Begin typing your search above and press return to search.

బొత్స మాట‌ల‌కు స్పందించే ద‌మ్ముందా బాబు?

By:  Tupaki Desk   |   14 Dec 2018 4:03 PM GMT
బొత్స మాట‌ల‌కు స్పందించే ద‌మ్ముందా బాబు?
X
ఏపీలో అడుగుపెట్ట‌బోతున్నామ‌ని టీఆర్ ఎస్ పార్టీ ప్ర‌క‌టించింది మొద‌లుకొని...వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీతో అంటుక‌ట్టి తెలుగుదేశం పార్టీ చేస్తున్న విమ‌ర్శ‌ల‌కు పార్టీ సీనియర్‌ నాయకులు బొత్స సత్యనారాయణ సూప‌ర్ ట్విస్ట్ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ నేత‌ల మైండ్ బ్లాంకయ్యే రీతిలో ఆయ‌న ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు. హైదరాబాద్‌ లోటస్‌ పాండ్‌ లోని వైయస్‌ ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో బొత్స సత్యనారాయణ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొద్ది రోజుల్లో ఏపీలో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో వైయస్‌ ఆర్‌ సీపీ దృష్టి - ఆలోచన విధానాలన్నీ ఆంధ్రరాష్ట్ర అభివృద్ధి కోసమే ఉపయోగిస్తామన్నారు. ఏపీకి సంబంధించిన అంశాలపై రాజీపడే ప్రసక్తే లేదని - తెలుగుదేశం పార్టీ మాయమాటలు నమ్మొద్దన్నారు.

తెలంగాణ ఎన్నికల ఫలితాల తరువాత చంద్రబాబు తన నీడను చూసి కూడా భయపడుతున్నాడని బొత్స సత్యనారాయణ ఎద్దేవా చేశారు. విశాఖ - ఒంగోలు సభల్లో తెలంగాణ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడాన్ని అడ్డుకుంటుందన్న చంద్రబాబు.. ఎన్నికలకు ముందు నందమూరి హరికృష్ణ చనిపోయినప్పుడు ఏ విధంగా టీఆర్‌ ఎస్‌ తో పొత్తు పెట్టుకుందామని కేటీఆర్‌ ను అడిగారని ప్రశ్నించారు. టీడీపీ - టీఆర్‌ ఎస్‌ పార్టీలు కలిసి పోటీ చేయడం ప్రత్యేక హోదాకు వ్యతిరేకం కాదా..? అని నిలదీశారు. చంద్రబాబుది తన స్వార్థ ప్రయోజనాల కోసం రెండు పడవలపై ప్రయాణం చేసే తత్వం అన్నారు. చంద్రబాబు ఊసరవెల్లి మాటలను ఆంధ్రరాష్ట్ర ప్రజలంతా గమనించాలని బొత్స సత్యనారాయణ కోరారు. టీఆర్‌ ఎస్‌ ప్రభుత్వంతో అన్ని విషయాల్లో రాజీపడింది చంద్రబాబేనన్నారు. పండుగలు - పబ్బాలకు తెలంగాణ నుంచి కేసీఆర్‌ ను చంద్రబాబు పిలవడం. కేసీఆర్‌ యాగం చేస్తే చంద్రబాబు వెళ్లడం ఇది నిజం కాదా..? బాబు - కేసీఆర్‌ ల మధ్య సత్సంబంధాలు కొనసాగాయన్నారు. దుర్గమ్మ సన్నిధికి వస్తే మంత్రులు ఎందుకు వెళ్లారని అడిగితే ప్రొటోకాల్‌ అంటున్నారని - 2017లో యాగం చేస్తే చంద్రబాబు వెళ్లారని - పరిటాల సునీత కుమారుడి వివాహానికి కేసీఆర్‌ రాకకు భారీ స్వాగత తోరణాలను కట్టారన్నారు. ఇద్దరి మధ్య సత్సంబంధాలు కొనసాగయడానికి ఇంతకంటే నిదర్శనం ఏముందన్నారు. చంద్రబాబు తెలంగాణకు వచ్చి వారి పార్టీకి నష్టం చేకూర్చే ప్రయత్నం చేశారని - కేసీఆర్‌ కూడా ఆంధ్రరాష్ట్రానికి వచ్చి ప్రచారం చేస్తానని మాట్లాడారన్నారు. గతంలో బీజేపీతో - జనసేనతో వైయస్‌ ఆర్‌ సీపీ కలిసిపోయిందని మాట్లాడిన తెలుగుదేశం పెద్దలు ఇప్పుడు కొత్తగా టీఆర్‌ ఎస్‌ తో కూడా సంబంధం అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఓటుకు కోట్ల కేసులో చంద్రబాబుకు శిక్షపడి ఉంటే ఏపీలో ఇంత దోపిడీ జరిగి ఉండేది కాదని బొత్స అన్నారు. కేసీఆర్ - చంద్రబాబు కలిసి నష్టం చేశారని వైయస్‌ ఆర్‌ సీపీ అభిప్రాయమన్నారు. చంద్రబాబుకు రాష్ట్ర ప్రయోజనాల కంటే పార్టీ ప్రయోజనాలే ముఖ్యమంత్రి - ముఖ్యమంత్రి కుర్చీ కోసం ఎంతటి కుట్రలైనా చేస్తాడన్నారు. వైయస్‌ ఆర్‌ సీపీకి పార్టీ కంటే రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమన్నారు. అందుకే ఏ పార్టీతో పొత్తులు పెట్టుకోలేదన్నారు. లగడపాటి రాజగోపాల్‌ చంద్రబాబుతో చేతులు కలిపి ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేశాడన్నారు. మనిషి బలహీనతలతో ఆడుకోవడం లగడపాటికి అలవాటన్నారు. లోకేష్‌ తో కలిసి బెట్టింగ్‌ ల డబ్బు కోసం తప్పుడు సర్వే చేసి ఉంటాడని అనుమానం వ్యక్తం చేశారు.

