Begin typing your search above and press return to search.

అఫిషియ‌ల్ : కేసీఆర్ కోరిక‌కు కేంద్రం ఓకే

By:  Tupaki Desk   |   20 Sep 2017 8:36 AM GMT
అఫిషియ‌ల్ : కేసీఆర్ కోరిక‌కు కేంద్రం ఓకే
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ కోరిక‌కు కేంద్రం ఓకే చేసింది. కేసీఆర్ వ‌రుస ప్ర‌య‌త్నాల‌కు ఓకే చేసిన కేంద్రం ఈ విష‌యాన్ని అధికారికంగా హైకోర్టుకు తెలిపింది. ఇంత‌కీ ఏ విష‌యంలో మోడీ స‌ర్కారు కేసీఆర్ కోరిక‌ను స‌క్సెస్ చేసింద‌నే క‌దా మీ సందేహం. కేసీఆర్ క‌ల‌ల ప్రాజెక్టు అయిన‌ తెలంగాణ స‌చివాల‌యం నిర్మాణం కోసం. ఆర్మీకి చెందిన సికింద్రాబాద్ జింఖానా, బైసన్ పోలో మైదానాలను తెలంగాణ సర్కార్‌కు ఇవ్వాలనే యోచనలో ఉన్నామని కేంద్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. సూత్రప్రాయ నిర్ణయం తీసుకున్నామని, విధి విధానాలను ఖరారు చేయాల్సి ఉందని హై కోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి రమేష్ రంగనాథన్, న్యాయమూర్తి ఉమాదేవిలతో కూడి న డివిజన్ బెంచ్‌కు కేంద్రం నివేదించింది.

సికింద్రాబాద్ జింఖానా, బైసన్ పోలో మైదానాల్లో సచివాలయం, అసెంబ్లీ, కళాభారతి వంటి నిర్మాణాలు చేయకుండా ఆదేశాలివ్వాలని కోరుతూ మాజీ డీజీపీ ఎంవీ భాస్కర రావు, రిటైర్డు క్రికెటర్ వివేక్ జయసూర్య ఇతరులు హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యాలను ఉమ్మడి హైకోర్టులో దాఖలు చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ పిల్‌పై కేంద్ర రక్షణ శాఖ ముఖ్య కార్యదర్శి, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు సిఇఒ, డిఫెన్స్ ఆఫీసర్, ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫీసర్లకు నోటీసులు జారీ చేసింది. విచార‌ణ సంద‌ర్భంగా పిటిషనర్ల తరపున‌ సీనియర్ లాయర్లు సరసాని సత్యంరెడ్డి, సునీల్ భాస్కర్ రావులు వాదిస్తూ బ్రిటీష్ కాలంలోనే జింఖానా మైదానంలో ఆర్మీ నియామక పరీక్షలు జరిగాయని, క్రికెట్ పోటీలు కూడా అప్పుడే నిర్వహించారని, బైసన్ పోలో మైదానం లో పోలో పోటీలు జరుగుతాయని, ఇంతటి ప్రాముఖ్యత ఉన్న మైదానాలు లేకుండా చేయాల నే ప్రయత్నాలను అడ్డుకోవాలని చారు. మనిషికి ఆరు చదరపు మీటర్ల జాగా అవసరమని ఐక్యరాజ్య సమితి చెబుతుంటే హైదరాబాద్‌లో ఒక్క చదరపు మీటరు ఖాళీ స్థలం ఖాళీ లేదన్నారు.

ఈ సంద‌ర్భంగా కేంద్రం తరుపు వాదించే అదనపు సొలిసిటర్ జనరల్ వివ‌ర‌ణ ఇస్తూ... బైస‌న్ పోలో, సికింద్ర‌బాద్ జింఖానా గ్రౌండ్స్‌ను రాష్ట్ర ప్ర‌భుత్వానికి అప్ప‌గిస్తూ కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయ నిర్ణయం తీసుకుందని, ఈ మైదానాలను తెలంగాణకు ఇవ్వాలంటే కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం అవసరమని ఆ తర్వాతే చట్ట ప్రకారం వ్యవహరిస్తామని తెలంగాణకు కేంద్ర రక్షణశాఖ లేఖ రాసినట్లు చెప్పారు. లేఖ ప్రతిని బెంచ్‌కి ఇచ్చారు. ఈ మైదానాల్లో నిర్మాణాలకు మాజీ పోలీసు అధికారుల సంఘం మద్దతు ఇస్తోందని సీనియర్ న్యాయవాది పి. గంగయ్యనాయుడు చెప్పారు. ఈ సంఘాన్ని కూడా కేసులో వాదించే వీలు కల్పించాలని ఆయన వినతిపై బెంచ్ స్పందిస్తూ వాద ప్రతివాదాలు పూర్తి కాకుండానిర్ణయం తీసుకోబోమని ప్రకటించింది. విచారణ అక్టోబర్ 10కి వాయిదా వేస్తున్నామని బెంచ్ ప్రకటించగానే పిటిషనర్ల తరపు లాయర్లు కల్పించుకుని ఈలోగా నిర్మాణ పనులు ప్రారంభించకుండా ఆదేశాలివ్వాలని కోరారు. తాము నిర్మాణాలు చేపట్టబోమని అడ్వకేట్ జనరల్ ప్రకాష్ రెడ్డి హామీ ఇవ్వడంతో బెంచ్ దానిని విశ్వాసంలోకి తీసుకుంది.