Begin typing your search above and press return to search.

మోడీకి బాబు వంగి దండాలు పెట్టాడు: బొత్స

By:  Tupaki Desk   |   18 Jun 2018 11:44 AM GMT
మోడీకి బాబు వంగి దండాలు పెట్టాడు: బొత్స
X

చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి నీతి అయోగ్ సమావేశంలో దులిపేస్తారని.. అవసరమైతే వాకౌట్ చేస్తారని చెప్పారని.. కానీ ఇక్కడకు వెళ్లి ఆఖరుకు నరేంద్రమోడీకి వంగి వంగి దండాలు పెట్టారని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ ఎద్దేవా చేశారు. మోడీని కలిసిన సమయంలో చంద్రబాబు ముఖంలో కనిపించిన ముఖ కవళికలను చూస్తే తన భయాన్ని కవర్ చేసుకోవడం స్పష్టం కనిపిస్తోందని బొత్స సెటైర్ వేశారు.

నాటకాలు ఆడే విషయంలో తన అంతటి వారు లేరని చంద్రబాబు ఢిల్లీ సాక్షిగా మరోసారి నిరూపించారని బొత్స మండిపడ్డారు. చంద్రబాబుది ఓ వికృత నవ్వు అని బొత్స ఎద్దేవా చేశారు. అసలు చంద్రబాబుది పోరాడే నైజం కాదని.. అందితే జుట్టు లేకుంటే కాళ్లు పట్టుకునే రకం అని విమర్శించారు.

* మోడీతో బాబు కాళ్లబేరం : బత్తుల

ఓటుకు నోటు కేసు భయంతోనే చంద్రబాబు.. ప్రధాని మోడీ ముందు మోకరిల్లుతున్నారని వైసీపీ అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి అన్నారు. లాలూచీ రాజకీయాలు చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని అన్నారు. బీజేపీతో బాబు లాలూచీ ఢిల్లీ సాక్షిగా మరోసారి బయటపడిందని అన్నారు. మోడీతో కాళ్ల బేరానికి వెళ్లిన బాబును చూసి ఎల్లో మీడియాకు మాత్రం ఆయన యుద్ధం చేస్తున్నట్లు గా కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. మోడీతో చంద్రబాబు చిరునవ్వులు చిందిస్తూ ఒకింత భక్తిభావంతో వంగి కరచాలనం చేస్తూ కనిపించారని వైసీపీ నేత విమర్శించారు.

*ఇంట్లో పులి.. వీధిలో పిల్లి బాబు: జీవీఎల్ నర్సింహారావు

నీతి అయోగ్ సమావేశంలో బాబు రెచ్చిపోయి మోడీని కడిగిపారేశారన్న ప్రచారం శుద్ధ అబద్ధమని బీజేపీ నేత జీవీఎల్ నర్సింహారావు స్పష్టం చేశారు. టీడీపీ అసత్యాలు ప్రచారం చేస్తోందన్నారు. సీఎం చంద్రబాబు ఘర్షణ విధానాన్ని అనుసరించలేదు. ఇది చూడండి అంటూ పలు ఫొటోలు, వీడియోలను ఆయన విడుదల చేశారు. బాబు తీరు చూస్తుంటే ఇంట్లో పులి.. వీధిలో పిల్లిలా ఉందంటూ జీవీఎల్ ట్వీట్ చేస్తూ సెటైర్ వేశారు.