Begin typing your search above and press return to search.

సోషల్ మీడియాలో కొత్త రచ్చ...బుద్ధా పార్టీ మారుతున్నారట!

By:  Tupaki Desk   |   24 Jun 2019 6:05 AM GMT
సోషల్ మీడియాలో కొత్త రచ్చ...బుద్ధా పార్టీ మారుతున్నారట!
X
సోషల్ మీడియా తనదైన శైలిలో సత్తా చాటుతున్న వేళ... చాలా మంది ప్రముఖులు దాని దెబ్బకు చిత్తైపోతున్నారు. అలాంటి పరిస్థితే ఇప్పుడు టీడీపీ సీనియర్ నేత - ఆ పార్టీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నకు వచ్చింది. పార్టీ అధికారంలో ఉన్నా, విపక్షంలో ఉన్నా కూడా తనదైన శైలిలో పార్టీ తరఫున ఓ సైనికుడిలా నిలుస్తున్న బుద్ధా వెంకన్న.. తాజా ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించడంతో ఆయన వైసీపీలో చేరిపోతున్నారంటూ సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన ఓ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారిపోయింది. అంతేకాకుండా బుద్ధా వెంకన్నకు చిర్రెత్తుకొచ్చేలా చేసింది.

తన ప్రమేయం లేకుండానే సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన సదరు పోస్ట్ కు బుద్ధా వెంకన్న ఇప్పుడు వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ పోస్ట్ ఎలా పుట్టిందో - ఎవరు పుట్టించారో కూడా తెలియని పరిస్థితిలో దిక్కూమొక్కూ లేని ఆ పోస్ట్ కు వివరణ ఇచ్చుకోవాల్సి రావడమంటే బుద్దా వెంకన్నకేంటీ... ఎవరికైనా ఇబ్బందే కదా. ఈ తరహా పోస్ట్ గురించి తెలిసి కూడా సైలెంట్ గా ఉండే అదే నిజమని నమ్మే అవకాశం కూడా లేకపోలేదు. దీంతో బుద్ధా వెంకన్న సదరు పోస్ట్ ను ఖండించడంతో పాటుగా ఏకంగా దానిపై విజయవాడ పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేయడంతో పాటు ఆ పోస్ట్ పెట్టినవారెవరో గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని కూడా కోరారు.

ఈ సందర్భంగా బుద్ధా వెంకన్న ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైసీపీకి దీటుగా బదులిస్తున్న కారణంగానే ఆ పార్టీకి చెందిన వారు తనపై మైండ్ గేమ్ మొదలుపెట్టారని ఆయన ఆరోపించారు. ప్రాణం పోయినా తాను టీడీపీని వీడేది లేదని కూడా బుద్ధా స్పష్టం చేశారు. ఒకవేళ పార్టీ మారే పరిస్థితే వస్తే... తన రాజకీయ ఎదుగుదలకు కారణమైన టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు కాళ్ల వద్ద ప్రాణాలు వదిలేస్తానని ఆయన పేర్కొన్నారు. మొత్తంగా బుద్ధా వెంకన్న పార్టీ మారుతున్నారంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ ఎంట్రీ ఇవ్వడం - అది వైరల్ కావడం - దానికి బుద్ధా కౌంటర్ ఇవ్వడం నిజంగానే ఆసక్తి రేకెత్తించింది.