Begin typing your search above and press return to search.

తెలంగాణ ఉద్య‌మాల గ‌డ్డలో ఏపీకి హోదా స‌ద‌స్సు

By:  Tupaki Desk   |   12 April 2018 12:47 PM GMT
తెలంగాణ ఉద్య‌మాల గ‌డ్డలో ఏపీకి హోదా స‌ద‌స్సు
X
రాజ‌కీయాల్లో ఏదీ అసాధ్యం కాదు. సాధించ‌డానికి న‌డిపించే నాయ‌కుడికి ప‌ట్టుద‌ల ఉండాలి. రాజ‌కీయాల్లో అనుభ‌వాలు చాలా ప‌నికొస్తాయి గాని ఒక్కోసారి అవ‌కాశాలు అనుభ‌వంపై పైచేయి సాధించే సంద‌ర్భాలు లేక‌పోలేదు. ప్ర‌త్యేక హోదా నిబంధ‌న‌ల ప్ర‌కారం దానిని పొంద‌డానికి ఏపీకి ఉన్న ఒకే ఒక్క‌ అర్హ‌త ఆర్థిక లోటు. కానీ... ఆ ఒక్క కార‌ణం చేత ఏపీకి క‌నుక ప్ర‌త్యేక హోదా ఇస్తే అది దేశంలో అన్ని రాష్ట్రాల అవ‌కాశాల‌ను త‌న్నుకుపోతుంద‌న్న ఎరుక కేంద్ర పెద్ద‌ల‌కు ఉండ‌బ‌ట్టే దానిపై క‌న్నుకుట్టి తిర‌స్క‌రించారు. దానికి వాడాల్సిన కుయుక్తుల‌న్నీ వాడారు. సీనియ‌ర్ అయిన చంద్ర‌బాబుకు ఈ విష‌యం తెలిసే... అది రాదేమో - నా హ‌యాంలో డ‌బ్బుల్లేక‌పోతే ఏం చేయలేనేమో అని రాజీ ప‌డ్డారు. కానీ... ఒక్క అర్హ‌త అయినా ఉంది క‌దా అన్న ఒక్క పాయింట్ మీద జ‌గ‌న్ చేసిన మొండి పోరాటం... ఈరోజు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబును యుట‌ర్న్ తీసుకునేలా చేసింది.

దాదాపు ప్ర‌త్యేక హోదా మీద ప్ర‌జలైన కొంద‌రు ఆశ‌లు వ‌దులుకున్నారేమో గాని జ‌గ‌న్ వ‌దులుకోలేదు. అందుకే ఆ జ్వాల ఇంకా వెలుగుతూనే ఉంది. రోజురోజుకీ ప్ర‌జ్వ‌లమై వెలుగుతోంది. పోరాటాలు ఆంధ్రోళ్లు చేయ‌రు అనే అప‌వాదు కూడా పోగొట్ట‌గ‌లిగినంత ఉత్సాహాన్ని రాజ‌కీయ పార్టీల‌తో పాటు జ‌నంలోనూ జ‌గ‌న్ తేగ‌లిగారు. ప్ర‌త్యేక హోదా పోరాటంపై దేశ వ్యాప్తంగా ఎంత బ‌జ్ క్రియేట్ అయ్యిందో ఇటీవ‌ల చూస్తూనే ఉన్నాం. మ‌న‌తో విడిపోయాక తెలంగాణ సోద‌రులు మ‌న గురించి పెద్ద‌గా మాట్లాడ‌లేదు. ముఖ్యంగా మ‌న హక్కుల గురించి వారు నిన‌దించ‌లేదు. ఆ అవ‌స‌రం లేద‌న్న‌ది వేరే విష‌యం. కానీ ఈరోజు ఏపీలో ర‌గిలిన ప్ర‌త్యేక హోదాగ్ని తెలంగాణ‌కు పాకింది.

తెలంగాణ ఉద్య‌మానికి వేదికైన ఉస్మానియా విశ్వ‌విద్యాల‌యంలో ఒక స‌ద‌స్సు జ‌రిగింది. అందులో ఏపీకి ప్ర‌త్యేక హోదా సాధ‌న కూడా ఒక అజెండా! ఈ స‌మావేశంలో పాల్గొన్న‌ది - ఏర్పాటుచేసింది ఆంధ్రులు కాదు. మ‌న సోద‌రులు. తెలంగాణ నేత‌లు ఏర్పాటుచేసిన ఈ రౌండ్ టేబుల్ స‌మావేశంలో తెలంగాణ వారే ఎక్కువ మంది పాల్గొన్నారు. వారిలో తెలంగాణ జ‌న స‌మితి వ్య‌వ‌స్థాప‌కులు - టీజాక్ అధ్య‌క్షులు కోదండ‌రాం కూడా ఉన్నారు. విభజన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 16న తాము జైల్ భరో కార్యక్రమాన్ని చేపడుతున్నామని వారు చెప్పారు. ఏపీ - తెలంగాణ‌ ప్రజలను కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రజా సంక్షేమం పట్టలేదని విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం మాట తప్పిందని తెలంగాణ సీపీఐ కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి విమర్శించారు. ఏపీకి ఇంత అన్యాయం జరుగుతున్నా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మౌనంగా ఎందుకు ఉన్నారని చాడ‌ ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక హోదాపై సీపీఐ మొదటి నుంచి కూడా ఒకే స్టాండ్ పై ఉందని తెలిపారు. ఏపీకి హోదా విష‌యమై కోదండారం కూడా మ‌ద్ద‌తు తెల‌ప‌డం విశేషం.

ప్ర‌త్యేక హోదా పోరాటం కోసం ప్ర‌తి గొంతు గ‌ట్టిగా అడుగుతోంది. ప‌ట్టువిడ‌వ‌కుండా ప్ర‌య‌త్నిస్తే తెలంగ‌ణ సాధ‌న లాగే, ఏపీ ప్ర‌త్యేక హోదా సాధ‌న నెర‌వేర‌కుండా ఉండ‌దు. నిజానికి తెలంగాణ ఇవ్వ‌డం అంశంతో పోలిస్తే ఏపీకి హోదా ఇవ్వ‌డం చిన్న విష‌య‌మే.