Begin typing your search above and press return to search.

పదవి రాలేదు, దాదాగిరీ మొదలైపోయింది!

By:  Tupaki Desk   |   31 Aug 2016 4:53 AM GMT
పదవి రాలేదు, దాదాగిరీ మొదలైపోయింది!
X
రకరకాల ఆబ్లిగేషన్ల నేపథ్యంలో చంద్రబాబునాయుడు కర్నూలు జిల్లాకు చెందిన భూమా నాగిరెడ్డికి మంత్రి పదవి ఇవ్వడం మాత్రం గ్యారంటీ అనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఉంది. భూమా నాగిరెడ్డి కి ఇంకా మంత్రి పదవి రాలేదు గానీ.. అప్పుడే ఆయన మంత్రి స్థాయిలో - ఇంకా చెప్పాలంటే అంతకంటె ఎక్కువ స్థాయిలో తన జిల్లా కు చెందిన అధికార్ల మీద దాదాగిరీ చేయడం మాత్రం అప్పుడే షురూ అయిపోయింది. అధికార్లకు చేతకావడం లేదంటూ కస్సుబుస్సులాడుతున్నారు. నిధులేం చేస్తున్నారంటూ నిలదీసేస్తున్నారు.

ఇందులో పెద్ద విషయం కూడా ఏమీ లేదు. కర్నూలు జిల్లాలో కుండపోత వర్షం కారణంగా జనజీవనం కాస్త స్తంభించింది. వరద నీరు రాగానే - ట్రాఫిక్‌ స్తంభించడం - కొన్ని ప్రాంతాలకు ఇబ్బంది కర్నూలులో మామూలే. ఇలాంటివి జరగగానే.. ఇప్పుడు మంత్రి పదవి రేసులో ఉన్నాడు గనుక.. మరింత యాక్టివ్‌ గా కనిపించాలని ఉబలాటపడుతున్నారో ఏమో గానీ.. భూమా నాగిరెడ్డి కర్నూలు లోని వరద బాధితుల పరామర్శలకు వెళ్లారు.
అంతే అక్కడినుంచే మునిసిపల్‌ అధికార్ల మీద ఆగ్రహంతో చెలరేగిపోయారు. ఇక్కద వరదల్లో మునిగిపోతుంటే సహాయక చర్యలు చేపట్టకుండా మీటింగుల్లో కూర్చుంటారా?అంటూ నిప్పులు చెరిగారు. రాజకీయ నాయకుల్లో వినిపిస్తున్న గుసగుసల ప్రకారం.. భూమా నాగిరెడ్డి తనకు మునిపిపల్‌ శాఖ కావాలంటూ చంద్రబాబును అడుగుతున్నారట. అయితే నారాయణను తప్పించి ఆశాఖను చంద్రబాబు ఇస్తారో లేదో తెలియదు గానీ.. ఆయన మాత్రం అప్పుడే మంత్రి అయిపోయిన స్థాయిలో స్థానిక అధికార్లపై చెలరేగిపోయారు.

అయినా.. జనం మునిగిపోతూ ఉంటే మీరు మీటింగుల్లో కూర్చుంటారా అంటూ భూమా నాగిరెడ్డి అన్న మాటలు నిజంగా అధికార్లనేనా - లేదా - ఇండైరక్టుగా సీఎం చంద్రబాబుకు కూడా చురక అంటించేలా అన్నారా అనేది మాత్రం అంతుచిక్కని ప్రశ్న.