Begin typing your search above and press return to search.

ఇదే పని ముందు చేస్తే ఇంత లొల్లి ఉండేది కాదుగా?

By:  Tupaki Desk   |   25 April 2019 6:26 AM GMT
ఇదే పని ముందు చేస్తే ఇంత లొల్లి ఉండేది కాదుగా?
X
అంతా అయిపోయాక త‌త్త్వం బోధ ప‌డితే ఏం లాభం? ప్ర‌స్తుతం తెలంగాణ ప్ర‌భుత్వ తీరు కూడా ఇదే రీతిలో ఉంది. ల‌క్ష‌లాది మంది విద్యార్థులు.. వారి త‌ల్లిదండ్రులు.. వారి బంధువులు.. ఇలా కోట్లాది మంది ఇంట‌ర్ ప‌రీక్ష‌ల లొల్లి ఎపిసోడ్ లో కేసీఆర్ స‌ర్కారు తీరుపై ఆగ్ర‌హంతో ఉన్నారు.

ఇంట‌ర్ బోర్డు త‌ప్పిదాల‌తో కొంద‌రు.. ఫలితాలు వ‌చ్చిన తీరుతో మ‌రికొంద‌రు అమాయ‌క విద్యార్థులు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకోవ‌టం ప్ర‌భుత్వ త‌ప్పిదమ‌ని తేల్చేయ‌టం తెలిసిందే. ఇంట‌ర్ విద్యార్థుల విష‌యంలో చోటు చేసుకున్న త‌ప్పుల్ని స‌రిదిద్దుకునే ప్ర‌య‌త్నాల్ని కాస్త ఆల‌స్యంగా మొద‌లెట్టిన కేసీఆర్‌.. ఈ రోజు ఊహించ‌ని రీతిలో నిర్ణ‌యం తీసుకున్నారు. పొరుగు రాష్ట్ర ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు సైతం.. తెలంగాణ విద్యార్థుల సూసైడ్ల మీద విచారం వ్య‌క్తం చేయ‌టం.. ప‌వ‌న్ లాంటోళ్లు సైతం.. ప్ర‌భుత్వానికి స‌ల‌హాలు ఇస్తూ.. బాధ్య‌త వ‌హిస్తూ స్పందించ‌రా? అంటూ ప్ర‌శ్నిస్తున్న వేళ‌.. కేసీఆర్ రంగంలోకి దిగారు.

ఇంట‌ర్ బోర్డు అధికారుల‌తో భేటీ అయిన కేసీఆర్.. ప్రాధ‌మికంగా కొన్ని నిర్ణ‌యాలు తీసుకున్నారు. రీవాల్యువేష‌న్ ను ఉచితమ‌ని తేల్చ‌టంతోపాటు.. ఈ ఇష్యూను సీరియ‌స్ గా విచార‌ణ చేప‌డ‌తామ‌ని.. ఎవ‌రూ ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డొద్దంటూ ప్రెస్ రిలీజ్ చేయ‌టం తెలిసిందే. ప్ర‌భుత్వ నిర్ణ‌యం మీద మిశ్ర‌మ స్పంద‌న వ‌చ్చింది.

అంత‌లో ఏమైందో ఏమో కానీ.. ఇంట‌ర్ బోర్డు తాజాగా కీల‌క నిర్ణ‌యాన్ని తీసుకుంది. ప‌రీక్ష‌ల్లో ఫెయిల్ అయిన 3.25 ల‌క్ష‌ల మంది విద్యార్థులు రీ వెరిఫికేష‌న్.. రీకౌంటింగ్ కోసం ద‌ర‌ఖాస్తు చేయాల్సిన అవ‌స‌రం లేద‌ని.. ఇందుకోసం స‌మాచార కేంద్రాల వ‌ద్ద‌కు.. ఇంట‌ర్నెట్ సెంట‌ర్ల ద‌గ్గ‌ర బారులు తీయాల్సిన అవ‌స‌రం లేదంది.

మ‌రెలా అంటే.. మీరంతా ఇంత ఇబ్బంది ప‌డే క‌న్నా.. మేమే మొత్తం 3.25 ల‌క్ష‌ల ప‌త్రాల్ని రీవెరిఫికేష‌న్ చేసి.. మే 15 లోపు కొత్త మెమోలు జారీ చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. అంతేకాదు.. ఇప్ప‌టికే డ‌బ్బులు క‌ట్టిన వారి మొత్తాన్ని రీఫండ్ చేస్తామ‌ని వెల్ల‌డించింది. ముందు జాగ్ర‌త్త‌లో భాగంగా ఫెయిల్ అయిన విద్యార్థులు అడ్వాన్స్డ్ సప్లిమెంట‌రీకి ద‌ర‌ఖాస్తు చేయాల్సింది కోరింది. ఊహించ‌ని రీతిలో రియాక్ట్ అయి.. వెల్ల‌డించిన నిర్ణ‌యాలు అన్ని బాగున్నాయ‌ని చెప్పాలి. మ‌రి.. ఇదే ప‌ని ముందే చేసి ఉంటే.. ఇప్పటివ‌ర‌కూ జ‌రిగిన ర‌చ్చ అంతా ఉండేది కాదుగా కేసీఆర్?