Begin typing your search above and press return to search.

కాపుల కోసం బాబు ఇంత రిస్క్ చేస్తున్నారా?

By:  Tupaki Desk   |   12 Feb 2016 9:14 AM GMT
కాపుల కోసం బాబు ఇంత రిస్క్ చేస్తున్నారా?
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టించిన కాపు రిజర్వేషన్ ఆందోళన-దాని పర్యవసానాలు - ప్రభుత్వం తరఫున ఇప్పటికే తీసుకున్న చర్యలతో పాటు మ‌రో కీల‌క అడుగు వేసేందుకు సిద్ధ‌మ‌వుతోంది. కాపులకు టీడీపీ అధిక ప్రాధాన్యత ఇస్తూ వస్తోందన్న విషయం ప్రజలకు స్పష్టం చేసేందుకు ఒక వ్యూహం రూపొందించాలని భావిస్తున్నారు. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే చేస్తున్న‌ది, భవిష్యత్తులో ఏం చేయాలన్నదానిపై చర్చించేందుకు ఈ నెల 15 న ప్రత్యేకంగా క్యాబినెట్ సమావేశం ఏర్పాటవుతోంది. మంత్రివర్గ సమావేశాన్ని ప్రత్యేక సమావేశం అనకపోయినప్పటికీ, చర్చంతా కాపు రిజర్వేషన్‌ పైనే ఉంటుందనేది విశ్వసనీయ సమాచారం.

ఇప్పటికే రాష్ట్ర ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప - ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు - పురపాలక వ్యవహారాల మంత్రి డాక్టర్ పి. నారాయణ తదితర మంత్రులంతా రంగంలోకి దిగి కాపులకు చేసింది, చేయాల్సింది అధ్య‌య‌నం చేస్తున్నారు. ఈ క్ర‌మంలో ప్రభుత్వపరంగా ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు, భవిష్యత్తులో చేపట్టాల్సిన చర్యలపై కూలంకుషంగా చర్చించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నారు. ఇందుకు అనుగుణంగా ఫిబ్రవరి 15 న జరిగే మంత్రివర్గ సమావేశాన్ని వినియోగించుకోవాలని నిర్ణయించారు. కాపుల అభ్యున్నతికి ఇప్పటికే తెలుగుదేశం ప్ర‌భుత్వం తీసుకున్న చర్యలతోపాటు ఇరతత్రా కొత్త మార్గాలు ఏవైనా ఉన్నాయా అన్న అంశాన్ని కూడా 15 న జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చించాలని ముఖ్యమంత్రి నిర్ణయించినట్టు తెలిసింది. కాపుల సంక్షేమానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల పట్ల మంత్రులు - ఎంపీలు - ఎమ్మెల్సీలు - ఎమ్మెల్యేలు - ఇతర ప్రజాప్రతినిధులు తొలుత సంతృప్తి చెందితే, ఆ తర్వాత ఈ అంశం ప్రజల్లోకి సులువుగా వెళుతుందని చంద్ర‌బాబు భావిస్తున్నారు. ఇందుకు అనుగుణంగా 15 న జరిగే మంత్రివర్గ సమావేశాన్ని పూర్తిగా వినియోగించుకోవాలని బాబు భావిస్తున్నట్టు తెలుస్తోంది.

ఇప్ప‌టి వ‌ర‌కు తెలుగుదేశం పార్టీ కాపుల కోసం చేసిన అంశాల‌ను ప‌రిశీలిస్తే... కాపుల‌ను బీసీల జాబితాలో కలిపేందుకు వీలుగా బీసీ కమిషన్‌ ను ఏర్పాటు వేశారు. జస్టిస్ మంజునాథ కమిషన్ ఇప్పటికే పని ప్రారంభించింది. 2016 ఆగస్టు 15 లోగా ఈ కమిషన్ నివేదిక ఇచ్చేలా చూడాలని ప్రయత్నిస్తున్నారు. మ‌రోవైపు కాపుల సామాజిక - ఆర్థిక పరిస్థితిని పరిశీలించి, బీసీల జాబితాలో చేర్చేందుకు, చట్టపరంగా ఉన్న అంశాలపై అధ్యయనం ప్రారంభించారు. అన్నీ సానుకూలంగా ఉంటే స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి ప్రసంగంలో కాపుల రిజర్వేషన్ అంశం ప్రస్తావించేందుకు ఇప్పటి నుండే అడుగులు వేస్తున్నారు. ఇదిలాఉండ‌గా కాపులకు ఆర్థికంగా చేయూత ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన కార్పొరేషన్ ద్వారా ఎక్కువమంది కాపు యువతకు, కాపు మహిళలకు ఆర్థికసాయం అందించాలని ప్ర‌భుత్వం వేగంగా క‌స‌ర‌త్తు చేస్తోంది.