Begin typing your search above and press return to search.

చంద్రబాబు చెప్పినట్టు చేస్తే కేసులుండవంట!

By:  Tupaki Desk   |   13 Sep 2017 11:58 AM GMT
చంద్రబాబు చెప్పినట్టు చేస్తే కేసులుండవంట!
X
ఈ మాట మేము అంటున్నది కాదండీ. స్వయంగా ఆంధ్రపదేశ్ రాష్ర్ట ప్రభుత్వం అంటున్నదే. అధికారులు పాలనాపరంగా తప్పులు చేసినా, నిబంధనలకు విరుద్ధంగా - ప్రభుత్వ ఆర్థిక ప్రయోజనాలకు నష్టం కలిగించే విధంగా నిర్ణయాలు తీసుకున్నా.. ఏ ప్రభుత్వమైనా విచారణకు ఆదేశిస్తుంది. కానీ చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు అందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరించడంపై అధికార వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది. ఒకసారి ఆరోపణలు వచ్చాక వాటిపై విచారణ జరిపించడం లేదా జరిపించకపోవడం అనేది ప్రభుత్వ విచక్షణపై ఆధారపడి ఉంటుంది. అయితే చంద్రబాబు సర్కారు మాత్రం ముందుగానే అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) - విజిలెన్స్‌ విభాగాల ముందరికాళ్లకు బంధం వేస్తూ నిర్ణయం తీసుకోవడం చర్చకు తావిస్తోంది. గతంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు ప్రభుత్వం ఏసీబీ - విజిలెన్స్‌ దర్యాప్తులను నిరోధిస్తూ ఉత్తర్వులు ఇవ్వడం గమనార్హం. తాజాగా ఇప్పుడు కూడా రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక కమిటీ నిర్ణయాలను ఏసీబీ - విజిలెన్స్‌ ల విచారణ పరిధి నుంచి తప్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.

ప్రైవేట్‌ సంస్థలు - వ్యక్తులు నెలకొల్పే యూనిట్లు - పరిశ్రమలకు రాయితీలు - ఆర్థిక ప్రయోజనాలు కల్పించడం - భూములను తక్కువ ధరకు కేటాయించడం వంటి అంశాల్లో సంబంధిత అధికారులపై ఏసీబీ - విజిలెన్స్‌ విచారణ చేపట్టకూడదని పేర్కొంది. భూముల కేటాయింపుల్లో ఎలాంటి అక్రమాలు జరిగినా అవినీతి నిరోధక శాఖ అధికారులు - విజిలెన్సులు కన్నెత్తి కూడా చూడకూడదన్నమాట.

ముఖ్యంగా రహదారులు - రేవులు - అంతర్జాతీయ విమానాశ్రయాలు - లైట్‌ రైల్‌ ట్రాన్స్‌ పోర్టు వ్యవస్థలతోపాటు ప్రైవేట్‌ సంస్థలు - వ్యక్తులు పెట్టే పెట్టుబడి ప్రాజెక్టులకు రాయితీలను కల్పించడం ద్వారా ఆర్థిక ప్రయోజనాలను చేకూర్చే అంశాల్లో నిర్ణయాలు తీసుకునే అధికారులను ఏసీబీ - విజిలెన్స్‌ విచారణల పరిధి నుంచి తప్పిస్తూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు అనుగుణంగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

కంపెనీలకు ఇచ్చిన భూములు - రాయితీల నిర్ణయాలు భవిష్యత్‌ లో తన మెడకు చుట్టుకుంటాయని భావించిన ముఖ్యమంత్రి ముందుజాగ్రత్త చర్యగా ఏసీబీ - విజిలెన్స్‌ విచారణలు చేపట్టకుండా నిర్ణయం తీసుకున్నారంట. ఎటువంటి విచారణలకు వీల్లేకుండా చేయడం ద్వారా.. నిబంధనలు ప్రస్తావిస్తూ బాహాటంగా సంబంధిత ఫైళ్లపై ఏమీ రాయవద్దంటూ అధికారులకు ముఖ్యమంత్రి భరోసా ఇచ్చినట్లే.