Begin typing your search above and press return to search.

ఆయన నోరు తెరిస్తే ఇష్యూ సెట్ అవుతుందా?

By:  Tupaki Desk   |   28 Aug 2016 6:05 AM GMT
ఆయన నోరు తెరిస్తే ఇష్యూ సెట్ అవుతుందా?
X
ప్రత్యర్థుల మీద మాటల దాడి చేయటానికి తెలంగాణ అధికారపక్ష నేతలు వినిపిస్తున్న వాదనలు మరీ చిత్రంగా కనిపిస్తున్నాయి. ఎవరి మాటల్ని ప్రాతిపదికగా తీసుకోకూడదో.. వారి మాటల్నే తీసుకుంటూ చేస్తున్న వ్యాఖ్యలపై విస్మయం వ్యక్తమవుతోంది. ఒక రాష్ట్రానికి సరిహద్దు రాష్ట్రాలుగా ఉన్న రాష్ట్రాలు ఎప్పుడూ తమ రాష్ట్ర ప్రయోజనాల గురించి మాత్రమే మాట్లాడతారు. అంతేకానీ.. ఎదుటి రాష్ట్రాల ప్రయోజనాల గురించి మాట్లాడేంత పెద్ద మనసు వారికి ఉండదు.

ఆ విషయం తెలియటానికి రాజకీయాల్లో ఉండాల్సిన అవసరం లేదు. రాజకీయ అవగాహన ఏ మాత్రం ఉన్నా ఇట్టే అర్థమవుతుంది. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం తన ప్రజల ప్రయోజనాలకే పెద్ద పీట వేస్తుందే తప్పించి పక్క రాష్ట్ర ప్రజల ప్రయోజనాల గురించిఆలోచించే అవకాశమే లేదు. ఒకవేళ అలాంటి మైండ్ సెట్ ఉండి ఉంటే.. ఆల్మట్టి.. బాబ్లీ పంచాయితీలు తెలుగు ప్రజలకు ఉండేవే కావు. కానీ.. ఆ విషయాన్ని విస్మరించి మరీ తెలంగాణ అధికారపక్ష ఎంపీ బాల్క సుమన్ చేస్తున్న వ్యాఖ్యలు చిత్రంగా ఉన్నాయి.

ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును 152 మీటర్ల ఎత్తులో కట్టేందుకు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి ప్రయత్నాలు చేశారు. దానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇదిలాఉంటే.. తాజాగా తెలంగాణ అధికారపక్షం 152 మీటర్ల ఎత్తు కంటే తక్కువ ఎత్తుకే మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. దీనిపై విపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శలు కురిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే.. ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి సర్కారు మహారాష్ట్రతో 152 మీటర్ల ఎత్తులో ప్రాణహిత.. చేవెళ్ల ప్రాజెక్టును కట్టేందుకు ఒప్పుకున్నట్లుగా ఒప్పందం చేసుకున్నట్లు కాంగ్రెస్ వాదిస్తోంది. అయితే.. ఇది నిజం కాదని వ్యాఖ్యానించిన బాల్క సుమన్.. 152 మీటర్ల ఎత్తులో ప్రాజెక్టు కడితే నిధులు వృధా అవుతాయంటూ నాటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ నాటి తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి లేఖ రాసినట్లుగా చెబుతున్నారు. ఒకవేళ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖ రాస్తే.. అందులోమహారాష్ట్ర ప్రయోజనాలు ఉంటాయే తప్పించి..ఏపీ ప్రయోజనాల కోసం లేఖ రాయరు కదా?

కానీ.. ఆ లాజిక్ ను మిస్ అయిన బాల్క సుమన్.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ప్రాణహిత.. చేవెళ్ల ప్రాజెక్టును 152 మీటర్ల ఎత్తులో కడితే ఏపీకి నష్టమంటూ అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి లేఖ రాశారని చెప్పుకొచ్చారు. ఎక్కడైనా ఒక రాష్ట్రం కట్టే ప్రాజెక్టు కారణంగా ఆ రాష్ట్రానికి నష్టం వాటిల్లుతుందని పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి లేఖ రాస్తారా? ఒకవేళ రాస్తే దానికి కారణం ఏమై ఉంటుంది? తన రాష్ట్ర ప్రయోజనాల కోసమే మరో రాష్ట్ర ముఖ్యమంత్రి లేఖ రాస్తారే కానీ.. అందుకు భిన్నంగా ఉండదు. ఆ చిన్న విషయాన్ని మర్చిపోయినట్లుగా ఉంది బాల్క సుమన్ మాటలు చూస్తే. నాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి లేఖ రాశారని.. ఈ లేఖతో ఒప్పందం జరగలేదన్న విషయం స్పష్టమవుతుందని ఆయన చెబుతున్నారు. ఒక అంశం మీద రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య లేఖలు నడిస్తే.. ఒక్క లేఖను మాత్రమే సుమన్ కోట్ చేస్తున్నట్లుగా కాంగ్రెస్ వర్గాలు వాదిస్తున్నాయి. ఈ పంచాయితీ లెక్క తేలాలంటే మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నోరు తెరవాల్సిందే. ఆయన కానీ బయటకు వచ్చి జరిగింది చెబితే అసలు విషయం ఇట్టే తేలుతుంది. కానీ.. ఆ పని కిరణ్ కుమార్ రెడ్డి చేస్తారా?