Begin typing your search above and press return to search.

బాబు కష్టం..బూడిదలో పోసినట్టేనా?

By:  Tupaki Desk   |   20 May 2019 1:30 AM GMT
బాబు కష్టం..బూడిదలో పోసినట్టేనా?
X
టీడీపీ అధినేత - ఏపీ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పడ్డ కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరేనా? అన్న ప్రశ్న ఇప్పుడు బాగానే వినిపిస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో చివరి దశ పోలింగ్ ముగిసిన వెంటనే వెలువడ్డ ఎగ్జిట్ పోల్ ఫలితాలు చూసిన వారంతా ఇదే విషయంపై ఆసక్తికర చర్చలకు తెర తీశారు. రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉన్నా... కేంద్రంలో మాత్రం మరోమారు మోదీ ప్రధాని గద్దెనెక్కకుండా చేయడమే లక్ష్యంగా చంద్రబాబు బాగానే కష్టపడ్డారు. కాళ్లకు చక్రాలు కట్టుకున్న మాదిరిగా... ఢిల్లీ - లక్నో - ముంబై - బెంగళూరు - కోల్ కతా తదితర నగరాలను ఆయన చుట్టేశారు. బీజేపీయేతర పార్టీలన్నింటినీ ఒక్కతాటిపైకి తీసుకొస్తానంటూ - మోదీకి అధికారం దక్కనీయకుండా చేస్తానని కూడా చంద్రబాబు పదే పదే చెప్పారు.

అయితే చివరి దశ పోలింగ్ ముగిసిన మరుక్షణమే వెలువడిన ఫలితాలన్నీ మరోమారు కేంద్రంలో ఎన్డీఏనే అదికారంలోకి వచ్చి తీరుతుందని చెప్పేశాయి. ఏ ఒక్క సర్వే కూడా ఎన్డీఏకు తగిన మెజారిటీ రాదని చెప్పలేదు. 2014లో మాదిరిగా వచ్చిన సీట్లన్ని రాకున్నా... మేజిక్ ఫిగర్ ను ఎన్డీఏ కూటమి దాటేయడం ఖాయమేనని తేల్చేశాయి. అసలు బీజేపీయేతర కూటమికి మేజిక్ ఫిగర్ కాదు కదా... 200 సీట్లు దాటితే మహా గొప్ప అన్న రీతిగా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వచ్చాయి. మరి ఈ నేపథ్యంలో మోదీని అడ్డుకునేందుకు చంద్రబాబు పడ్డ కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరే కదా.

ఓ వైపు చివరి దశ పోలింగ్ జరుగుతూ ఉంటే.. మరోవైపు చంద్రబాబు ఢిల్లీ - లక్నోల మధ్య షటిల్ సర్వీసులేకున్న వాడికి మల్లే తిరిగారు. అఖిలేష్ - మాయావతి - శరద్ పవార్ - సీతారం ఏచూరి - సురవరం సుధాకర్ రెడ్డిలతో వరుస భేటీలు నిర్వహించిన చంద్రబాబు... కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీతోనూ వరుస భేటీలు జరిపారు. అంతేనా చివరి దశ పోలింగ్ నాడే... తాను ఎన్నడూ కలవని యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీతోనూ భేటీ అయ్యారు. మొత్తంగా మోదీని మరోమారు అధికారంలోకి రాకుండా చేసేందుకు చంద్రబాబు ఎంత చేయాలో దానికంటే వెయ్యి రెట్ల మేరనే చేశారు. మరి ఎగ్జిట్ ఫోల్ ఫలితాలేమో మళ్లీ మోదీనే అంటున్నాయి. అంటే... చంద్రబాబు శ్రమ అంతా నిష్పలమేనా? అన్న రీతిలో విశ్లేషణలు సాగుతున్నాయి.