హుదూద్‌కు కకావికలమైన ప్రజానీకంలో అత్యధికులకు నేటికీ పరిహారం అందలేదు. ఇళ్లు కూలిన వారిలో ఒక్కరికీ నివాసం నిర్మించలేదు. మత్స్యకారులకు సాయం అంతంతే! దెబ్బ తిన్న బోట్లను మరమ్మతులు చేసుకునేందుకు తగిన సాయం అందించలేదు. బాధితులంతా ప్రభుత్వంపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేక హోదా - విశాఖ రైల్వే జోన్‌ విషయంలో ప్రభుత్వాల వైఖరి పట్ల కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అయితే చంద్ర‌బాబు ప్ర‌భుత్వం మాత్రం ప్ర‌చారం తోనే ఎన్నిక‌ల బ‌రిలోకి సాగిపోతుంద‌ని చ‌ర్చ సాగుతోంది.