Begin typing your search above and press return to search.

బాబు టెలికాన్ఫరెన్సంటే చాగంటి ప్రవచనమేనా?

By:  Tupaki Desk   |   29 Sep 2016 5:30 PM GMT
బాబు టెలికాన్ఫరెన్సంటే చాగంటి ప్రవచనమేనా?
X
చంద్రబాబు గత టెర్ములో సీఎంగా ఉన్నప్పుడు అధికారులు ఆయన పేరు వింటేనే వణికిపోయేవారు. చంద్రబాబు కూడా ఉద్యోగులను ఉరుకుల పరుగులు పెట్టించి టెర్రర్ సృష్టించారు. ఆ దెబ్బకే ఉద్యోగులు ఆయనకు వ్యతిరేకంగా మారి ఎన్నికల్లో ఓడించారు. 2014లో మళ్లీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆయన ఉద్యోగులను ఊరడిస్తున్నా అధికారులను మాత్రం పరుగులు తీయిస్తున్నారు. ముఖ్యంగా అర్ధరాత్రి వరకు సమావేశాలు - నివేదికలు - టెలి కాన్ఫరెన్సులు - వీడియో కాన్ఫరెన్సులు అంటూ ఖాళీ ఉంచడం లేదు. దీంతో మొదట్లో అధికారులు చాలా ఇబ్బందులు పడ్డారు. మీటింగు అంటేనే చాలామంది టెన్షన్ వచ్చేసేది. కొందరైతే సుదీర్ఘ సమావేశాల్లో ఉండలేక స్పృహ తప్పిన సందర్భాలూ ఉన్నాయి. అలాంటిది రెండేళ్లు తిరిగేసరికి పరిస్థితి మారిపోయింది.... అధికారులు మెల్లగా చంద్రబాబు సోది మీటింగులకు విరుగుడు కనిపెట్టేశారు. దాంతో వారు ఇంతకుముందులా టెన్షన్ పడడం లేదు... చాలా లైట్ గా తీసుకుంటున్నారట.

మొదట్లో రోజూ ఉదయమే కాన్ఫరెన్స్‌ అనే సరికి అధికారులు తొలుత కంగారు పడేవారు. చంద్రబాబు టెలికాన్ఫరెన్స్‌ లతో తమ వ్యక్తిగత సమయంతో పాటు ఆఫీస్ సమయం కూడా వృధా అవుతోందనేది వారి వాదన. ఏ అధికారిని కదిపినా ఒకే మాట.... సీఎం చెప్పిందే చెప్పి విసిగిస్తున్నారని అంటారు. కానీ.. ముఖ్యమంత్రి కావడంతో ఆయనకు చెప్పేవారు లేరు.. అలా అని మీటింగును ఎగ్గొట్టడం కూడా కుదరదు. కానీ.. ఉదయం 8.30కే టెలికాన్ఫరెన్స్‌ లు మొదలుపెట్టేసరికి అధికారులు కుటుంబపరంగానూ - వ్యక్తిగతంగానూ ఇబ్బందులు పడుతున్నారు. సీఎంతో కాన్ఫరెన్స్ అంటే గంట ముందే సిద్ధం కావాలి. అంటే తెల్లవారుజామునే లేచి కుటుంబసభ్యుల సంగతి పక్కన పడేసి చంద్రబాబు ఫోన్‌ కాల్‌ కోసం ఎదురుచూస్తూ ఉండాలి. మొదట్లో రాత్రి పడుకున్నప్పటి నుంచే మరునాటి ఉదయం కాన్ఫరెన్సును మైండులో పెట్టుకుని తెగ భయపడేవారు అధికారులు. పొద్దున్న లేచాకా ఒకటే టెన్షన్... కానీ.... ఎన్నాళ్లలా..? రోజూ ఇంట్లో పనులు కూడా మానుకుని చంద్రబాబు ఫోన్ కోసం ఎదురుచూడడం కుదరదు కదా. అందుకే మెల్లమెల్లగా లైట్ గా తీసుకోవడం మొదలుపెట్టారు. పైగా టెలికాన్ఫరెన్సే కావడంతో ఇప్పడు దానికి అలవాటు పడిపోయారు. ఇంతకుముందులా హడావుడి లేదు. టక్ చేసుకుని టై కట్టుకుని టీపాయ్ పై ఫోన్ పెట్టి దాని ఎదురుగా కూర్చుని ఏ కాల్ వచ్చినా చంద్రబాబే అనుకోవడం మానేశారు. సెల్‌ ఫోన్లకు ఇయర్‌ ఫోన్లు కానీ.. లేదంటే చెవులకు బ్లూ టూత్ కానీ తగిలించి తమ పని తాము చేసుకుంటున్నారట.

బాత్‌ రూమ్‌ వెళ్లినా మొబైల్‌ తీసుకునే వెళ్తున్నారట కొందరు అధికారులు. కొందరు చంద్రబాబు కాల్ చేసేటప్పటికి మంచం కూడా దిగడం లేదట - ఇంట్లో వాళ్లు చంద్రబాబు నుంచి ఫోన్ అని చెబితే అప్పుడు చెవులకు తగిలిస్తున్నారట.

అంతేకాదు... చంద్రబాబు కూడా రోజూ చెప్పిన విషయాలే చెబుతుండే సరికి మ్యాటర్‌ ను మరీ సీరియస్‌ గా వినాల్సిన అవసరం అధికారులకు ఉండడం లేదు. కాన్ఫరెన్స్ మొదలవగానే చంద్రబాబే ఒక గంటపాటు తాను చెప్సాల్సింది చెబుతూ వెళ్తుంటారు. చివర్లో ముగ్గురు నలుగురు అధికారులు మాత్రమే తమ అభిప్రాయాలను చెబుతుంటారు. దీంతో మిగిలిన అధికారులంతా కాన్ఫరెన్స్‌ ను వింటూ గడిపేస్తున్నారు. ఈ విషయం కొందరు సీనియర్ మంత్రులకు కూడా తెలిసినా చంద్రబాబుకు చెప్పేందుకు వెనుకాడుతున్నారట. చంద్రబాబుకు ఎవరు చెప్పినా చెప్పకపోయినా అతి సర్వత్ర వర్జయేత్ అన్న సూత్రం తెలుసుకుంటే చాలు ఆయన విషయం అర్థమైపోతుంది. పదిహేను రోజులకో - నెలకో ఒకసారి నిర్వహిస్తే ఆ సీరియస్ నెస్ ఉంటుంది కానీ రోజూ అనేసరికి ఎవరికైనా మొహం మొత్తేయడం - తేలిగ్గా తీసుకోవడం సాధారణమే కదా. అందుకే అధికారుల్లో 99 శాతం మంది చంద్రబాబు టెలికాన్ఫరెన్సును చాగంటి ప్రవచనాలు విన్నట్లుగా వింటున్నారట.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/