Begin typing your search above and press return to search.

అగ్రిగోల్డ్ ఛైర్మన్ ఇప్పటికి అరెస్ట్ అయ్యారు

By:  Tupaki Desk   |   12 Feb 2016 4:04 AM GMT
అగ్రిగోల్డ్ ఛైర్మన్ ఇప్పటికి అరెస్ట్ అయ్యారు
X
వేలాది కోట్ల రూపాయిలు ప్రజల నుంచి వసూలు చేసి.. వారికి భవిష్యత్తును అగమ్యగోచరంగా మార్చేసిన అగ్రిగోల్డ్ వ్యవహారంలో కీలక అరెస్ట్ లు తాజాగా చోటు చేసుకున్నాయి. అక్రమ పద్ధతిలో ప్రజల నుంచి డిపాజిట్లు వసూలు చేయటం.. తిరిగి ఇవ్వాల్సిన సమయానికి తిరిగి ఇవ్వకపోటం లాంటి వ్యవహారాలతో అగ్రిగోల్డ్ ఇష్యూ తీవ్ర వివాదాస్పదంగా మారింది.

ఈ సంస్థ వైఖరిపై ఇప్పటికే పలువురు కేసులు వేశారు. హైకోర్టు సైతం అగ్రిగోల్డ్ విషయంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. డిపాజిటర్లకు ఎలాంటి నష్టం లేదని.. తమ వద్ద మదుపు చేసిన వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదని.. తాము చెల్లించాల్సిన మొత్తం కంటే తమ ఆస్తుల విలువ అధికమని చెప్పినప్పటికీ.. డిపాజిటర్లకు డబ్బును తిరిగి ఇచ్చేసే విషయం ఇప్పటికి సా...గుతూనే ఉంది తప్పించి ఒక్క అడుగు ముందుకు పడింది లేదు.

ప్రస్తుతం ఈ కేసును సీఐడీ డీల్ చేస్తూ.. సంస్థ ఆస్తుల్ని వేలం వేయటాన్నిసమీక్షిస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా అగ్రిగోల్డ్ ఛైర్మన్ అవ్వాసు వెంకటేశ్వరరావు.. ఆయన సోదరుడు కుమార్ లను అరెస్ట్ చేశారు. ఆర్థిక నేరాలకు పాల్పడ్డారంటూ పెద్ద ఎత్తున ప్రజలు నెలల తరబడి పోరాడుతుంటే.. అందుకు బాధ్యులైన వారిని అరెస్ట్ చేయటానికి ఇంత కాలం పట్టటం గమనార్హం.