Begin typing your search above and press return to search.

ఎంపీలకు బాబు భారీ క్లాస్?

By:  Tupaki Desk   |   30 July 2016 6:36 AM GMT
ఎంపీలకు బాబు భారీ క్లాస్?
X
ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై రాజ్యసభలో జరిగిన చర్చ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఎంపీలు వ్యవహరించిన తీరుపై ఆ పార్టీ అధినేత చంద్రబాబుతీవ్ర అసంతృప్తితో పాటు.. ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. గురువారం సభలో ప్రసంగించిన సీఎం రమేశ్ ప్రసంగంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేయటంతో పాటు.. ఎందుకలా మాట్లాడాల్సి వచ్చిందని ప్రశ్నించినట్లుగా చెబుతున్నారు. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడిని వెనకేసుకొచ్చేలా మాట్లాడిన మాటలతో పార్టీ పరపతి భారీగా దెబ్బ తిందన్న అభిప్రాయం చంద్రబాబు వ్యక్తంచేసినట్లు చెబుతున్నారు.

మిత్రపక్షం అయితే మెతగ్గా వ్యవహరించాల్సిన అవసరం ఏమిటని ఆయన ప్రశ్నించినట్లు సమాచారం. రాష్ట్రం తరఫున మాట్లాడాల్సిన ఎంపీలు.. వ్యక్తుల తరపు మాట్లాడటం ఏమిటంటూ అసహనం వ్యక్తం చేసినట్లుగా చెబుతున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. గురువారం సీఎం రమేశ్ ప్రసంగంపై బాబు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ‘‘బీజేపీ కేంద్రమంత్రి వాదనకు మద్దతు ఇచ్చేలా మాట్లాడాల్సిన అవసరం మీకేంటి? మీరున్నది రాష్ట్రం తరఫున మాట్లాడటానికి. బీజేపీ తరఫున మాట్లాడితే ప్రజలు ఏమనుకుంటారో ఆలోచించరా?మీ వాదనల్లో ఏపీ ప్రజల ఆగ్రహం.. ఆక్రోశం కనిపించలేదు’’ అంటూ క్లాస్ పీకినట్లుగా చెబుతున్నారు.

రాజ్యసభలోని కొందరు నేతల పేర్లను ప్రత్యేకంగా ప్రస్తావించి మరీ.. వారి తీరును చంద్రబాబు తప్పు పట్టినట్లుగా చెబుతున్నారు. సీఎం రమేశ్ తోపాటు సుజనా చౌదరి.. టీజీ వెంకటేశ్ తీరు ఏమాత్రం బాగోలేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. చంద్రబాబు తన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న వేళ కల్పించుకున్న ఒక ఎంపీ.. మిత్రపక్షంగా వెల్ లోకి దూసుకెళ్లటం బాగోదేమో అన్న భావన వ్యక్తం చేసినప్పుడు బాబు మరింత సీరియస్ అయినట్లు సమాచారం.

ఏం ధర్నా చేస్తే మంత్రివర్గం నుంచి వెళ్లిపొమ్మంటారా?..ఒకవేళ అలాంటి మాటే వస్తే బయటకు పోదాం. మనంతట మనం తప్పుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ బయటకు వెళ్లిపోవాలంటే వెళ్లిపోదాం. వాళ్లు వెళ్లిపొమ్మన్నా అతుక్కొని కూర్చోవాల్సిన అవసరం అయితే మనకేం లేదంటూ బాబు బదులిచ్చినట్లుగా చెబుతున్నారు. ఏది ఏమైనా.. మోడీ సర్కారుతో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు. అయితే.. తమ్ముళ్ల వాదనను ఖండిస్తున్న వారు కూడా లేకపోలేదు. ఒకవేళ చంద్రబాబు మోడీ సర్కారుపై అంత పక్కాగా ఉండి ఉంటే.. హోదాపై చర్చకు ముందే.. ఎంపీలతో నేరుగా మాట్లాడి కార్యాచరణను ఎందుకు సిద్ధం చేయనట్లు? అని ప్రశ్నిస్తున్నారు. అంతా అయిపోయాక ఇలా చేశారేంటి? అలా ఎందుకు చేయలేదు? అనే మాటలు చెప్పే బదులు.. హోదా ఇస్తారన్న భరోసా ఎటూ లేదు కాబట్టి.. హోదా గురించి కేంద్రం చేతులు ఎత్తేసిన వెంటనే ఏం చేయాలో స్పష్టంగా చెప్పి ఉండేవారు కదా? అన్న సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. నిజమే.. అది కూడా పాయింటే..?