Begin typing your search above and press return to search.

నీ తండ్రే ఏం చేయ‌లేక‌పోయాడు...నువ్వెంత‌

By:  Tupaki Desk   |   1 Sep 2015 7:59 AM GMT
నీ తండ్రే ఏం చేయ‌లేక‌పోయాడు...నువ్వెంత‌
X
ఏపీ అసెంబ్లీలో మంగ‌ళ‌వారం టీడీపీ, వైకాపా స‌భ్యుల మ‌ధ్య ర‌గ‌డ ర‌గ‌డ జ‌రిగింది. టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల న‌రేంద్ర‌కుమార్ మాట్లాడుతుండ‌గా వైకాపా స‌భ్యులంద‌రు ఒక్క‌సారిగా స్పీక‌ర్ పోడియం వ‌ద్ద‌కు దూసుకెళ్లారు. ఓటుకు కోట్లు అని రోజా ఆధ్వ‌ర్యంలో వారంతా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో టీడీపీ స‌భ్యులు కూడా పోడియం వ‌ద్ద‌కు వెళ్లి వైకాపా స‌భ్యుల‌తో ఢీ అంటే ఢీ అనే రీతితో వ్య‌వ‌హ‌రించారు. అనంత‌రం చంద్ర‌బాబు మాట్లాడుతూ టీడీపీ స‌భ్యులు సంయ‌మ‌నం పాటించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.

ఇలాంటి ప్ర‌తిప‌క్షం అసెంబ్లీలో ఉండ‌డం తాను ఎప్పుడూ చూడ‌లేద‌ని...తాను విష‌యం ప్ర‌కారం మాట్లాడుతుంటే వైకాపా స‌భ్యులు ఇష్టానుసారం మాట్లాడుతున్నార‌ని విమ‌ర్శించారు. ప‌విత్ర దేవాల‌య‌మైన అసెంబ్లీలో వైకాపా స‌భ్యులు బూతులు మాట్లాడుతున్నార‌ని...స్పీక‌ర్‌ను, సీఎంను తిడితే ఏదో గొప్ప అనుకుంటున్నార‌ని...హుందాత‌నం కాపాడుకోవ‌ల‌ని వైకాపా స‌భ్యుల‌కు ఆయ‌న సూచించారు.

జ‌గ‌న్ టీడీపీపై బుర‌ద జ‌ల్లేందుకు తెరాస‌, కేసీఆర్‌ తో లాలూచీ ప‌డ్డార‌ని..జ‌గ‌న్‌-హ‌రీష్‌ రావు ఎక్క‌డ సీక్రెట్‌ గా క‌లుసుకున్నారో..వారి ర‌హ‌స్య ఎజెండా డాక్యుమెంట్ కూడా త‌న వ‌ద్ద ఉంద‌ని చంద్ర‌బాబు అన్నారు. జ‌గ‌న్‌ ను ఉద్దేశించి మాట్లాడుతూ నీ తండ్రి 25 ఎంక్వైరీలు వేసినా నన్నేమి చేయ‌లేక‌పోయాడు...నువ్వు ఎవ్వ‌రితో లాలూచీ ప‌డినా నన్నేం చేయ‌లేవ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తాను నిప్పు లాంటోడిన‌ని..అవినీతిప‌రుల గుండెల్లో నిద్ర‌పోతాన‌ని అన్నారు. ఏ అవినీతి ప‌రుడిని తాను వ‌దిలిపెట్ట‌న‌ని..ఇందుకు సంబంధించిన చ‌ట్టం కూడా రెఢీ అవుతోందంటూ చంద్ర‌బాబు జ‌గ‌న్‌ పై ఆగ్ర‌హంతో ఊగిపోయారు.