Begin typing your search above and press return to search.

సీబీఐటీ విద్యార్థులు గెలిచారుగా

By:  Tupaki Desk   |   10 Dec 2017 6:26 AM GMT
సీబీఐటీ విద్యార్థులు గెలిచారుగా
X
చైతన్య భారతి ఇన్‌ స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (సీబీఐటీ)...ఇంజినీరింగ్ చ‌ద‌వాల‌నుకునే వారికి...చ‌దివిన వారికి..వారి త‌ల్లిదండ్రుల‌కు ప‌రిచ‌యం అవ‌స‌రం లేనిపేరు. ఇంజినీరింగ్ కాలేజీల పరంగా చూస్తే...సీబీఐటీకి ఉన్న క్రేజ్ మామూలుది కాదు. కానీ అలాంటి కాలేజీ త‌న ఇమేజ్ డ్యామేజ్ చేసుకుందనే టాక్ వినిపిస్తోంది. అటూ ప్రభుత్వం నుంచి - ఇటు విద్యార్థులు - తల్లిదండ్రులు - విద్యార్థి సంఘాల నుంచి నిరసన వెల్లువెత్తింది. దీంతో ఎట్ట‌కేల‌కు కాలేజీపై విద్యార్థులు పై చేయి సాధించారు. హైకోర్టు ఆదేశాల పేరుతో ఫీజు వసూలు చేయాలనుకున్న త‌మ కాలేజీ ఆటలు సాగలేదని తెలుస్తోంది.

సీబీఐటీ వార్షిక ఫీజు రూ.1,13,500 నుంచి రూ.2 లక్షలకు పెంచిన విషయం తెలిసిందే. ఫీజు పెంపుపై సర్వత్రా ఆగ్రహం పెల్లుబికింది. సీబీఐటీ విద్యార్థులు ఏకంగా తరగతులు బహిష్కరించి పెరిగిన ఫీజులను వెనక్కి తీసుకోవాలని ఆందోళన చేపట్టారు. దీంతో పెరిగిన ఫీజు వసూలు ప్రక్రియ నుంచి సీబీఐటీ యాజమాన్యం వెనక్కి తగ్గింది. పెరిగిన ఫీజు వసూలుకు ప్రస్తుతానికి బ్రేక్‌ పడింది. విద్యార్థులకు స్వల్పంగా ఊరట లభించింది. పెరిగిన ఫీజులపై హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం - టీఏఎఫ్‌ ఆర్సీ వేసిన కౌంటర్‌ అఫిడవిట్‌ పై తుది తీర్పు వచ్చేంత వరకు ఆగాలని నిర్ణయించామని సీబీఐటీ అధ్యక్షుడు మాలకొండారెడ్డి శనివారం సర్క్యులర్‌ జారీ చేశారు. శనివారం సీబీఐటీ ప్రాంగణంలో కొందరు విద్యార్థులు - తల్లిదండ్రులతో యాజమాన్యం చర్చలు జరిపింది. అనంతరం సీబీఐటీ ప్రిన్సిపాల్‌ రవీందర్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పెరిగిన ఫీజులను ప్రస్తుతానికి వసూలు చేయొద్దని నిర్ణయించామని చెప్పారు. స్వచ్చంధంగా ఎవరైనా విద్యార్థులు పెరిగిన ఫీజులు చెల్లించడానికి ముందుకొస్తే అభ్యంతరం లేదని అన్నారు. ఆర్థికంగా బలహీనంగా ఉండి ఫీజు కట్టలేని విద్యార్థులుంటే వారికి స్కాలర్‌ షిప్‌ సౌకర్యం కల్పిస్తామన్నారు. ఈనెల 9వ తేదీ నుంచి ప్రారంభమైన పరీక్షలు షెడ్యూల్‌ ప్రకారం ఉన్నవి 11వ తేదీ నుంచి జరుగుతాయని ప్రకటించారు.

మ‌రోవైపు ప్రస్తుతానికి పెరిగిన ఫీజులు వసూలు చేయబోమని ప్రకటించినా యాజమాన్యం తీరుపై విద్యార్థులు ఇంకా సంతృప్తి చెందడం లేదు. ఆగ్రహంతోనే ఉన్నారు. పెరిగిన ఫీజు వసూలు చేయబోమని అఫిడవిట్‌ లేదంటే బాండ్‌ పేపర్‌ పై లిఖితపూర్వకంగా రాసివ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. అంతవరకు ఆందోళన కొనసాగుతుందని హెచ్చరించారు. సోమవారం నుంచి ఆందోళన మరింత ఉధృతం చేస్తామని కొందరు విద్యార్థులు ప్రకటించారు. యాజమాన్యంపై ఒత్తిడి పెంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చేలా కృషి చేస్తామన్నారు.