Begin typing your search above and press return to search.

పాక్ పై దాడితో బలూచ్ నేతల సంబరం

By:  Tupaki Desk   |   29 Sep 2016 11:49 AM GMT
పాక్ పై దాడితో బలూచ్ నేతల సంబరం
X
ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకుగాను నియంత్రణ రేఖ దాటి భారత సైన్యం నిర్వహించిన లక్ష్యిత దాడుల తరహాలోనే తమ ప్రాంతంలోనూ ఉగ్రవాద స్థావరాలపై భారత్ దాడి చేయాలని పాక్ లోని బలూచిస్థాన్ కు చెందిన నేతలు కోరుతున్నారు. బలూచిస్తాన్ మద్దతుదారుల నాయకుడు మజ్దాక్ దిల్సాద్ బాలోచ్ ఆధ్వర్యంలో ఢిల్లీలోని పాక్ హైకమిషన్ కార్యాలయం ముందు ఈరోజు మధ్యాహ్నం వారు ప్రదర్శన జరిపారు. అనంతరం బలూచిస్తాన్ మద్దతుదారులు మాట్లాడుతూ - ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు భారత్ ఎటువంటి చర్యలకు పాల్పడినా, ఏం చేసినా తాము పూర్తిగా మద్దతిస్తామని ప్రకటించారు. బలూచిస్థాన్ లో భారత్ దాడులు చేయాలని వారు కోరారు.

భారత్ పక్షాన న్యాయం ఉందని... ఉగ్రవాదాన్ని ఏరి పారేసేందుకు భారత్ ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా మద్దతిస్తామని చెప్పారు. భారతదేశంలో పదే పదే ఉగ్రదాడులకు పాల్పడుతున్న నేపథ్యంలో పాక్ ఉగ్రవాదులపై భారత సైన్యం తాజాగా దాడులు చేసిన సంగతి తెలిసిందే. పీవోకేలో మూడు కిలోమీటర్ల మేర చొరబడి.. అక్కడున్న ఉగ్రవాద శిబిరాలను మన సైన్యం కకావికలం చేసింది. అంతర్జాతీయంగానూ ఈ చర్యకు మద్దతు దొరకడం ఒకెత్తయితే పాక్ కు చెందిన బలూచ్ నేతలు మద్దతు పలకడం మరో ఎత్తు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/