Begin typing your search above and press return to search.

పోలవరం ప్రాజెక్టు: ఏపీకి షాకిచ్చిన కేంద్రం

By:  Tupaki Desk   |   23 July 2018 2:17 PM GMT
పోలవరం ప్రాజెక్టు: ఏపీకి షాకిచ్చిన కేంద్రం
X
సంవత్సరాలుగా పీటముడిగా ఉన్న పోలవరం ప్రాజెక్టును వచ్చే ఎన్నికలలోగా పూర్తి చేసి ప్రజల్లో మైలేజీ సంపాదించాలని టీడీపీ యోచిస్తోంది. కానీ టీడీపీ ఈ ప్రాజెక్టు అంచనావ్యయాన్ని భారీగా పెంచి దోచుకుంటోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూడా టీడీపీ అంచనా వ్యయాల పెంపుపై ప్రతీసారి మోకాలడ్డుతూనే ఉంది.

తాజాగా పోలవరం అంచనాల పెంపు విషయమై కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో వివరణ ఇచ్చింది. ప్రాజెక్టుకు సంబంధించి పెంచిన అంచనాలపై ఏపీ ప్రభుత్వం సంతృప్తికర సమాధానం ఇస్తేనే పెంచిన అంచనాలను ఆమోదిస్తామని షాక్ ఇచ్చింది.

2010-11లో పోలవరం ప్రాజెక్టుకు రూ.16101 కోట్లు ఖర్చు అవుతుందని కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది. అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఈ అంచనాలను సవరించింది. ఏకంగా మూడున్నర రెట్లు పెంచింది. ప్రస్తుత తాజా వ్యయాన్ని రూ.58319 కోట్లు అవుతుందని నివేదిక ఇచ్చింది. ఈ పెరిగిన అంచనాలపై కేంద్ర వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) పరిశీలిస్తోందని.. పోలవరంపై సవరించిన అంచనాలపై కమిషన్ కొన్ని వివరణలు కోరిందని కేంద్రం తాజాగా వివరణ ఇచ్చింది. కుడి-ఎడమ కాలువల డిజైన్ల మార్పు - హెడ్ వర్క్స్ పరిమాణం పెంపు అంశాలపై వాటర్ కమిషన్ సమాచారాన్ని కోరిందని.. ఈ అంశాలపై రాష్ట్రప్రభుత్వం సంతృప్తికర సమాధానం ఇస్తే.. ఆ మేరకు సవరించిన అంచనాలకు సెంట్రల్ వాటర్ కమిషన్ ఆమోదం తెలుపుతుందని తెలిపి ఏపీ సర్కారుకు షాక్ ఇచ్చింది.