Begin typing your search above and press return to search.

స‌చివాల‌యం సాక్షిగా సీఎం గుండా గిరి

By:  Tupaki Desk   |   18 Jun 2018 5:20 PM GMT
స‌చివాల‌యం సాక్షిగా సీఎం గుండా గిరి
X
దేశంలోనే త‌న కంటే సీనియ‌ర్ ఎవ‌రూ లేరని...అనుభ‌వం విష‌యానికి వ‌స్తే...త‌న‌తో పోటీ ప‌డే వారే లేర‌ని సంద‌ర్భం వ‌చ్చినా రాక‌పోయినా...అవ‌సరం ఉన్నా లేక‌పోయినా...చెప్పుకొనే తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడు అనూహ్య‌మైన రీతిలో విచిత్రంగా ప్ర‌వ‌ర్తించారు. ఏకంగా స‌చివాల‌యం సాక్షిగా గుండాగిరికి దిగారని ప‌లువురు వ్యాఖ్యానిస్తున్నారు. రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల్లో పనిచేస్తున్న నాయీ బ్రాహ్మణులు తమ డిమాండ్ల సాధన కోసం గ‌త శుక్రవారం ఆందోళనకు దిగిన సంగ‌తి తెలిసిందే. దేవాలయాల్లో కేశఖండనశాలల్లో పనిచేస్తున్న నాయీ బ్రాహ్మణలకు కనీసవేతనం రూ.15 వేలు ఇచ్చి తక్షణమే పర్మినెంట్ చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. అలాగే ఈఎస్ ఐ - పీఎఫ్‌ సౌకర్యం కల్పించాలని.. ఉద్యోగ విమరణ చేసిన వారికి నెలకు రూ.5 వేలు పెన్షన్‌ ఇవ్వాలని కోరుతున్నారు. ఈ మేర‌కు డిమాండ్ల‌తో తిరుపతి మినహా అన్ని ప్రధాన ఆలయాల్లో ఆ రోజు తెల్లవారుజాము నుంచి ‘కత్తి డౌన్‌’ నిరసన చేపట్టారు. త‌మ ఆవేద‌న‌ను చెప్పుకొనేందుకు వారు ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడును ఆశ్ర‌యిస్తే ఆయ‌న బెదిరింపుల‌కు దిగారు.

రెవెన్యూ, దేవాదాయ శాఖ మంత్రి కేఈ కృష్ణ‌మూర్తితో జ‌రిపిన చ‌ర్చ‌లు విఫ‌లం అవ‌డంతో... సచివాలయంలో సీఎం చంద్ర‌బాబు నాయుడు కాన్వాయికి నాయీ బ్రాహ్మణులు అడ్డుగా నిల‌బ‌డి తమ సమస్యలను ఆయనకు విన్నవించుకున్నారు. న్యాయం చేయాల‌ని కోరారు. కనీస వేతనం ఇచ్చేంత వరకు సమ్మె విరమించబోమని సీఎంకు చెప్పారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ క్షురకులను ఉద్యోగులుగా గుర్తించలేమని స్పష్టం చేశారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి బెదిరింపు ధోరణితో మాట్లాడారు. కనీస వేతనం ఇవ్వడం కుదరదని తేల్చిచెప్పారు.

కేశ‌ ఖండన టికెట్టుపై రూ.25 ఇచ్చేందుకు సిద్ధమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పగా.. క్షురకులు వ్యతిరేకించారు. తమ డిమాండ్లపై సానుకూలంగా స్పందించకపోతే ప్రజల్లోకి వెళ్తామని క్షురకులు చెప్పగా.. 'నచ్చితే చేయండి లేకపోతే వెళ్లిపోండి' అంటూ సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. తమాషాలు చేస్తున్నారా అంటూ వేలు చూపించి చంద్రబాబు హెచ్చరించారు. ఏం చేస్తారో చూస్తామంటూ సచివాలయం సాక్షిగా బెదిరింపులకు దిగారు. మిమ్మల్ని ఎవరు ఇక్కడకు రానిచ్చారంటూ హుంకరించారు. అయ్యా అంటూ ప్రాధేయపడినా కనికరించకుండా కాఠిన్యం చూపారు.

కాగా, డిమాండ్ల సాధన కోసం సమ్మె బాట పట్టిన క్షురకులపై సచివాలయంలో సీఎం చంద్రబాబు ప్ర‌వ‌ర్తించిన తీరును తెలంగాణ నాయీ బ్రాహ్మణ ఐక్య వేదిక తీవ్రంగా ఖండించింది. ఏపీలో నాయీ బ్రాహ్మణులు చేస్తున్న పోరాటానికి సంపూర్ణ మద్దతు తెల్పుతున్నామని ప్రకటించారు.క్షురకులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఉమ్మడి రాష్ట్రంలో ఉండగానే చంద్రబాబును కోరినా పట్టించుకోలేదని గుర్తు చేశారు. ఉద్యోగాలు ఎక్కడున్నాయ్‌ అంటూ వ్యంగ్యంగా మాట్లాడారని వెల్లడించారు. అప్పటి నుంచి ఇదే మాట చెబుతూ వస్తున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్ర‌స్తుతం సైతం అదే రీతిలో ఏపీ నాయీ బ్రాహ్మణ సంఘాల ప్రతినిధుల పట్ల చంద్రబాబు వ్యవహరించార‌ని మండిప‌డ్డారు. తమ వారికి సంఘీబావంగా అవసరమైతే తెలంగాణలోనూ కళ్యాణ కట్టలను బంద్‌ చేస్తామని హెచ్చరించారు.