Begin typing your search above and press return to search.

బాబును చేత‌కాని సీఎం చేస్తున్న టీడీపీ ఎమ్మెల్సీ

By:  Tupaki Desk   |   16 Jun 2018 4:36 PM GMT
బాబును చేత‌కాని సీఎం చేస్తున్న టీడీపీ ఎమ్మెల్సీ
X
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు `కుటుంబానికి` వీర విధేయుడు అనే పేరున్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. బాబును ప్ర‌స‌న్నం చేసుకునేందుకు అన్ని అవ‌కాశాల‌ను ఉపయోగించుకునే బుద్ధా తాజాగా చేసిన వ్యాఖ్య‌లు బాబుకు మైన‌స్‌గా మారే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. తాజాగా మీడియాతో మాట్లాడిన బుద్ధా వెంక‌న్న 2002లో గోద్రా ఘటనను వ్యతిరేకించిన కారణంగా చంద్రబాబుపై నరేంద్ర మోడీ కక్షగట్టారని... మోడీ ఉన్మాద చేష్టలను వ్యతిరేకించడం వల్లే ఇప్పుడు చంద్రబాబు టార్గెట్ చేశారని బుద్దా వెంకన్న సంచ‌ల‌న కామెంట్లు చేశారు.

దేశంలో నరేంద్ర మోడీని అడ్డుకునే సామర్థ్యం చంద్రబాబుకే ఉందని బుద్ధా వెంక‌న్న వ్యాఖ్యానించారు. అంతేకాకుండా...మోడీని గద్దె దించే దమ్ము చంద్రబాబుకు మాత్రమే ఉందని బుద్దా వెంకన్న జోస్యం చెప్పారు. నరేంద్ర మోడీ ఓ ఉన్మాది అంటూ మండిపడ్డారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంక‌న్న చంద్రబాబుపై వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ - బీజేపీ నేతలు మహాకుట్ర చేస్తున్నారని ఆరోపించారు. సీఎం చంద్ర‌బాబుపై భౌతికదాడులు జరిగే ప్రమాదం ఉందని క‌ల‌క‌లం రేపే కామెంట్లు చేశారు. `ముస్లింలు` చంద్రబాబు చేస్తోన్న ధర్మపోరాటానికి బాసటగా నిలవాలని పిలుపునిచ్చారు. 2019 ఎన్నికల తర్వాత బీజేపీ, వైసీపీ పరిస్థితి కుక్కలు చింపిన విస్తరే అని బుద్దా వెంకన్న జోస్యం చెప్పారు.

బాబు కుటుంబానికి వీర విధేయుడ‌నే పేరున్న బుద్ధా వెంక‌న్న ఆయ‌న‌కు మ‌ద్ద‌తుగా మాట్లాడుతూ భౌతిక దాడుల గురించి ప్ర‌స్తావించ‌డం చిత్రంగా ఉంద‌ని ప‌లువురు అంటున్నారు. ఒక ముఖ్య‌మంత్రి, అందులోనూ దేశంలోనే అతి కొద్ది మందిప్ర‌జా ప్రతినిధుల‌కు మాత్ర‌మే ఉన్న జెడ్ ప్ల‌స్ భ‌ద్ర‌త క‌లిగిన చంద్ర‌బాబుపై భౌతిక దాడులు జ‌రుగుతాయా అనే ప్ర‌శ్న‌కు..స‌హ‌జంగా `నో` అనే స‌మాధాన‌మే వ‌స్తుంది. ఇలాంటి సాధార‌ణ‌మైన విష‌యాన్ని ఎమ్మెల్సీ అయిన బుద్దా వెంక‌న్న ఎందుకు ఆలోచించ‌లేద‌నేది ఓ సందేహం. ఒక‌వేళ‌, దుర‌దృష్ట‌వ‌శాత్తు వెంక‌న్న జోస్య‌మే నిజ‌మైతే అప్పుడు శాంతిభ‌ద్ర‌త‌లు వైఫ‌ల్యం చెందిన‌ట్లే. ఎందుకంటే..సాక్షాత్తు సీఎంపైనే భౌతిక దాడి జ‌ర‌గ‌డం అనేది ఎంత అనిశ్చితి త‌ర్వాత నెల‌కొన్న అంశ‌మో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేద‌ని ప‌లువురు పేర్కొంటున్నారు. ఇలా వాస్త‌విక అంశాలు ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోకుండా...వెంక‌న్న చేసిన కామెంట్లు బూమ‌రాంగ్ అయ్యాయ‌ని ప‌లువురు వ్యాఖ్యానిస్తున్నారు.