Begin typing your search above and press return to search.

అమెరికాలో భార‌తీయ కుటుంబం క‌థ విషాదాంతం!

By:  Tupaki Desk   |   17 April 2018 8:07 AM GMT
అమెరికాలో భార‌తీయ కుటుంబం క‌థ విషాదాంతం!
X
అమెరికాలో ఏప్రిల్ 8న‌ భారతీయ కుటుంబం అదృశ్యమైన ఘ‌ట‌న తీవ్ర క‌ల‌క‌లం రేపిన సంగ‌తి తెలిసిందే. విహార యాత్ర‌కు వెళ్లిన భార‌తీయ కుటుంబం కోసం పోలీసులు, స‌హాయ‌క బృందాలు తీవ్రంగా గాలించాయి. అయితే, అనూహ్యంగా ఆ కుటుంబం క‌థ విషాదాంతంగా ముగిసింది. ఆ కుటుంబం ప్ర‌యాణిస్తున్న కారు న‌దిలో ప‌డిపోవ‌డంతో కుటుంబ స‌భ్యులంతా చ‌నిపోయార‌ని పోలీసులు తెలిపారు. కాలిఫోర్నియాలోని ఈల్ నదిలో మునిగిన వాహ‌నంలోని 2 మృతదేహాలను పోలీసులు గుర్తించారు. సందీప్ తోటపల్లి(41) - సాచి తోటపల్లి(9) ల మృత‌దేహాలు ఆ కారులో ల‌భించాయ‌ని - గత శుక్రవారం ఇదే నదిలో సౌమ్య తోటపల్లి(38) మృతదేహం లభించిందని అధికారులు తెలిపారు. ఎలాగైన సందీప్ కుటుంబం ఆచూకీ దొరుకుతుంద‌ని భావించిన కుటుంబ స‌భ్యులు ఈ వార్త విని శోక సంద్రంలో మునిగిపోయారు.

కాలిఫోర్నియాలోని శాంటాక్లారిటలో ఉంటోన్న సందీప్ - ఆయన భార్య సౌమ్య - వారి పిల్లలు సిద్ధాంత్ - సాచీలు కొద్ది రోజుల క్రితం తమ ఎస్ యూవీలో విహార యాత్రకు వెళ్లి అదృశ్యమ‌య్యారు. వారి ఆచూకీ కోసం పోలీసులు - సహాయక బృందాలు తీవ్రంగా గాలించారు. గ‌త శుక్ర‌వారం సౌమ్య మృత‌దేహాన్ని పోలీసులు గుర్తించారు. సోమ‌వారం నాడు న‌దిలో ప‌డ్డ ఎస్ యూవీలో సాచి - సందీప్ ల మృత‌దేహాలు పోలీసుల‌కు ల‌భించాయి. సిద్ధాంత్ ఆచూకీ తెలియాల్సి ఉంది. సిద్ధాంత్ మృతదేహం కోసం 20మంది సభ్యుల బృందం నదిలో గాలిస్తోందని పోలీసులు తెలిపారు. కాగా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ శాంటాక్లారిటా వైస్ ప్రెసిడెంట్ గా సందీప్ వ్యవహరిస్తున్నారు. సందీప్ తన కుటుంబంతో క‌లిసి ఏప్రిల్ 8న పోర్ట్‌ ల్యాండ్ నుంచి శాన్‌ జోస్ కు ప్రయాణిస్తుండ‌గా ప్ర‌మాద‌వ‌శాత్తూ వారి వాహ‌నం ఈల్ న‌దిలో ప‌డిపోయింద‌ని పోలీసులు భావిస్తున్నారు. గుజరాత్ లో నివాసం ఉంటున్నసందీప్ త‌ల్లిదండ్రులు - కేరళలోని కొచ్చిలో ఉంటోన్న సౌమ్య తల్లిదండ్రులు...శోక‌సంద్రంలో మునిగిపోయారు.