Begin typing your search above and press return to search.

చంద్ర‌బాబుకు ఎంత ధైర్యం!

By:  Tupaki Desk   |   27 Aug 2015 3:43 PM GMT
చంద్ర‌బాబుకు ఎంత ధైర్యం!
X
తెలుగుదేశం అధినేత‌, ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ కు ప్ర‌త్యేక హోదాపై తెగ భ‌రోసాతో ఉన్నారు. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ తో ఢిల్లీలో స‌మావేశం, మోడీ నిరాస‌క్త స‌మాధానం ఇవ్వ‌డం అదే స‌మ‌యంలో ఆర్థిక‌మంత్రి సైతం పొడిపొడిగా స్పందించిన తీరు ఏపీకి ప్ర‌త్యేకంపై ఆశ‌ల్ని గ‌ల్లంతు చేశాయి. అయినా బాబు త‌న భ‌రోసాను కాపాడుకుంటున్నారు. ఈమేరకు విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... విష‌యాలు, వివ‌రాలు వెల్ల‌డించారు.

ఏపీకి ప్రత్యేక హోదా వచ్చి తీరుతుందని సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు. ప్రధాని మోడీతో గంటన్నర సేపు మాట్లాడానని బాబు చెప్పారు. ప్రత్యేక హోదా ఇవ్వకపోతే నష్టపోతామని మోడీకి తెలిపినట్లు బాబు పున‌రుద్ఘాటించారు. విభజన చట్టంలోని అంశాలు, రాష్ట్ర సమస్యలను ప్రధానితో పాటు ఆర్థికమంత్రికి వివరించినట్లు తెలిపారు. ప్రత్యేకహోదా చాలా సున్నితమైన అంశమని పేర్కొన్నారు. సమస్య పరిష్కారమయ్యే వరకు పోరాటం చేస్తానని, సమస్యలు అధిగమించే కార్యక్రమాలు రూపొందించినట్లు బాబు తెలిపారు. రాష్ట్రంలో రైతులు ఆత్మహత్య చేసుకోవద్దని, ప‌రిస్థితులు చ‌క్క‌దిద్దుతాన‌ని చెప్పారు.

తాను రాష్ట్ర అభివృద్ధికి, భవిష్యత్ తరాల కోసం ప్రయత్నాలు చేస్తున్నానని స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో పెట్టిన హామీలన్నింటినీ నెరవేరుస్తామని మరోసారి బాబు తేల్చి చెప్పారు. కాంగ్రెస్, వైసీపీలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.... రాష్ట్రాభివృద్ధిని చూసి ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయని చంద్ర‌బాబు మండిపడ్డారు. విభజనతో రాష్ట్రానికి అన్యాయం జ‌రిగింద‌ని....ఒక పద్ధతి, విధానం లేకుండా ఇష్టానుసారంగా రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ నేతలు... ఇప్పుడు కూడా అదే రీతిలో ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ కు విమర్శించే నైతిక హక్కు, తనపై ఆరోపణలుచేసే అర్హత లేదన్నారు. ఏపీకి కాంగ్రెస్ అడుగడుగునా అన్యాయం చేసిందని.. దానికి వైసీపీ వంతపాడిందని విమర్శించారు. ఆ పార్టీల‌కు రాజకీయాలు కావాలని, తనకు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమని స్పష్టం చేశారు.