Begin typing your search above and press return to search.

స్పెషల్: రాజకీయ వంశాంకురాలు రోడ్లకు బలి

By:  Tupaki Desk   |   10 Oct 2015 5:30 PM GMT
స్పెషల్: రాజకీయ వంశాంకురాలు రోడ్లకు బలి
X
రోడ్డు ప్రమాదాలు రోజురోజుకీ ఎక్కువవుతున్నాయి. నేషనల్ క్రైం బ్యూరో రికార్డ్స్ ప్రకారం రహదారులపై మరణాలు ఏటా పెరుగుతున్నాయే తప్ప తగ్గుతున్న దాఖలాలే లేవు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఎందరో ఈ ప్రమాదాలకు బలవుతున్నారు. రహదారులు బాగులేక కొన్ని ప్రమాదాలు జరుగుతుంటే... వాహనాలు నడపడంలో నైపుణ్యం లేకపోవడం వల్ల ఇంకొన్ని.... అంతా బాగానే ఉన్నా స్వయం కృతాపరాధాల వల్ల కూడా కొందరు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అతివేగం, తాగి నడపడం వంటి కారణాలతో ప్రమాదాలకు కారణమవుతున్నారు. సెలబ్రిటీల పిల్లలైతే లక్షల ఖరీదు చేసే రేసింగు బైకులపై రివ్వున దూసుకుపోతూ ప్రమాదాలకు గురవుతున్నారు. రాజకీయ నేతలు, సినిమా స్టార్ల పిల్లలు ఇలా ప్రాణాలు పోగొట్టుకున్నారు.
​ ​
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి కుమారుడు... టీడీపీ నేత, ఎంపీగా పనిచేసిన నందమూరి హరికృష్ణ తనయుడు జానకిరాం గత ఏడాది డిసెంబరులో రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. ఆయన విజయవాడ హైవేపై స్వయంగా కారు నడుపుకొంటూ వెళ్లుండగా ఈ ప్రమాదం జరిగింది.

​ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి తనయుడు ప్రతీక్ రెడ్డి కూడా రోడ్డు ప్రమాదానికే బలయ్యారు. 2011లో ఆయన తన స్కోడా కారును 120 కిలోమీటర్ల వేగంతో నడుపుతూ ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయాడు. ఈ ప్రమాదం కోమటిరెడ్డికి తీరని శోకం కలిగించింది. రాజకీయంగా కుమారుడు ఎదుగుతాడని కోమటిరెడ్డి భావించేవారు... అలాంటిది అర్దాంతరంగా ఆయన మృతిచెందడంతో కోమటిరెడ్డి తీవ్ర వేదనకు గురయ్యారు.

బీజేపీ నేత, సినీ నటుడు కోట శ్రీనివాసరావు తనయుడు కోట ప్రసాద్ 2010లో అవుటర్ రింగురోడ్డుపై హైఎండ్ బైక్ నడుపుతూ డివైడర్ ను ఢీకొని మృత్యువాత పడ్డాడు. సినీరంగంలో అప్పుడప్పుడే అవకాశాలు వెతుక్కుంటున్న ప్రసాద్ రేసు బైకులపై మోజుతో కొనుక్కున్న వాహనాన్ని నడుపుతూ ప్రాణాలొదిలారు. కుటుంబమంతా అదే మార్గంలో కారులో వెళ్తుంటే తానొక్కడే బైకుపై వస్తానని చెప్పి ప్రమాదానికి గురై మృత్యువాతపడ్డారు.
​ ​
మాజీ మంత్రి బాబూమోహన్ తనయుడు పవన్ కుమార్ కూడా 2003లో రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఆయన కూడా డివైడర్ ను ఢీకొనడంతో ప్రాణాలు కోల్పోయాడు.

​2013 లో పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక సుగ్రీవులు తనయుడు శ్రీనివాసరావు(21) రాత్రి రెండున్నర గంటల సమయంలో బైక్ ప్రమాదంలో చనిపోయాడు. బంధువుల పెళ్లికి వెళ్లిన శ్రీనివాస్ రాత్రి రెండు గంటల సమయంలో తిరిగొస్తూ పాలకొండలోనే ఎడ్డబండిని ఢీకొట్టి మరణించారు. ఈ ప్రమాదంలో కుమారుడు ప్రాణాలు కోల్పోవడంతో సుగ్రీవులు తీవ్ర డిప్రెషన్ కు గురయ్యారు. అది ఆయన రాజకీయ జీవితంపైనా ప్రభావం చూపించింది. మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా ఆయన నిరాకరించారు.
​ ​
2005లో ఇచ్ఛాపురం కాంగ్రెస్ ఎమ్మెల్యే నరేష్ కుమార్ అగర్వాలా తనయుడు పల్సర్ పై వెళ్తూ ప్రమాదానికి గురై ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఇంజినీరింగ్ చదువుతున్ ఆ కుర్రాడు జాతీయ రహదారిపై వేగంగా వెళ్థూ ప్రమాదానికి గురయ్యాడు. ఒక్కగానొక్క కొడుకును పోగొట్టుకున్ అగర్వాలా చాలాకాలం వరకు సాధారణ స్థితికి రాలేకపోయారు.
​ ​
2011లో హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డుపై మాజీ క్రికెటర్, అప్పటికి ఎంపీగా ఉన్న అజారుద్దీన్ కుమారుడు అయాజుద్దీన్ 1000 సీసీ బైక్ సుజుకీ హయబుసా నడుపుతూ ప్రమాదానికి గురై మరణించాడు.

ఇలా.... రాజకీయ నాయకులు, ప్రముఖల పిల్లలు తమ సరదాలు తీర్చుకునే ప్రయత్నంలో... అతివేగంగా వెళ్లాలనే సాహస యత్నంలో గొప్ప భవిష్యత్తను కాలదన్నుకుని అర్ధాంతరంగా చనిపోతున్నారు. తమ కుటుంబాలను తీరని శోకంలో ముంచేస్తున్నారు.