Begin typing your search above and press return to search.

సీపీఐ గుడ్‌ బై..చీలిక అంచున కూట‌మి

By:  Tupaki Desk   |   23 Oct 2018 10:37 AM GMT
సీపీఐ గుడ్‌ బై..చీలిక అంచున కూట‌మి
X
టీఆర్‌ ఎస్‌ ను అడ్డుకోవడమే లక్ష్యంగా ఏర్పడిన మహాకూటమిలో పొరపొచ్చాలు తీవ్రస్థాయికి చేరుకుంటున్నాయి. సీట్ల కేటాయింపు అంశంలో కాంగ్రెస్ నేతలు తమపట్ల అవమానకరంగా వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయాలు కూటమిలోని తెలంగాణ జన సమితి (టీజేఎస్) - సీపీఐ నేతల్లో వ్యక్తమవుతున్నాయి. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఆ పార్టీల నాయకులు.. కూటమి నుంచి వైదొలిగే యోచనలో ఉన్నారని సమాచారం. ఈ పరిణామాలతో మహాకూటమికి ఆదిలోనే గట్టి షాక్ తగిలే పరిస్థితులు కనిపిస్తున్నాయి. తాము కోరిన సీట్లపై వైఖరి చెప్పకపోవడమేకాకుండా.. కాంగ్రెస్ నేతలు అవమానకరరీతిలో వ్యవహరిస్తున్నారని టీజేఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. తాము 15 సీట్లు కేటాయించాలని కోరుతుంటే.. రెండుమూడు సీట్లు సర్దుబాటు చేస్తామని చెప్పడంపై ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. తమ పార్టీ నేత కోదండరాం మినహా టీజేఎస్‌ లోని ఇతరులను కాంగ్రెస్ నేతలు ఖాతరు చేయకపోవడం కూడా వారిలో ఆగ్రహానికి కారణమవుతున్నది. పొత్తుల్లో టీడీపీకి ఇస్తున్న ప్రాధాన్యం తమకు ఇవ్వడం లేదని పలువురు టీజేఎస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీనికితోడు కేటాయించే రెండుమూడు స్థానాల్లోనూ కాంగ్రెస్ ఎన్నికల గుర్తుపై పోటీచేయాలన్న డిమాండుతో వారికి పుండుమీద కారం చల్లినట్టయింది.

తాజాగా సీపీఐ పార్టీ త‌న వైఖ‌రిని తేట‌తెల్లం చేసింది. సీట్ల సర్దుబాటుపై మహాకూటమిలో చర్చలు జరుగుతున్నాయని - అయితే రెండు సీట్లను అంగీకరించబోమని సీపీఐ నేత చాడ వెంకట్‌ రెడ్డి అన్నారు. అయితే ఇంత స్ప‌ష్టంగా హెచ్చ‌రిక‌లు చేస్తున్న నేప‌థ్యంలో కూటమి నుంచి బయటకు వెళ్తారా అని ప్ర‌శ్నించ‌గా...కేసీఆర్‌ను ఓడించేందుకు కూటమిలోనే కొనసాగుతామని తెలిపారు. తాను రామగుండం నుంచి పోటీచేస్తానన్న వార్తల్లో నిజం లేదని - హుస్నాబాద్‌ లో తప్ప మరెక్కడా పోటీచేయబోనని చెప్పారు. తెలంగాణలో మహాకూటమితో టీఆర్ ఎస్‌ కు భయం పట్టుకుందని అన్నారు. ఉద్యమ ద్రోహులను మిత్రులుగా - ఉద్యమ కారులను శత్రువులుగా కేసీఆర్ భావిస్తున్నారని వ్యాఖ్యనించారు. రాష్ట్రంలో కేసీఆర్ పాలన గాడి తప్పిందని చాడ ఆరోపించారు.