Begin typing your search above and press return to search.

రేణుక టీడీపీలో చేరారు...కానీ ఓ ట్విస్ట్ ఇచ్చారు

By:  Tupaki Desk   |   17 Oct 2017 7:54 AM GMT
రేణుక టీడీపీలో చేరారు...కానీ ఓ ట్విస్ట్ ఇచ్చారు
X
ఎట్ట‌కేల‌కు కర్నూల్ పార్లమెంట్ సభ్యురాలు బుట్టా రేణుక టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో రేణుక - ఆమె అనుచరులు టీడీపీలో చేరారు. రేణుకతో పాటు ఆమె అనుచరులు 100 మంది ఈరోజు సైకిలెక్కారు. అయితే ఇక్క‌డే ఓ ట్విస్ట్ ఉంది. సాంకేతిక కారణాల వల్ల ఎంపీ రేణుక...టీడీపీ కండువా కప్పుకోలేదు. కేవ‌లం ఆమె వెంట వ‌చ్చిన వారు మాత్ర‌మే పార్టీ కండువా క‌ప్పుకున్నారు. మ‌రోవైపు టీడీపీలో చేరికపై అధికారికంగా స్పష్టమైన ప్రకటనను ఎంపీ బుట్టా రేణుక చేయలేదు. అనర్హత వేటుకు భయపడే ఆమె ఈ ప్రకటన చేయనట్లు టీడీపీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. కాగా, అమావాస్య కారణంగా బుట్టా రేణుక అధికారికంగా టీడీపీలో చేరలేదనే మరో వాదన కూడా వినిపిస్తోంది.

సీఎం చంద్రబాబుతో నేడు భేటీ అనంతరం ఎంపీ రేణుక‌ విలేకరులతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి కర్నూలు జిల్లాలో అండగా ఉంటానని - అభివృద్ధికి తోడుగా ఉంటానని అన్నారు. క‌ర్నూలులో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు. ఉమ్మడి రాష్ట్రంలో తొమ్మిదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా చంద్రబాబు పని చేసిన కాలం స్వర్ణయుగమని ఆమె చెప్పారు. చంద్రబాబు విధానాలు - అభివృద్ధి - సంక్షేమం విషయంలో ఆయన విజన్ ను అన్ని రాష్ట్రాల నాయకులూ ప్రశంసిస్తున్నారని పేర్కొన్నారు. అభివృద్ధి కోరుకునే వారంతా టీడీపీలోకి రావాలని ఆమె కోరారు.

ఎంపీ బుట్టా రేణుక తన అనుచరులతో చంద్రబాబును కలిసి ప్రభుత్వానికి మద్దతు తెలిపి పార్టీలో చేరుతున్నట్లు అనంత‌రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ కర్నూలు ఎంపీ బుట్టా రేణుక ప్రభుత్వానికి మద్దతివ్వడం సంతోషమని అన్నారు. ప్రభుత్వం చేసే మంచి పనులకు అందరు ఆకర్షితులవుతున్నారన్నారు. మంచిని ప్రోత్సహించేవారందరు టీడీపీకి మద్దతివ్వాలని సీఎం చంద్ర‌బాబు కోరారు. కొంత మందికి టీడీపీకి మద్దతు తెలపాలని ఉన్నా.. బయటపడలేక పోతున్నారని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు.