Begin typing your search above and press return to search.

పడవ మునక వెనక అంతుచిక్కని నిజాలివీ..

By:  Tupaki Desk   |   16 May 2018 8:06 AM GMT
పడవ మునక వెనక అంతుచిక్కని నిజాలివీ..
X
గోదారికి కోపమొచ్చినట్టుంది.. మొన్నీ మధ్యే పాపికొండలను కాల్చేసి తన దాహార్తి తీర్చుకున్న గోదారి నిన్న రాత్రి 34మందిని తనలో కలిపేసుకుంది. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం మంటూరు.. పశ్చిమగోదావరి జిల్లా కోండ్రుకోట సమీపంలోని వాడపల్లి మధ్య గోదావరిలో లాంచీ బోల్తా పడింది. ఆ సమయంలో తీవ్రమైన ఈదురుగాలులు వీచడంతో ప్రమాదం సంభవించింది. దాదాపు 50 మందితో ప్రయాణిస్తున్న లాంచీ బోల్తా పడడంతో 40 మందికి పైగా గల్లంతయ్యారని చెబుతున్నారు. మరణాలపై మాత్రం లెక్క తేలడం లేదు..

* పడవ ప్రమాదానికి కారణమేంటి.?

దాదాపు 50 మంది పెళ్లి బృందంతో పడవ ప్రయాణం మొదలైంది. అదే లాంచీ లో సిమెంట్ బస్తాలు కూడా భారీగా ఉన్నాయి. పడవ కొద్దిదూరం వెళ్లగాలే ఈదురుగాలులు - భారీ వర్షం మొదలైంది. దీంతో లాంచీలోని సిబ్బంది సిమెంట్ బస్తాలు తడిసిపోతున్నాయని లాంచీలోని మూడు గదుల్లో వేసి తలుపులు మూసివేశారు. దీంతో బరువు ఎక్కువై పోయింది లాంచీ పైన మరో అంతస్తులో దానిపైన టెంట్లు వేసి ఈ ప్రయాణికులను కూర్చోబెట్టారు. ఈదురుగాలులకు టెంట్ కూడా ఊగిపోయి లాంచీ అదుపుతప్పింది. లోపల ఉన్నవారిలో చాలామందికి ఈత వచ్చినా లాంచీ తలుపులు మూసివేయడంతో బయటకు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. లాంచీలో పిల్లలు - మహిళలు - పెద్దలు చాలా మంది మునిగిచనిపోయారు. లాంచీ పైన ఉన్న వారు 10 మంది తప్పించుకొని ఈత కొట్టుకుంటూ ఒడ్డుకు చేరారు. లాంచీ డ్రైవర్ ను ఇంత మందితో - సిమెంట్ బస్తాలతో వెళ్లవద్దని మొదట్లోనే చాలా మంది సూచించినా డబ్బుల కోసం తీసుకెళ్లడమే ప్రమాదానికి కారణమైందని ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపారు.

*బతికి బయటపడ్డవారితో వెలుగులోకి..

ప్రమాదంలో చిక్కుకున్న వారంతా తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతానికి చెందిన గిరిజనులనే ఎక్కువమంది ఉన్నారని తెలిసింది. ప్రమాదం జరిగి ఈత కొట్టుకుంటూ బయటకు వచ్చిన వారే పోలీసులకు - మీడియాకు సమాచారం అందించారు. ప్రమాదం జరిగిన ప్రాంతం రెండు కొండల మధ్య ఉంది. దాదాపు రెండు తాడిచెట్ల లోతులో నీరుంది. ఆ సమయంలో ఈదురుగాలులతో పాటు భారీ వర్షం కూడా పడింది.

*సహాయక చర్యలు

లాంచీ ప్రమాదంపై ఏపీ ప్రభుత్వం స్పందించింది. ఎన్డీఆర్ ఎఫ్ - బృందాలను పంపి మృతదేహాలను వెలికి తీసే పనులు మొదలు పెట్టింది. పడవ ఆచూకీ కోసం 60మంది సుశిక్షత సిబ్బంది వెతుకుతున్నారు. పడవ నీటి అడుగున ఇసుకలో కూరుకుపోయిందని గుర్తించారు. సిమెంట్ బస్తాల కారణంగా బయటకు రావడం లేదని తెలిసింది.

*చంద్రబాబు - జగన్ దిగ్భ్రాంతి..

పడవ ప్రమాదంపై సీఎం చంద్రబాబు - ప్రతిపక్ష నేత జగన్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ప్రమాద బాధితులకు రక్షణ చర్యల్లో వెంటనే పాల్గొనాలని సీఎం చంద్రబాబు అధికారులకు ఆదేశాలివ్వగా.. జగన్ తన పార్టీ శ్రేణులకు సహాయపడాలని సూచించారు.