Begin typing your search above and press return to search.

మాల్యా - నీరవ్ విషయంలో షాకిచ్చిన బ్రిటన్

By:  Tupaki Desk   |   13 Jun 2018 6:28 AM GMT
మాల్యా - నీరవ్ విషయంలో షాకిచ్చిన బ్రిటన్
X
భారత్ కు బ్రిటన్ అదిరిపోయే షాక్ ఇచ్చింది. దేశంలోని అనేక బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి బ్రిటన్ లో తలదాచుకుంటున్న ఆర్థిక నేరగాళ్లు కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యా - పారిశ్రామిక వేత్త నీరవ్ మోడీలను భారత్ కు అప్పగించడానికి మెలికలు పెట్టింది. ఆ మెలికలతో దాదాపు వారు భారత్ కు రావడం ఆసాధ్యంగా కనిపిస్తోంది.

భారత ప్రధాని నరేంద్రమోడీ బ్రిటన్ పర్యటనలో వ్యవహరించిన నిర్లిప్తతతే ఇప్పుడు మాల్యా - నీరవ్ మోడీలను భారత్ కు రప్పించడానికి ప్రధాన అడ్డంకిగా మారింది. బ్రిటన్ లో దాదాపు 75వేల మంది వలసదారులున్నారు. అక్రమంగా నివసిస్తున్న వలసదారుల బహిష్కరణపై బ్రిటన్ ప్రభుత్వం ఓ ముసాయిదాను రూపొందించింది. అయితే ఈ ఏడాది ఏప్రిల్ లో బ్రిటన్ లో పర్యటించిన ప్రధాని మోడీ ఆ అవగాహన పత్రంపై సంతకం చేయలేదు. దీన్నే ప్రస్తుతం బ్రిటన్ విదేశాంగ శాఖ భారత్ ముందు ఉంచినట్లు తెలుస్తోంది.

బ్రిటన్ లో అత్యధికంగా ఉన్నది భారతీయ వలసదారులే.. వారందరినీ దేశం నుంచి పంపించేందుకు ఉద్దేశించిన ముసాయిదాపై మోడీ సంతకం చేయలేదు. భారతీయుల్లో వ్యతిరేకత వస్తుందని ఆయన వెనక్కి తగ్గారు. దీంతో ఇప్పుడు చిక్కు వచ్చి పడింది. అందరినీ వెనక్కి పంపిస్తామని.. దాన్ని ఆమోదిస్తేనే నీరవ్ మోడీ - మాల్యాలను కూడా పంపిస్తామని బ్రిటన్ మెలిక పెట్టింది. ఈ మేరకు బ్రిటన్ మంత్రి బరోనెస్ విలియమ్స్ సోమవారం కేంద్ర మంత్రి కిరణ్ రిజుజుతో మాట్లాడుతూ స్ఫష్టం చేశారు. దీంతో నీరవ్ మోడీ - మాల్యాలను రప్పించాలంటే మొత్తం బ్రిటన్ లో అక్రమంగా ఉన్న భారతీయులను వెనక్కి రప్పించాల్సి ఉంటుంది. బ్రిటన్ పెట్టిన ఈ మెలిక ఇప్పుడు మోడీ ప్రభుత్వానికి పెను భారంగా మారింది.