Begin typing your search above and press return to search.

ఎన్నికలకు తొందర పడుతున్న చంద్రుళ్లు

By:  Tupaki Desk   |   26 Jun 2017 6:31 AM GMT
ఎన్నికలకు తొందర పడుతున్న చంద్రుళ్లు
X
తెలుగు రాష్ర్టాల్లో ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉన్నప్పటికీ పాలక పార్టీల అధినేతలు మాత్రం అంత సమయం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. మంత్రులు మొదలుకుని కింది స్థాయి నేతలు వరకు అంతా ఎన్నికలకు ఎప్పుడంటే అప్పుడు సిద్ధం కావాలని సంకేతాలిస్తున్నారు. దీంతో తెలుగు రాష్ర్టాల్లో ముందస్తు ఎన్నికలు తప్పవని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

వాస్తవానికి 2019 మేలో ఆంధ్రప్రదేశ్‌ - తెలంగాణ రాష్ట్రాలకు ఎన్నికలు జరగాలి. కానీ 2018 సెప్టెంబర్‌ నాటికే ఈ రెండు రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగే విధంగా ఇక్కడ అధికార పార్టీలు పావులు కదుపుతున్నట్లు సమాచారం. ప్రధాని మోడీ జాతీయస్థాయిలో రోజురోజుకూ బలపడుతుండడం.... అసెంబ్లీలు - లోక్ సభకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించేలా ఆయన యోచిస్తుండడంతో తెలుగు రాష్ర్టాల అధినేతలు ఆ కోణంలోనే ఆలోచిస్తూ ముందస్తు ఎన్నికలకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది.

ముఖ్యంగా ఏపీలో పాలక పార్టీ టీడీపీకి కేంద్రంలోని బీజేపీతో పొత్తు ఉన్న నేపథ్యంలో ఏకకాల ఎన్నికలు జరిగిన సందర్భంలో బీజేపీకి అధిక స్థానాలు ఇవ్వాల్సి రావొచ్చన్న భావన ఆ పార్టీలో ఉంది. అలా ఇస్తే తమ ప్రాబల్యం తగ్గిపోతుందన్న భయం టీడీపీ అధినేత చంద్రబాబులో ఉంది. పైగా ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే అందులో బీజేపీ ప్రభావం - డామినేషనే ఎక్కువగా కనిపించొచ్చు. దీంతో ఈ ఎన్నికల విధానం పూర్తిగా అమల్లోకి రాకముందే ఏపీలో ఎన్నికలు పెట్టేయాలని చంద్రబాబు అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణలోనూ పాలక టీఆరెస్ అధినేత - సీఎం కేసీఆర్ కూడా ఇదే ఆలోచనలో ఉన్నట్లుగా రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. దీంతో రెండు రాష్ర్టాల్లోనూ 2018 సెకండాఫ్ లో ఎన్నికలు రావడం ఖాయమంటున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/