Begin typing your search above and press return to search.

ఏపీలో హైకోర్టుకు ఓకే... ఒక్క ష‌ర‌తు

By:  Tupaki Desk   |   23 March 2017 5:44 AM GMT
ఏపీలో హైకోర్టుకు ఓకే... ఒక్క ష‌ర‌తు
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ లో హైకోర్టు ఏర్పాటుకు స‌ర్వం సిద్ధం అయింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భవనాన్ని ఏర్పాటు చేసి మౌలిక సదుపాయాలు కల్పిస్తే రాష్ట్ర హైకోర్టును తక్షణం ఏర్పాటు చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ప్రకటించారు. లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో తెలుగుదేశం పక్ష నాయకుడు తోట నర్సింహం అడిగిన ఒక అనుబంధ ప్రశ్నకు సమాధానమిస్తూ రాష్ట్ర విభజన పర్యవసానంగా ఆంధ్రప్రదేశ్‌ లో కొత్త హైకోర్టు భవన నిర్మాణం, ఇతర మౌలిక వసతుల కల్పనను వీలైనంత త్వరగా పూర్తిచేయాలని ఆయన సూచించారు. వీలైనంత త్వరగా కొత్త హైకోర్టు భవన నిర్మాణం పూర్తయితే ఏపీ - తెలంగాణ రాష్ట్రాలకు విడివిడిగా హైకోర్టులను ఏర్పాటు చేసే ప్రక్రియను కేంద్రం వేగవంతం చేస్తుందని ఆయన ప్రకటించారు.

రాష్ట్ర విభజన చట్టం ప్రకారం హైదరాబాద్‌ నగరం పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా కొనసాగుతుందని గుర్తుచేసిన కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ - హైకోర్టు విభజన విషయంలో తాను రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చలు జరుపుతూనే ఉన్నానని చెప్పారు. టీడీపీ సభ్యుడు ఒకేసారి పలు అనుబంధ ప్రశ్నలు అడిగినప్పటికీ తాను ఏపీలో హైకోర్టు ఏర్పాటుకు సబంధించిన ఒక ప్రశ్నకు మాత్రమే సమాధానమిస్తానన్న కేంద్ర మంత్రి ఏదైనా కొత్త రాష్ట్రం ఏర్పడినప్పుడు దానికి ఖచ్చితంగా ప్రత్యేక హైకోర్టును కూడా నెలకొల్పాల్సిందేనని, ఏపీలో కొత్త హైకోర్టు పని చేసేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు వీలైనంత త్వరగా సిద్ధం కావాలని తాను కోరుకొంటానని చెప్పారు. ఏపీలో కొత్త రాజధాని నిర్మాణం సాగుతున్న తీరు ప్రశంసనీయమన్న మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ హైకోర్టుకు కూడా త్వరగా కొత్త భవన నిర్మాణం త్వరగా పూర్తయ్యేలా చూడాలని టీడీపీ సభ్యునికి సూచించారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో హైకోర్టును నెలకొల్పేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొన్న చర్యలేమిటి?, రాష్ట్రంలో పేరుకుపోతున్న కేసుల సత్వర పరిష్కారానికి జనాభా -న్యాయమూర్తుల నిష్పత్తిని పెంచే ప్రతిపాదన ఏమైనా ఉందా, విశాఖపట్నం - తిరుపతిలో హైకోర్టు బెంచ్‌ ను ఏర్పాటు చేసే ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో ఉందా?, ఏపీలో హైకోర్టు - జిల్లా - తాలూకా కోర్టులు నెలకు సగటున పరిష్కరిస్తున్న కేసుల సంఖ్యను వివరిస్తారా? అంటూ టీడీపీ సభ్యుడు ఏకబిగిన పలు ప్రశ్నలు సంధించడంతో వాటన్నింటికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని, ఏదైనా ఒక్క ప్రశ్నకు సమాధానమిస్తే సరిపోతుందని స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ కల్పించిన వెసులుబాటుతో హైకోర్టు ఏర్పాటుకు సంబంధించిన ప్రశ్నకు మాత్రమే మంత్రి స్పందించారు.

ఉమ్మడి హైకోర్టు విభజన ప్రక్రియను వేగవంతం చేసేందుకు సిద్ధమని, కొత్త భవన నిర్మాణాన్ని వీలైనంత త్వరగా పూర్తిచేయాలని ఏపీని కోరుతున్నానన్న న్యాయశాఖ మంత్రి ప్రకటనతో వెంటనే హైకోర్టును విభజించి తెలంగాణకు ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేయాలని ప్రతి సమావేశాలలోనూ పట్టుబట్టే తెలంగాణ రాష్ట్ర సమతి (టీఆర్‌ ఎస్‌) సభ్యులు బల్లలు చరుస్తూ హర్షధ్వానాలు చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/