Begin typing your search above and press return to search.

వైఎస్‌, బాబు త‌ర్వాత ఆయ‌నేన‌ట‌

By:  Tupaki Desk   |   19 Jan 2017 6:16 AM GMT
వైఎస్‌,  బాబు త‌ర్వాత ఆయ‌నేన‌ట‌
X
సీపీఎం రాష్ట్ర కార్య‌ద‌ర్శి త‌మ్మినేని వీర‌భ‌ద్రం చేప‌ట్టిన మహాజన పాదయాత్ర గ‌తంలోని రికార్డుల‌ను తిర‌గ‌రాస్తోంద‌ని సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్ర‌శంసించారు. ఉమ్మడి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి 2400 కిలోమీటర్లు - చంద్రబాబు 3వేల కిలోమీటర్లు పాదయాత్ర చేస్తే.. తెలంగాణ రాష్ట్రంలో తమ్మినేని వీరభద్రం 4వేల కిలోమీటర్లు పాదయాత్ర చేస్తున్నారని చెప్పారు. సీపీఎం చేపట్టిన ఈ పాదయాత్రను అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం చేస్తున్న యాత్రగా అభివర్ణించారు. వరంగల్‌ జిల్లాలో సీపీఎం మహాజన పాదయాత్రకు రామ‌కృష్ణ సంఘీభావం తెలిపారు. ఈ సంద‌ర్భంగా పాదయాత్ర బృందంతో కలిసి నడిచి అనంత‌రం మీడియాతో మాట్లాడారు.

అబద్దాలతో ప్రజలను మోసం చేస్తూ పాలన సాగించడంలో ఏపీ ముఖ్య‌మంత్రి - తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు చంద్రబాబునాయుడు - తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఒకరిని మించిన వారు మరొకరని రామ‌కృష్ణ‌ అన్నారు. తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా వెలగబెడుతున్న వీరిద్దరు ఒకప్పుడు గండిపేట పాఠశాలలో చదువుకున్న వారేనని ఎద్దేవా చేశారు. వీరిద్దనీ మించిన వారు ప్రధాని నరేంద్రమోడీ అని అన్నారు. ఒకే పాఠశాల(టీడీపీ)లో చదివిన విద్యార్థులు కావడం వల్లే ఏపీలో చంద్రబాబు, తెలంగాణలో కేసీఆర్‌ మాటల గారడీతో ముందుకుపోతున్నారని రామ‌కృష్ణ‌ విమర్శించారు. బ్లాక్‌ మనీని అరికడతామని గొప్పలు చెబుతూ నోట్లు రద్దు చేసి ప్రధాని నరేంద్రమోడీ ఏం సాధించారో చెప్పాలన్నారు. పదేళ్ల‌లో దేశంలో 5లక్షల మంది ఆత్మహత్య చేసుకున్నారని, ఆత్మహత్యలు జరుగుతున్న ఆరు రాష్ట్రాల్లో బంగారు తెలంగాణగా చెప్పుకుంటున్న తెలంగాణ కూడా ఒకటని, దీనికి టీఆర్‌ ఎస్‌ నేతలు సిగ్గుపడాలని రామ‌కృష్ణ విరుచుకుప‌డ్డారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మైనార్టీలపై దాడులు, దౌర్జన్యాలను ప్రోత్సహిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈనెల 26 నుంచి ఆంధ్రప్రదేశ్‌ లో సీపీఐ 40 రోజుల పాటు బస్సుయాత్ర చేపట్టనున్నట్టు తెలిపారు. తెలంగాణలో సీపీఎం పాదయాత్ర అనుభవాలు, ఏపీలో బస్సు యాత్ర అనుభవాలు పంచుకొని భవిష్యత్తులో రెండు పార్టీలు భుజం భుజం కలిపి ప్రజా సమస్యలపై పోరాడుతాయని చెప్పారు. పాదయాత్ర స్ఫూర్తితో ఏపీలో సామాజిక ఉద్యమాలను ముందుకు తీసుకెళ్తామని రామ‌కృష్ణ అన్నారు. ఇదిలాఉండ‌గా.. సీపీఎం మహాజన పాదయాత్ర వరంగల్‌ రూరల్‌ జిల్లాలోని పరకాల పట్టణానికి చేరుకోవ‌డం ద్వారా 2500 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/