Begin typing your search above and press return to search.

ఆ దేశాధ్య‌క్షుడికి కోపం వ‌స్తే..నంజుకు తింటాడ‌ట‌

By:  Tupaki Desk   |   24 April 2017 9:34 AM GMT
ఆ దేశాధ్య‌క్షుడికి కోపం వ‌స్తే..నంజుకు తింటాడ‌ట‌
X
దేశాధ్య‌క్ష స్థానంలో ఉన్న వారు ఆచితూచి మాట్లాడ‌టం మామూలే.కానీ.. ఇప్పుడు అలాంటివి చాలా త‌గ్గిపోయాయి. దూకుడుగా.. దూసుకెళ్లేలా మాట్లాడ‌టం ఇప్పుడు అల‌వాటైంది. ఇలాంటి దూకుడుత‌నానికి ప్ర‌జ‌లు సైతం ప‌ట్టం క‌ట్ట‌టంతో చాలా దేశాల్లో దూకుడు నేత‌లు.. అధినేత‌లుగా అవ‌త‌రిస్తున్నారు. ఇలాంటి నేత‌లంతా ఒక ఎత్తు అయితే.. ఫిలిప్పీన్స్ అధ్య‌క్షుడు రోడ్రిగో డుటెర్టి తీరు కాస్త భిన్నం. ఉగ్ర‌వాదుల మీదా.. డ్ర‌గ్స్ డీల‌ర్ల మీద ఆయ‌నెంత శివాలెత్తిపోతారో తెలిసిందే.

డ్ర‌గ్స్ వ్యాపారం చేసే వారికి పిలిఫ్పీన్స్‌లో స్థానం లేద‌ని.. అలాంటివారిని ప్ర‌జ‌లు కాల్చి చంపేసినా ఎలాంటి కేసులు ఉండ‌వంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌టం తెలిసిందే. తాజాగా ఆయ‌న మ‌రింత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. విన్నంత‌నే వికారంగా అనిపించే ఈ మాట‌లు ఆయ‌న నోట వెంట వ‌చ్చిన‌ప్పుడు.. అక్క‌డి ప్ర‌జ‌లు హ‌ర్షాతిరేకాలు వ్య‌క్తం చేయ‌టం గ‌మ‌నార్హం.

ముస్లిం ఉగ్ర‌వాదుల కంటే తాను 50 రెట్లు క్రూరుడిన‌ని.. వాళ్లు త‌ల‌లు మాత్ర‌మే న‌రికితే.. తాను ఉగ్ర‌వాదులు స‌జీవంగా దొరికితే.. వాళ్ల‌ను నంజుకు తినేస్తానంటూ విప‌రీత వ్యాఖ్య‌లు చేశారు. ఒక క్రీడా టోర్న‌మెంట్‌ లో పాల్గొన‌టానికి హాజ‌రైన ఆయ‌న ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి మాట్లాడుతూ.. ప్ర‌జ‌ల్ని భ‌య‌కంపితులు చేయ‌టానికి ఉగ్ర‌వాదులు త‌ల‌లు న‌రికేస్తున్నార‌ని.. అలాంటి జంతువుల‌ను స‌జీవంగా ప‌ట్టుకోవాల్సిన అవ‌స‌రంలేద‌ని.. కాల్చి పారేయాలంటూ సైనిక వ‌ర్గాల్ని ఆదేశించారు.

ఈ సంద‌ర్భంగా ఉగ్ర‌వాదుల గురించి మ‌రింతగా మండిప‌డుతూ.. ఆయ‌న ఊహించ‌ని రీతిలో కొన్ని వ్యాఖ్య‌లు చేశారు. త‌న‌కు మూడ్ బాగోలేన‌ప్ప‌డు ఎవ‌రైనా ఉగ్ర‌వాదుల‌ను స‌జీవంగా తీసుకొచ్చి త‌న‌కు అప్ప‌గిస్తే.. కాస్త ఉప్పు.. వెనిగ‌ర్ కూడా ఇస్తే..అందులో వాళ్ల లివ‌ర్‌ ను తినేస్తాన‌ని వ్యాఖ్యానించారు. ఆయ‌న మాట‌ల‌కు అక్క‌డి వారు పెద్ద‌గా న‌వ్వ‌గా.. తాను చెప్పింది నిజ‌మేన‌ని.. త‌న‌కు కోపం వ‌స్తే అలాగే చేస్తాన‌ని వ్యాఖ్యానించ‌టం గ‌మ‌నార్హం. ఉగ్ర‌వాదుల‌పై ఈ స్థాయిలో మండిప‌డ్డ డుటెర్టి వ్యాఖ్య‌లు ఇప్పుడు సంచ‌ల‌నంగా మారాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/