Begin typing your search above and press return to search.

రాజ్‌ భ‌వ‌న్ పేరు మార్చేసిన చంద్ర‌బాబు

By:  Tupaki Desk   |   1 Sep 2016 5:12 AM GMT
రాజ్‌ భ‌వ‌న్ పేరు మార్చేసిన చంద్ర‌బాబు
X
అదేంటి కేంద్ర ప్ర‌భుత్వం ప‌రిధిలో ఉండే గ‌వ‌ర్న‌ర్ నివాస‌మైన రాజ్ భ‌వ‌న్ పేరును రాష్ట్ర ముఖ్య‌మంత్రి మార్చ‌గ‌ల‌రా? ఇది సాధ్య‌మయ్యే ప‌నేనా అనే క‌దా మీ సందేహం. దీనికి స‌మాధానం అవున‌నే అంటున్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ. తాజా రాజ‌కీయ ప‌రిణామాల‌ను ఉద్దేశిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన బొత్స ఏపీ సీఎంపై విరుచుకుప‌డ్డారు. సొంత ప్ర‌యోజ‌నాల‌కు - లాలూచీల కోసం చంద్ర‌బాబు ఆఖ‌రికి గ‌వ‌ర్న‌ర్ నివాసాన్ని కూడా వాడుకుంటున్నార‌ని మండిప‌డ్డారు. రాజ్యాంగ విలువలను పరిరక్షించే రాజ్‌ భవన్‌ ను - రాజీ భవనంగా చేశార‌ని దుయ్య‌బ‌ట్టారు.

ఓటుకు కోట్లు కేసు నుంచి తప్పించుకోవడం కోసమే చంద్రబాబు నాయుడు రాజ్‌ భవన్‌ ను రాజీ భవన్‌ గా చేయడానికి సిద్ధపడుతున్నారని బొత్స‌ ఆరోపించారు. సాక్షాత్తు కేంద్రమంత్రి పార్లమెంట్‌ లో హౌదా ఇవ్వబోమని ప్రకటించిన తరువాత మళ్లీ అదే అంశాన్ని గవర్నర్‌ తో చర్చించామని సుజనా చౌదరి చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. టీడీపీకి చెందిన‌ కేంద్ర మంత్రి సుజనా చౌదరి ఓటుకు కోట్లు కేసును నీరుగార్చేందుకే గవర్నర్‌ ను కలిశారని బొత్స‌ ఆరోపించారు. ప్రత్యేక హోదా - ప్యాకేజీ అంటూ ఎవరి చెవ్వుల్లో పూలు పెట్టాలనుకుంటున్నారని నిలదీశారు. అమిత్‌ షా - అరుణ్‌ జైట్లీలతో సమావేశమైన వెంటనే హుటాహుటిన ఢిల్లీ నుంచి వచ్చి ఆయన గవర్నర్‌ ను కలవడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు. ఓటుకు కోట్లు కేసు నుంచి చంద్రబాబును బయటపడేసేందుకు సుజనా కాళ్ల బేరానికి వెళ్లాడని ఆరోపించారు. అందరికీ రాజకీయ పాఠాలు నేర్పుతానని ప్రగల్భాలు పలికే రాజకీయ పీఠాధిపతి చంద్రబాబు అడ్డదారిలో ఎమ్మెల్సీ సీటు గెలుపొందేందుకు తెలంగాణలో ఓ ఎమ్మెల్యేకు లంచం ఇస్తూ పట్టుపడటం సిగ్గుచేటని బొత్స మండిప‌డ్డారు. ఎన్ని తప్పులు చేసినా మమ్మల్ని ఎవరు ప్రశ్నించకూడదు అన్నట్లు బాబు వ్యవహరించడం దుర్మార్గమన్నారు. ఇప్ప‌టివ‌ర‌కు ప్ర‌జాస్వామ్యాన్ని అప‌హాస్యం చేసింది చాలు అని పేర్కొన్న బొత్స ఇక‌నైనా చంద్ర‌బాబు అలాంటి విధానాల‌ను వీడాల‌ని కోరారు.

కరువు, వర్షపాతం తదితర అంశాలు తనకు - ఎమ్మెల్యేలు - అధికారులకు తెలియవని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పడం సిగ్గుచేటని బొత్స విమర్శించారు. ఒక పక్క నా చేతిలోని కంప్యూటర్‌ - సెల్‌ ఫోన్‌ ద్వారా ఏ చెరువులో - ఏ గుంతలో ఎంత నీరుందో రెండు నిమిషాల్లో చెప్పేస్తాననే చంద్రబాబుకు కరువు పరిస్థితులపై అవగాహన లేకపోవడం నిజంగానే విడ్డూరమేనని ఎద్దేవా చేశారు. చెప్పేది ఒక‌టి...చేసేది మ‌రొకటి అనే విధానానాకి చంద్ర‌బాబు పెట్టింది పేరు అని బొత్స విమ‌ర్శించారు.