Begin typing your search above and press return to search.

వీడి దుంప‌తెగ: లంచం ఇలా ఇస్తాడా?

By:  Tupaki Desk   |   28 Aug 2015 5:09 AM GMT
వీడి దుంప‌తెగ: లంచం ఇలా ఇస్తాడా?
X
ధ‌నం మూలం ఇదం జ‌గ‌త్ అనేది పాత సామెత‌. అదికాస్త ...స‌ర్వ‌త్రా లంచం మ‌యం అనే స్థితికి కాలం మారిపోయింది. అయితే న్యాయ‌వ్య‌వ‌స్థ‌కు కూడా లంచాల మ‌కిలి అంటించ‌డానికి ప్ర‌య‌త్నం చేశారు. ఈ క్ర‌మంలో ఓ యువ‌కుడు కొత్తగా లంచం ఆఫ‌ర్ చేశాడు. జైలు నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు వేసిన ఎత్తు ఫెయిలై...తిరిగి జైలు పాల‌య్యాడు.

పశ్చిమ గోదావరి జిల్లా అనంతపల్లి పోలీస్ స్టేషన్‌ పరిధిలోని అయ్యవరానికి చెందిన ఓ మహిళను సూరిబోయిన నాగేశ్వరరావు, సోమరాజు, మరో ఇద్దరు కొట్టారు. దీనిపై పోలీసులు కేసు నమోదుచేసి 2010లో ఆ నలుగురిని అరెస్టు చేశారు. ఈ కేసు విచారణ తాడేపల్లి గూడెం సీనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులో జరుగుతోంది. కాగా గత ఏడాది నవంబరు 16వ తేదీన సీనియర్‌ సివిల్‌ జడ్జి డేవిడ్‌ ఇంటికి ఓ యువకుడు వచ్చి తనను పాస్టర్‌ సత్యానందం పంపించారని చెప్పి సీతాఫలాలు ఉన్న బుట్టను జడ్జి ఇంటి వద్ద ఉంచి వెళ్లిపోయాడు. మరుసటి రోజు జడ్జి ఆ బుట్టను విప్పగా అందులో 19వేలు నగదు ఉంది. నగదుతోపాటు ఈ కేసు ఎఫ్‌ ఐఆర్‌ కాపీ, తాము ఎంతో పేదవాళ్లమని, తమపై దయచూపి కేసు కొట్టి వేయాలని కోరుతూ లేఖ ఉన్నాయి. వీటిని పరిశీలించిన జడ్జి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదుచేసి ఏసీబీకి బదిలీ చేశారు. ఏసీబీ అధికారులు సూరిబోయిన సోమరాజు కుమారుడు కిశోర్‌బాబును గురువారం అరెస్ట్‌ చేశారు.

న్యాయమూర్తికి కూడా లంచం ఇచ్చేందుకు ప్రయ‌త్నం చేయ‌డం అంటే లంచాల మాయ ఎంత న‌డుస్తుందో అర్థం చేసుకోవ‌చ్చు. అదే క్ర‌మంలో స‌ద‌రు యువ‌కుడిని అరెస్టు చేయించ‌డం ద్వారా జ‌డ్జి మంచి సందేశాన్ని పంపించి ఆద‌ర్శ‌ప్రాయంగా నిలిచార‌ని చెప్పుకోవ‌చ్చు.