Begin typing your search above and press return to search.

తెలంగాణ‌లో ఉప ఎన్నిక సంద‌డి

By:  Tupaki Desk   |   28 July 2016 11:30 AM GMT
తెలంగాణ‌లో ఉప ఎన్నిక సంద‌డి
X
తెలంగాణలో మరో మూడు లోక్‌ సభ స్థానాలకు ఉప ఎన్నికలకు రంగం సిద్దమైనట్టే కనిపిస్తోంది. టీఆర్ ఎస్ ఆపరేషన్ ఆకర్ష్‌ కు బ్రేకులు వేసేందుకు - ప్ర‌తిపక్షాల స‌త్తా చాటుకునేందుకు ఈ ఎన్నిక‌లు తెర‌మీద‌కు రానున్న‌ట్లు చెప్తున్నారు. తాజా పార్ల‌మెంటు స‌మావేశాల నేప‌థ్యంలో ఈ మేర‌కు జోరుగా ప్ర‌య‌త్నాలు సాగుతున్నాయ‌ని స‌మాచారం. నల్గొండ కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి - మల్కాజ్‌ గిరి టీడీపీ ఎంపీ మల్లారెడ్డి - వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఖమ్మం లోక్‌ సభ సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి టీఆర్ ఎస్‌ లో చేరిన సంగ‌తి తెలిసిందే. దీంతో వీరిపై లోక్‌ సభ స్పీకర్‌ కు ఫిర్యాదు చేసేందుకు కాంగ్రెస్ - టీడీపీ - వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలు సిద్దమవుతున్నాయి.

తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ - మల్కాజ్‌ గిరి - ఖమ్మం పార్లమెంటు స్థానాలకు ఉప ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ముడు నియోజ‌క‌వ‌ర్గాల ఎంపీలు టీఆర్ ఎస్‌ లో చేరిన సంగ‌తి తెలిసిందే. వారిలో ఖమ్మం పార్లమెంట్ సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పై ఫిర్యాదు చేసేందుకు ఆ పార్టీ అధిష్ఠానం వెనకడుగు వేస్తుందని సమాచారం. అయితే ఆంధ్రప్రదేశ్‌ లో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు చాలా మంది అధికార టీడీపీలోకి జంప్ చేస్తుండడంతో వారిపై ఫిర్యాదు చేసి పొంగులేటిని వదిలేస్తే తప్పుడు సంకేతాలు వెళతాయనే భావనలో జగన్ ఉన్నారని సమాచారం. ఇక ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న టీడీపీ మాత్రం మల్కాజ్‌ గిరి ఎంపి పై ఫిర్యాదు చేసేందుకు మొగ్గు చూపుతుందని అంటున్నారు. ఆయనపై ఎట్టి పరిస్థితులలోను అనర్హత వేటు వేయించాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌ రెడ్డి పట్టుదలగా ఉన్నారు. అవసరమయితే ఆ స్థానం నుండి బరిలో దిగేందుకు ఆయన సిద్దమంటున్నారు. లోక్‌ సభలో ప్రతిపక్ష స్థానంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడ గుత్తా సుఖేందర్‌ రెడ్డిపై పార్టీ ఫిరాయింపుల చట్టం కింద ఫిర్యాదు చేస్తామని చెబుతుంది. దీనిపై బిజెపి పెద్దలు కూడ చర్య తీసుకునేందుకు ఆసక్తిగా ఉండే క్రమంలో వీరిపై త్వరలోనే అనర్హత వేటు పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

పార్టీ మారిన క్రమంలో తమపై అనర్హత వేటు పడితే దానికి సిద్దంగా ఉన్నామని ఎంపి మల్లారెడ్డి ప్రకటించారు. ఉప ఎన్నికలలో టీఆర్ ఎస్ అభ్యర్థిగా పోటీచేసేందుకు సిద్దంగా ఉన్నానని ఆయన స్పష్టం చేశారు. మరో వైపు నల్గొండ పార్లమెంటుకు తిరిగి పోటీ చేసే అంశంపై గుత్తా సుఖేందర్‌ రెడ్డి సైతం సై అన్నారు. ఆయన మంత్రిగా బాధ్యతలు చేపడతారన్న ప్రచారం ఉన్న నేపథ్యంలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి లేదా మరో బలమైన నేతను అక్కడి నుండి బరిలో దింపాలని టీఆర్ ఎస్ అధిష్ఠానం భావిస్తోంది. అవసరమైతే తాను ఎంపి పదవికి రాజీనామా చేస్తానని గుత్తా ప్రకటించారు. దీంతో ప్ర‌తిప‌క్ష పార్టీల అడుగుల‌ను బ‌ట్టి ఉప ఎన్నిక‌లు రావ‌డం అనేది తేల‌నుంది.