Begin typing your search above and press return to search.

పిటిషన్లకే ఉలికిపాటు ఎందుకు చంద్రబాబు

By:  Tupaki Desk   |   20 Sep 2017 8:05 AM GMT
పిటిషన్లకే ఉలికిపాటు ఎందుకు చంద్రబాబు
X
చంద్రబాబునాయుడు ప్రతిపక్షాన్ని చూసి జడుసుకోవడం కాదు వారు కోర్టులో వేసే పిటిషన్ లకు కూడా జడుసుకుంటునట్లుగా ప్రజలు భావిస్తున్నారు. ఆయన మాటలని గమనిస్తే నిజమే అనిపిస్తుంది ఎందుకంటే తాజాగా సదావర్తి భూముల వ్యవహారం లో వైసిపి ఎం.ఎల్.ఎ. ఆళ్ళ రామకృష్ణ రెడ్డి వేసిన పిటిషన్ పుణ్యమా అని ప్రభుత్వం పరువు పోయిన సంగతి అందరికి తెలిసిందే. సదావర్తి భూములని ఏకంగా దాదాపు నలభై కోట్లరూపాయల వ్యత్యాసంతో తెలుగు దేశం నాయకులకు కట్టబెట్టేందుకు చేసిన ప్రయత్నాలన్నీ ఆళ్ళ రామకృష్ణా రెడ్డి పిటిషన్ తో బయటపడ్డాయి. ఇలాంటి నేపధ్యంలో ప్రభుత్వం పరువు పోవడానికి పరోక్షంగా ప్రతిపక్షం ఎం.ఎల్.ఎ పిటిషన్ వేయడమే కారణమని ప్రజలు కుడా నమ్మే పరిస్థితి వచ్చింది. అలాగే చంద్రబాబు ఉంటున్న నివాసమే అక్రమ నిర్మాణం అంటూ మరో కేసు కూడా కోర్టు వద్దకు వచ్చింది. బహుశా ఇందుకేనేమో చంద్రబాబు పిటిషన్ లన్నా, ప్రతిపక్షం అన్నా భయపడుతున్నారనేది ప్రజల భావన.

కర్నూలు జిల్లాలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ అసలు ప్రతిపక్షం అనేదే ఈ రాష్ట్రానికి అనవసరమని వారిని పూర్తిగా రాష్ట్రం లో లేకుండా చేసేయాలని చంద్రబాబు తన అంతరంగాన్ని బయటపెట్టారు. అభివృద్ధి పనులని అడ్డుకోవడం తప్ప ప్రతిపక్షం చేస్తున్నది ఏమీ లేదంటూ ఆయన వాళ్లకి ఒక రంగు పులిమే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్షానికి డిపాజిట్లు కుడా దక్కనివ్వకుండా వారిని పూర్తిగా వోడించాలని నూట డెబ్బై అయిదు సీట్లను తెలుగు దేశం పార్టీకే కట్టబెట్టాలని చంద్రబాబు నాయుడు కోరుతున్నారు.

అయినా ప్రతిపక్షం ఈ రాష్ట్రానికి అవసరమా లేదా అన్న సంగతిని ప్రజలు నిర్ణయిస్తారు. ప్రతిపక్షం అక్కరలేదు అని నిర్ణయించేది పాలక పక్షం కాదు. పాలక పక్షం ఎప్పుడూ ప్రతిపక్షం వద్దనే కోరుకుంటుంది. తాము ఆడింది ఆటగా పాడింది పాటగా చెలరేగిపోవాలంటే ప్రతి పక్షం ఉండకూడదు. ఆలాంటి పరిస్థితి లేకుండా ఎక్కడికక్కడ బ్రేకులు వేస్తూ పగ్గాలు పట్టుకుని తాము సరైన రీతిలో సక్రమంగా ప్రజాసేవలో ముందుకు వెళ్ళే లాగా అదిలిస్తూ వ్యవహరించేది ప్రతిపక్షమే కాబట్టి అలాంటి ప్రతిపక్షం వుండకూడదని పాలక పక్షం కోరుకోవడంలో వింతేమి లేదు. మొన్నటికి మొన్న ప్రతిపక్షం పుణ్యం వల్లనే కదా.. ఖజానాకు ఎక్కువ లాభం వచ్చింది. అలాంటప్పుడు రాష్ట్రంలో ప్రతిపక్షమే వద్దని తాను అంటే ప్రజలు నమ్ముతారని చంద్రబాబు ఎలా అనుకుంటారో అర్థం కావడం లేదని ప్రజలు భావిస్తున్నారు.

ఎక్కువ కాలం ప్రతిపక్ష నాయకుడిగా పని చేసిన చంద్రబాబు నాయుడు ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వకుండా స్వచ్చమైన పాలన చేసి ప్రతిపక్షాన్ని మారు మాట్లకుండా చేయాలి గాని అసలు ప్రతిపక్షమే లేకుండా చేయాలి అని చెప్పటం విడ్డూరంగా ఉందని ప్రజలు నవ్వుకుంటున్నారు.