Begin typing your search above and press return to search.

కావూరి ఇంటిముందు బ్యాంక‌ర్ల గాంధీగిరి

By:  Tupaki Desk   |   28 May 2017 5:20 AM GMT
కావూరి ఇంటిముందు బ్యాంక‌ర్ల గాంధీగిరి
X
మొండి బ‌కాయిలు, ఉద్దేశపూర్వకంగా రుణాలు ఎగవేసిన వారి విష‌యంలో బ్యాంకులు కాస్త క‌ఠినంగానే వ్య‌వ‌హ‌రించాల‌ని నిర్ణ‌యం తీసుకున్న‌ట్లుగా క‌నిపిస్తోంది. ఈ క్ర‌మంలో చిన్నా పెద్దా తేడా లేకుండా ఆందోళ‌న‌కు సిద్ధ‌మ‌వ్వాల‌ని భావించిన‌ట్లు క‌నిపిస్తోంది. అయితే సాదాసీదా ఆందోళ‌న‌ల కంటే గాంధీగిరీ బెస్ట్ అని భావించిన‌ట్లు క‌నిపిస్తోంది. తాజాగా బకాయిలను రాబట్టేందుకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌ బీ) తెలంగాణ సర్కిల్‌ కు చెందిన అధికారులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. బ్యాంక్‌ కు పెద్ద మొత్తం లో రుణాలు ఎగ్గొట్టిన కొందరు రాజకీయ నాయకుల ఇంటి వద్ద గాంధీగిరీ పేరుతో నిరసనను తెలియజేశారు.

బీజేపీ నేత మాజీ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి, ప్రోగ్రెసివ్ కన్‌స్ట్రక్షన్స్ లిమిటెడ్ డైరెక్టర్ కావూరి సాంబశివరావుతోపాటు పరిగి నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే - సెయింట్ అగస్టీన్ ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ టీ రామ్ మోహన్ రెడ్డి - వైసీపీ త‌ర‌ఫున గెలిచి టీడీపీలో చేరిన పార్లమెంట్ సభ్యురాలు - విశ్వేశ్వర ఇన్‌ ఫ్రాస్ట్రక్చర్ డైరెక్టర్ కే గీత ఇంటిముందు బ్యాంకు అధికారులు గాంధీగిరి ద్వారా నిర‌స‌న తెలిపారు. వీరితోపాటు కావూరి అల్లుడు, కోనసీమ గ్యాస్ ప్రమోటర్ - డైరెక్టర్ ఎంఎస్‌ పీ రామారావు - ఎంబీఎస్ జువెల్లర్స్ డైరెక్టర్ సుకేశ్ గుప్తా - ఇంకా చాలామంది రుణ ఎగవేతదారుల ఇళ్ల‌ ముందు కూడా వారు నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రస్తుత నెలలో పీఎన్‌ బీ అధికారులు గాంధీగిరీ కార్యక్రమాన్ని చేపట్టడం ఇది రెండోసారి. బ్యాంక్ వెల్లడించిన వివరాల ప్రకారం.. కావూరి సాంబశివరావు రూ.200 కోట్లకు పైగా బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఇక రామ్ మోహన్ రెడ్డి రూ.6.50 కోట్లు, గీత రూ.85 కోట్లకు పైగా బకాయిపడ్డారు. కావూరి అల్లుడు ఎంఎస్‌పీ రామారావు రూ.105 కోట్లు, సుకేశ్ గుప్తా రూ.300 కోట్లకుపైగా చెల్లించాల్సి ఉంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/