చంద్రబాబు టీఆర్‌ ఎస్‌ తో కలిసి ఆంధ్రరాష్ట్రంలో వైయస్‌ ఆర్‌ సీపీ ఉనికి లేకుండా చేద్దామనుకున్నారని బొత్స మండిపడ్డారు. తెలుగుదేశం ఏ రాష్ట్రంలో పోటీ చేసినా ఓటమిని కోరుకుంటామని - ఏపీని నాశనం చేసిన పార్టీ ఓడిపోవాలని కోరుకుంటామన్నారు. మజ్లిస్‌ పార్టీతో కూడా వైయస్‌ ఆర్‌ సీపీని అండగడుతున్నారన్నారు. చంద్రబాబు దుష్ప్రచారాలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. దేశంలో మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ గెలవడానికి తెలుగుదేశం కృషి ఉందని చంద్రబాబు మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబు ఆ రాష్ట్రాలకు వెళ్లి మాతృభాష హిందీలో మాట్లాడి ప్రభావితం చేశాడు కానీ.. తెలంగాణలో మన మాతృభాష తెలుగులో మాట్లాడితే ప్రజలు అర్థం చేసుకోలేక ఓడిపోయాడని ఎద్దేవా చేశారు. తెలంగాణలో ఫలితాలు వెలువడిన వెంటనే ట్విట్టర్‌ లో లోకేష్ - చంద్రబాబు కేసీఆర్‌ కు శుభాకాంక్షలు తెలిపారని - సాయంత్రం 6 గంటలకు వైయస్‌ ఆర్‌ సీపీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ విషెస్‌ చెబితే దాన్ని కూడా తప్పుబడుతున్నారని మండిపడ్డారు. విజయనగరం సభలో కూటమికి కర్త - కర్మ - క్రియ నేనే అని చంద్రబాబు వ్యాఖ్యానించారన్నారు. బీజేపీతో నాలుగేళ్లు కాపురం చేసి - ఆ తరువాత టీఆర్‌ ఎస్‌ ను కాపురానికి పిలిచాడని - ఆ తరువాత ఇప్పుడు కాంగ్రెస్‌ తో పొత్తు పెట్టుకున్నాడన్నారు. వీరిద్దరి అనైతిక పొత్తును ప్రజలు చీదరించుకున్నారన్నారు.