Begin typing your search above and press return to search.

బాబు పీహెచ్‌ డీ ఉత్త‌దేన‌ట‌!

By:  Tupaki Desk   |   1 Oct 2016 1:18 PM GMT
బాబు పీహెచ్‌ డీ ఉత్త‌దేన‌ట‌!
X
ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుపై ప‌బ్లిక్ అకౌంట్స్ క‌మిటీ చైర్మన్ - వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి సెటైర్ల‌తో కూడిన విమ‌ర్వ‌లు చేశారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ కు ప్రత్యేక హోదా ఎజెండాగా బాబుపై విరుచుకుప‌డిన ఈ సంద‌ర్భంగా విమ‌ర్శ‌లు చేయ‌డంతో పాటు సెటైర్లు కూడా పేల్చారు. చంద్రబాబు తనకు తాను ఆర్థికవేత్తనని - ఎకనామిక్స్‌ లో పీహెచ్‌ డీ చేశానని చెప్పుకోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోందని బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి వెల్లడించారు. ప్రత్యేక హోదా కంటే ప్యాకేజీయే గొప్పదైనప్పుడు అన్ని రాష్ట్రాలు ప్యాకేజీ అడగకుండా హోదా కావాలని ఎందుకు డిమాండ్‌ చేస్తున్నారో బాబు సమాధానం చెప్పాలన్నారు. ప్రత్యేక ప్యాకేజీకి అంగీకారం తెలిపిన చంద్రబాబు మన రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన వాటి కంటే కొత్తగా కేంద్రం ఏమిచ్చిందో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. ఈ వివ‌ర‌ణ ఇవ్వ‌డానికి ముందుకు రాని బాబును చూస్తుంటే ఆయ‌న చేసిన ఎక‌నామిక్స్‌ పీహెచ్‌ డీపై సందేహం వ‌స్తోంద‌ని అన్నారు.

నిజంగా చంద్ర‌బాబు ఎక‌నామిక్స్ లో పీహెచ్‌ డీ చేసి ఉంటే...ప్యాకేజీకి ఎలా అంగీకారం తెలిపార‌ని బుగ్గ‌న‌ ప్ర‌శ్నించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావడం వలన చాలా ప్రయోజనాలున్నాయని బుగ్గన వివరించారు. హోదా ఉన్న కాలంలో పరిశ్రమలు స్థాపిస్తే కలిగే ప్రయోజనాలను ఆయన వివరించారు. వంద శాతం ఇన్‌ కమ్‌ ట్యాక్స్ - సెంట్రల్‌ ఎక్సయిజ్‌ ట్యాక్స్‌ నుంచి మినహాయింపు ఉంటుందని, వీటితోపాటు బ్యాంకుల నుంచి తీసుకునే అప్పులో 3శాతం వడ్డీ మినహాయింపు ఉంటుందని తెలిపారు. ఇటీవల కేంద్రమంత్రులు - టీడీపీ నాయకులు - వెంకయ్య నాయుడు తదితరులు మాట్లాడుతూ పరిశ్రమలు తమ పెట్టుబడిలో 15 శాతం ఖర్చుగా చూపించడంతోపాటు 35శాతం తరుగుదల అవకాశం కూడా కల్పించామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. అయితే ఇదేమీ మన రాష్ట్రానికి ప్రత్యేకంగా ఇచ్చిన వరం కాదన్నారు. మనతోపాటు పశ్చిమ బెంగాల్ - తెలంగాణ - బీహార్‌ ఇలాంటి రాష్ట్రాలకు కూడా కేటాయించిందని బుగ్గ‌న‌ తెలియజేశారు. అలాంటప్పుడు మన కే ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చినట్లు చెప్పడానికి వారికి నోరెలా వచ్చిందో అర్థం కావడం లేదన్నారు. అంతేకాకుండా ఏపీలో ఐఐటీ - ట్రిపుల్‌ ఐటీ - ఐఐఎంలు స్థాపిస్తామని చెప్పడం మంచిదే కానీ ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో ఏర్పాటయ్యాయని కొత్తగా మనకూ కేటాయిస్తున్నారు తప్ప ఇందులో గొప్పతనం ఏమీ లేదన్నారు. ఇవన్నీ విభజన చట్టంలో పొందుపర్చారని అవే వారు నెరవేరుస్తామని చెబుతున్నారని ప్రత్యేక ప్యాకేజీ పేరుతో ప్రత్యేకంగా ఒక్క పైసా ఇవ్వలేదని ఈ సందర్భంగా బుగ్గ‌న‌ స్పష్టం చేశారు. ఇవ‌న్నీ నిజాలు అయిన‌ప్పుడు ఆర్థిక‌వేత్త‌గా చంద్ర‌బాబు గొప్ప వ్య‌క్తి అని ఏ విధంగా అర్థం చేసుకోవాల‌ని బుగ్గ‌న ప్ర‌శ్నించారు.

ప్ర‌త్యేక‌ హోదా వలన రాష్ట్రాలకు ఏమంత ప్రయోజనం కలిగిందే చెప్పాలని మాట్లాడిన చంద్రబాబుకు బుగ్గన ఉత్తరాఖండ్‌ ఆర్థిక పరిస్థితిని వివరించారు. ఇటీవలే ప్రత్యేక హోదా సాధించిన కోటి మంది జనాభా గల చిన్నరాష్ట్రమైన ఉత్తరాఖండ్‌ కు స్థూల జాతీయోత్పత్తిలో 23 శాతం నిధులు కేటాయిస్తే ఐదు కోట్ల జనాభా కలిగిన ఏపీ కనీసం పదిశాతం కూడా కేటాయించకపోవడం దారుణమన్నారు. దీన్ని కూడా ప్రత్యేక ప్యాకే జీ అంటారా అని ప్రశ్నించారు. ఉన్నత పదవుల్లో ఉండే నాయకులు హుందాగా ప్రవర్తించాలని హితవు పలికారు. సొంత ప్రయోజనాల కోసం రాష్ట్ర అభివృద్ధిని పణంగా పెట్టడం సరికాదన్నారు. ఇదీ చాలదన్నట్టు హోదా కంటే ప్యాకేజీయే బాగుందని చెబుతున్న ప్రభుత్వ పెద్దలు మరి రెండున్నరేళ్ల కాలంలో చేసిన అభివృద్ధి కనిపించడం లేదని బుగ్గ‌న‌ ఎద్దేవా చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/