Begin typing your search above and press return to search.

గొంతుకోసుకోమంటారా.. బండ్ల తూచ్

By:  Tupaki Desk   |   18 Dec 2018 8:31 AM GMT
గొంతుకోసుకోమంటారా.. బండ్ల తూచ్
X
తెలంగాణ ఎన్నికలకు ముందు నటుడు, కాంగ్రెస్ పార్టీలో చేరిన బండ్ల గణేష్ తరచూ వార్తల్లో నిలిచారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే డిసెంబర్ 11న బ్లేడుతో గొంతుకోసుకొని ఆత్మహత్య చేసుకుంటానని సంచలన కామెంట్స్ చేశారు. అయితే ఫలితాలు వెలువడి కాంగ్రెస్ చిత్తుగా ఓడిపోయాక బండ్ల గణేష్ మీడియాకు ముఖం చాటేశారు. మీడియా సంప్రదించినా కలవడానికి రావడం లేదు. ఎప్పుడు దొరుకుతాడా అని భావించిన మీడియాకు ఇప్పుడు ఆ టైం వచ్చింది.

వైకుంఠ ఏకాదశి సందర్బంగా తిరుపతిలో బండ్ల గణేష్ స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాకు చిక్కారు. కాంగ్రెస్ ఓడిపోతే గొంతు కోసుకుంటానని అన్నారన్న మీడియా ప్రశ్నకు బండ్ల సమాధానం ఇచ్చాడు.. ‘వంద అంటాం సార్.. చాలా మంది చాలా అంటారు. అవన్నీ జరుగుతాయా? లేదు... మీరు కోసుకొమ్మంటే కోసుకుంటా..’ అంటూ ప్రశ్నించిన మీడియా వారిపై బండ్ల గణేష్ రుసరుస లాడారు. ఎన్నికలకు ముందు మా పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపడానికే అలా అన్నానని.. కాన్పిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోయిందని.. ఇప్పుడు నన్నేం చేయమంటారు అంటూ నిర్వేదం వ్యక్తం చేశారు.

‘‘మేము అనుకున్న విధంగా జరగలేదు.. మా పార్టీ ఓడిపోయింది. అందుకే ఆ బాధలో రెండు మూడు రోజులు బయటకు వెళ్లలేక సైలెంట్ గా ఉండిపోయా.. పార్టీ గెలుస్తుందని ఎంతో ఊహించుకున్నా.. కానీ ప్రజలు మా ఊహాలపై నీళ్లు చల్లారు.. మా పార్టీని తిరస్కరించారు. టీఆర్ఎస్ వైపే మొగ్గారు’’ అంటూ బండ్ల గణేష్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ దెబ్బకు బండ్ల గణేష్ మీడియా ముందు ఇక నుంచి చాలెంజ్ లు, సవాళ్లు చేయడానికి వెనుకాడాలాగానే కనిపిస్తున్నాడు. ఒక సారి దెబ్బైపోయిన బండ్ల తిరుపతిలో ఆచితూచి మాట్లాడడాన్ని బట్టి ఇదే స్పష్టమవుతోంది.