Begin typing your search above and press return to search.

త‌మిళ‌నాడు స‌ర్కార్ కు కేంద్రం షాక్!

By:  Tupaki Desk   |   10 Aug 2018 12:52 PM GMT
త‌మిళ‌నాడు స‌ర్కార్ కు కేంద్రం షాక్!
X
1991 మే 21న భార‌త మాజీ ప్ర‌ధాని రాజీవ్‌ గాంధీపై ఆత్మహుతి దాడి జ‌రిపి హ‌త్య చేసిన సంగ‌తి తెలిసిందే. ఆ హత్య కేసులో ఏడుగురు నిందితుల‌కు యావజ్జీవ కారాగార శిక్షను విధించారు. అయితే, రాజీవ్ హ‌త్య కేసులో ప్రధాన ముద్దాయి న‌ళినితో పాటు మరో ఆరుగురు 27 ఏళ్లుగా శిక్ష అనుభవిస్తున్నారు. అందువ‌ల్ల‌, వారికి క్షమాభిక్ష పెట్టి విడుదల చేయాలని 2016లో తమిళనాడు ప్రభుత్వం భావించింది. అయితే, అందుకు కేంద్రం అనుమ‌తి త‌ప్ప‌నిస‌రి కావ‌డంతో....వారి విడుద‌ల గురించి కేంద్రానికి ఒక లేఖ రాసింది. అయితే, ఆ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబ‌ట్టింది. వారి విడుద‌ల‌కు సంబంధించి ఒక‌ అఫడవిట్‌ దాఖలు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఈ నేప‌థ్యంలో తాజాగా, వారి విడుద‌ల‌పై కేంద్రం స్పందించింది. రాజీవ్ హంతకులను విడుదల చేసేది లేదని న్యాయస్థానానికి కేంద్ర ప్రభుత్వం తేల్చిచెప్పింది.

రాజీవ్ హ‌త్య కేసు నిందితుల‌ను విడుద‌ల చేయాల‌న్న త‌మిళ‌నాడు ప్ర‌భుత్వ నిర్ణ‌యంతో తాము విభేదిస్తున్నామ‌ని సుప్రీంకు కేంద్రం తెలిపింది. ఇదే విష‌యాన్ని జ‌స్టిస్ రంజ‌న్ గ‌గోయ్ - న‌వీన్ సిన్హా - కేఎమ్ జోసెఫ్ ల ధ‌ర్మాసనానికి కేంద్ర హోం శాఖ జాయింట్ సెక్ర‌ట‌రీ వీబీ దూబే రాత పూర్వ‌కంగా తెలియ‌ప‌రిచారు. వారి విడుద‌ల వ‌ల్ల అనేక స‌మ‌స్య‌లు తలెత్తుతాయ‌ని కేంద్రం స్ప‌ష్టం చేసింది. వారి విడుద‌ల‌....భ‌విష్య‌త్తులో మ‌రింత‌మంది నేర‌గాళ్ల‌కు ఓ ఉదాహ‌ర‌ణ‌లా మారుతుంద‌ని - అందుకే వారిని విడుద‌ల చేసేందుకు తామ సుముఖంగా లేమ‌ని తేల్చి చెప్పింది. కాగా, 1991 - మే21న త‌మిళ‌నాడులోని శ్రీ‌పెరుంబ‌దూర్ లో జ‌రుగుతున్న ఎల‌క్ష‌న్ ర్యాలీ సంద‌ర్భంగా రాజీవ్ పై ఆత్మాహుతి దాడి జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఆ దుర్ఘ‌ట‌న‌లో సూసైడ్ బాంబ‌ర్ ధ‌నుతోపాటు 14మంది చ‌నిపోయారు. ఒక దేశాధ్య‌క్షుడి హోదా క‌లిగిన వ్య‌క్తిపై జ‌రిగిన ఆత్మాహుతి దాడి అదే కావ‌డం విశేషం.