Begin typing your search above and press return to search.

జ‌పాన్ త‌ర‌హా నిర‌స‌న‌ల‌కు బాబు మంగ‌ళం

By:  Tupaki Desk   |   14 Jun 2018 6:30 AM GMT
జ‌పాన్ త‌ర‌హా నిర‌స‌న‌ల‌కు బాబు మంగ‌ళం
X
ఆంధ్ర‌కు ప‌దేళ్లు ప్ర‌త్యేక హోదా అని గ‌త ఎన్నిక‌ల్లో హామీ ఇచ్చి అధికారంలోకి వ‌చ్చిన చంద్ర‌బాబు ఆ త‌రువాత హోదా ఇవ్వ‌డం సాధ్యం కాద‌ని కేంద్రం తేల్చిచెప్ప‌డంతో హోదా వ‌ద్దు ప్యాకేజీ ముద్దు అంటూ కేంద్రం నుండి వ‌చ్చిన నిధుల‌ను అడ్డ‌గోలుగా ఖ‌ర్చు చేశాడు. వాటికి లెక్క‌లు ఇవ్వ‌క‌పోవ‌డంతో కేంద్రం నిధులు ఇవ్వ‌డం మానేసింది. దీంతో ఏం చేయాలో పాలుపోని చంద్ర‌బాబు కేంద్రం ఆంధ్ర అభివృద్దిని అడ్డుకుంటుంద‌ని - ఆంధ్రా ప్ర‌జ‌ల‌ను మోసం చేసింద‌ని రాద్దాంతం మొద‌లుపెట్టాడు. ప్ర‌జ‌ల నుండి వ్య‌తిరేక‌త ఎక్కువ కావ‌డంతో కొన్నాళ్ల క్రితం జ‌పాన్ త‌ర‌హాలో ఎక్కువ గంట‌లు ప‌నిచేసి కేంద్రానికి నిర‌స‌న‌లు తెలుపుదామ‌ని గొప్ప‌గా సెల‌విచ్చాడు.

ప్ర‌క‌ట‌న అయితే చేశాడు గానీ ఆ విధంగా నిర‌స‌న తెలిపిన దాఖ‌లాలు ఎక్క‌డా లేవు. ఆ వెంట‌నే ఈ మ‌ధ్య జూన్ 2 నుండి న‌వ‌నిర్మాణ దీక్ష అంటూ ప్ర‌జ‌ల సొమ్మును అడ్డ‌గోలుగా ఖ‌ర్చు చేస్తూ జిల్లాల వారీగా దీక్ష‌లు చేస్తూ వ‌చ్చాడు. బాబు ఎంత మొత్తుకున్నా ఇచ్చిన నిధుల‌కు లెక్క‌లు ఇవ్వాల్సిందేన‌ని కేంద్రం తేల్చిచెప్ప‌డంతో బీజేపీ మీద రోజురోజుకూ కోపం పెంచుకుంటున్నాడు చంద్ర‌బాబు. అప్పుడు ప్యాకేజీ అన్న బాబు ఇప్పుడు ప్ర‌త్యేక‌హోదా అంటూ చిలుక‌ప‌లుకులు ప‌లుకుతున్నాడు.

ఈ వ్య‌వ‌హారం ఇలా ఉండ‌గానే తాజాగా క‌డ‌ప ఉక్కు కార్మాగారం ఏర్పాటు చేయ‌డం కుద‌ర‌ద‌ని కేంద్రం స్ప‌ష్టం చేసింది. ఈ విష‌యం ఇప్పుడే కొత్త‌గా చెప్ప‌లేదు. మూడున్నరేళ్ల క్రిత‌మే చెప్పింది. అప్ప‌ట్లో చ‌ప్పుడు చేయ‌ని చంద్ర‌బాబు ఇప్పుడు ఉక్కు కార్మాగారాలు ఇవ్వ‌కుండా కేంద్రం నిర్ల‌క్ష్యం చేస్తుంద‌ని - నిర‌స‌న‌గా కార్యకర్తలు ర్యాలీలు తీయాలని - దర్నాలు చేయాలని పిలుపు ఇచ్చారు. ఇంత‌కుముందు ప్ర‌తిప‌క్షాలు ఇవే త‌ర‌హా ఆందోళ‌న‌లు చేస్తే విమ‌ర్శించిన చంద్ర‌బాబు ఇప్పుడు త‌నే ఆందోళ‌న‌ల‌కు పిలుపునివ్వ‌డం గ‌మ‌నార్హం. అయితే మొన్న‌టికి మొన్న జ‌పాన్ త‌ర‌హా ఆందోళ‌న అన్న చంద్ర‌బాబు అప్పుడే వాటికి మంగ‌ళం పాడ‌డం విశేషం. అమ‌రావ‌తి నిర్మాణానికే ఆరు దేశాల డిజైన్లు వేయించిన చంద్ర‌బాబు ఆందోళ‌న‌ల విష‌యంలో మాత్రం మాట మీద నిల‌బ‌డ‌తాడా ? అని అంతా న‌వ్వుకుంటున్నారు.