Begin typing your search above and press return to search.

మా ప్రాజెక్టులకు మీరు ఓపెనింగ్ లు చేసుడేంది?

By:  Tupaki Desk   |   23 July 2016 6:49 AM GMT
మా ప్రాజెక్టులకు మీరు ఓపెనింగ్ లు చేసుడేంది?
X
తెలంగాణ కాంగ్రెస్ నేతల పరిస్థితి మహా ఇబ్బందిగా ఉంది. తమకు రావాల్సిన క్రెడిట్ మొత్తాన్ని తెలంగాణ అధికారపక్షం గుత్తగా తీసుకుపోవటాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. తమ హయాంలో స్టార్ట్ చేసిన సాగు నీటి ప్రాజెక్టులుకు సంబంధించి కాసింత ఖర్చు చేయటం.. లేదంటే రీ డిజైన్ పేరుతో పేరును.. రూపురేఖల్ని మార్చేస్తున్న చేస్తున్న ప్రాజెక్టులతో కాంగ్రెస్ నేతలంతా ఆగమాగమైపోతున్నారు.

ఓపక్క పేరు పోవటం ఒక ఎత్తు అయితే.. తాము పడిన కష్టం మొత్తాన్ని వాళ్ల ఖాతాలోకి మళ్లించుకోవటాన్ని వారు సహించలేకపోతున్నారు. తాజాగా పాలమూరు సాగు నీటి ప్రాజెక్టుల పేరిట తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీశ్ రావు స్టార్ట్ చేసిన పలు ప్రాజెక్టలు తమ హయాంలోనే మొదలై.. పూర్తి అయ్యే వరకూ వచ్చాయని.. వాటికి కాస్త మార్పులు చేర్పులు చేసి తమ పేరుతో గొప్పలు చెప్పుకుంటున్నారంటూ మండి పడుతున్నారు టీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క మండిపడుతున్నారు.

జలయజ్ఞంలో భాగంగా నెట్టెంపాడు.. కోయిల్ సాగర్.. భీమా.. కల్వకుర్తి ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిందన్న విషయాన్ని గుర్తు చేస్తూ.. ఈ ప్రాజెక్టుల పనులు 95 శాతం పూర్తి అయ్యాయని.. మిగిలిన కొద్ది పనులను రెండేళ్లుగా టీఆర్ ఎస్ సర్కారు నిర్లక్ష్యం చేసిందన్నారు. ఈ ప్రాజెక్టులకు కొంత వ్యయం పెరగ్గా రూ.1575 కోట్ల నిధులు తమ పార్టీ హయాంలోనే సమకూర్చినట్లు ఆయన చెప్పారు. ఇప్పుడా ప్రాజెక్టులను మంత్రి హరీశ్ తిరిగి ప్రారంభోత్సవాలు చేయటం ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు.

తాము మొదలెట్టిన ప్రాజెక్టులను టీఆర్ ఎస్ నేతలు మొదలెట్టినట్లుగా చెప్పుకుంటున్నారంటూ మండిపడిన భట్టి.. ‘‘ఈ ప్రాజెక్టులు మీరు మొదలెట్టారా? మీ మామ సీఎం కేసీఆర్ ప్రారంభించారా?’’ అంటూ హరీశ్ ను ప్రశ్నించారు. హరీశ్ ప్రస్తుతం ప్రారంభిస్తున్న ప్రాజెక్టులు ఎవరి హయాంలో ప్రారంభించింది ప్రజల వద్దకు వెళ్లి తేల్చుకుందామని డీకే అరుణ విసిరిన సవాల్ ను స్వీకరించగలరా? అని డిమాండ్ చేశారు. తాము స్టార్ట్ చేసిన రాజీవ్ సాగర్.. ఇందిరా సాగర్ ప్రాజెక్టుల విషయంలో టీఆర్ ఎస్ ప్రభుత్వం రూ.800 కోట్లు వెచ్చిస్తే పూర్తి అయ్యే దానికి.. పేరు మార్చి.. రీడిజైన్ పేరు మీద రూ.10వేల కోట్ల ఖర్చును పెంచారంటూ విమర్శించారు. రీడిజైన్ పేరుతో అవినీతిని ప్రోత్సహిస్తున్నారని భట్టి మండిపడుతున్నారు. ఇంత అక్రోశాన్ని వ్యక్తం చేస్తున్న భట్టి.. ఏ ప్రభుత్వమైనా.. ఎవరి హయాంలో షురూ అయినా.. ఎవరి హయాంలో ప్రాజెక్టు పూర్తి అయితే ఈ క్రెడిట్ వారికే కాస్త ఎక్కువ వెళుతుందన్న విషయం తెలీనట్లుగా భట్టి వాపోవటం ఏమిటో..?