Begin typing your search above and press return to search.

మోడీ..ఇద్ద‌రు చంద్రుళ్ల మీటింగ్‌ లో ఏం చ‌ర్చిస్తారంటే

By:  Tupaki Desk   |   17 Jun 2018 4:30 AM GMT
మోడీ..ఇద్ద‌రు చంద్రుళ్ల మీటింగ్‌ లో ఏం చ‌ర్చిస్తారంటే
X
ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ అధ్య‌క్షత‌న ఆదివారం ఢిల్లీలో కీల‌క స‌మావేశం జ‌ర‌గ‌నున్న సంగ‌తి తెలిసిందే. నీతి ఆయోగ్ నాలుగో పాలక మండలి సమావేశానికి హాజ‌ర‌య్యేందుకు ఈ పాటికే తెలుగు రాష్ర్టాల ముఖ్య‌మంత్రులైన నారా చంద్ర‌బాబు నాయుడు - కే చంద్ర‌శేఖ‌ర్ రావు ఢిల్లీకి చేరారు. వీరితో పాటుగా అన్నిరాష్ర్టాల కేంద్రమంత్రులు - లెఫ్టినెంట్ గవర్నర్లు - సీనియర్ అధికారులు హాజరు కానున్నారు. మరో నాలుగేళ్ల‌లో (2022 నాటికి) రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలంటూ కేంద్రం నిర్దేశించిన లక్ష్యాన్ని చేరేందుకు నీతి ఆయోగ్ రాష్ట్ర ప్రభుత్వాల సహకారాన్ని కోరనుంది.

రాష్ట్రపతి భవన్‌ లో ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన జరుగనున్న ఈ సమావేశంలో దేశంలో నెలకొన్న వ్యవసాయ సంక్షోభం పరిష్కారానికి తీసుకోవలసిన చర్యలపై ప్రధానం గా చర్చించనున్నారు.ఆయుష్మాన్ భారత్ పథకం అమలుకు కూడా కేంద్రం రాష్ర్టాల మద్దతును కోరనుంది. ఈ పథకం కింద దేశంలోని 50 కోట్ల మందికి ఆరోగ్య బీమా సదుపాయాన్ని కల్పించనున్నారు. శిశువులకు - తల్లులకు రోగ నిరోధక టీకాలు ఇచ్చే మిషన్ ఇంద్రధనుష్ కార్యక్రమ విస్తరణ అంశం కూడా సమావేశం ఎజెండాలో ఉంటుంది. వచ్చే ఏడాది మహాత్మాగాంధీ 150వ జయంతిని పురస్కరించుకొని నిర్వహించబోయే కార్యక్రమాల గురించి కూడా చర్చించ‌నున్నారు. రాష్ర్టాలు వ్యవసాయ మార్కెటింగ్ సంస్కరణలను - ఇ-నామ్ (జాతీయ వ్యవసాయ మార్కెట్)ను చేపట్టేలా ప్రోత్సహించడంపైనే ఈ సమావేశంలో ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తారు. పోషకాహారం - కొత్త జిల్లాల ఏర్పాటుకు డిమాండ్లపై కూడా చర్చ జరుగుతుంది.