Begin typing your search above and press return to search.

రాజధానిపై మరోసారి స్పందించిన బొత్స!

By:  Tupaki Desk   |   25 Aug 2019 6:59 AM GMT
రాజధానిపై మరోసారి స్పందించిన బొత్స!
X
రాజధాని అంశంపై ఒక విధమైన కలకలం రేగడానికి ముఖ్య కారణం మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలే అనే సంగతి చెప్పనక్కర్లేదు. ఇటీవలి వరదల నేపథ్యంలో రాజధాని విషయంలో ప్రభుత్వం పునరాలోచనలో ఉన్నట్టుందన్నట్టుగా బొత్స వ్యాఖ్యానించారు. ఆ వ్యవహారం పై తెలుగుదేశం పార్టీ ఘాటుగా రియాక్ట్ అయ్యింది. రాజధానిని మార్చబోతున్నారంటూ తెలుగుదేశం అనుకూల మీడియా ప్రచారం కూడా షురూ చేసింది. దీంతో ఈ వ్యవహారంపై రచ్చ సాగుతూ ఉంది.

ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై చర్చను మొదలుపెట్టిన బొత్స సత్తిబాబు మరోసారి స్పందించారు. తన మాటలను ఉద్దేశించి ఎవరికి వారు సొంత వ్యాఖ్యానాలు చేస్తూ పోతున్నారని బొత్స అన్నారు. అలా ఎవరికి వారు రాసుకుంటూ పోతే సరిపోతుందా? అని ప్రశ్నించారు.

ఇక రాజధాని ఎక్కడుండాలి అనే అంశం గురించి అప్పట్లో కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ నివేదికను పట్టించుకోకుండా చంద్రబాబు నాయుడు ఇష్టానికి వ్యవహరించడంపై కూడా బొత్స స్పందించారు. అప్పుడు నారాయణ కమిటీ అంటూ చంద్రబాబు నాయుడు వేశారని - రాజధాని విషయంలో తేల్చడానికి నారాయణకు ఉన్న అర్హతలు ఏమిటి? అని బొత్స ప్రశ్నించారు. నారాయణ రాజధాని ఎక్కడుండాలో తేల్చడానికి ఏమైనా నిపుణుడా? అని అన్నారు.

అప్పట్లో అమరావతి విషయంలో హడావుడి అంతా నాటి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణదే అని వేరే చెప్పనక్కర్లేదు. రాజధాని విషయంలో స్టడీ చేయడానికి అంటూ ఆయన దేశదేశాలు కూడా చుట్టేశారు. ప్రభుత్వ ఖర్చులతో అలాంటి హడావుడి చేశారు. సీఆర్డీఏను కూడా నారాయణే శాసించాడనే మాట వినిపించింది. ఎన్నికల్లో ఓడిపోయాకా ఇప్పుడు నారాయణ మారు మాట్లాడటం లేదు. ఆయన టీడీపీ యాక్టివిటీస్ లో కూడా ఎక్కడా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో బొత్స సత్యనారాయణ నాటి మంత్రి నారాయణ ప్రస్తావన తీసుకురావడం ఆసక్తిదాయకంగా మారింది.