Begin typing your search above and press return to search.

ఈసారి బాలాపూర్ ల‌డ్డూ విజేత ఎవ‌రంటే?

By:  Tupaki Desk   |   23 Sep 2018 6:20 AM GMT
ఈసారి బాలాపూర్ ల‌డ్డూ విజేత ఎవ‌రంటే?
X
వినాయ‌క చ‌వితి అన్నంత‌నే భారీ ఎత్తున ఏర్పాటు చేసే గ‌ణేషు మండ‌పాలు ఒక ఎత్తు అయితే.. నిమ‌జ్జ‌నం సంద‌ర్భంగా స్వామి వారికి ప్ర‌సాదంగా ఉంచిన ల‌డ్డూ వేలం పాట‌లు. హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రంలో వేల‌ల్లో మండ‌పాలు ఏర్పాటు చేసి.. విగ్ర‌హాల్ని ఏర్పాటు చేసినా.. కొన్నిచోట్ల ఏర్పాటు చేసే వినాయ‌క మండ‌పాల‌కు ప్ర‌త్యేక‌త ఉంటుంది. అలాంటి ప్ర‌త్యేక‌త బాలాపూర్ ల‌డ్డూ వేలం సొంతం.

బాలాపూర్ గణేషుడికి ప్ర‌సాదంగా ఉంచే ల‌డ్డూను సొంతం చేసుకున్న వారికి క‌లిసి వ‌స్తుంద‌న్న పేరు మొద‌ట్నించి ఉంది. 1980లో ప్రారంభ‌మైన ఈ వేలంలో పాల్గొన‌టానికి పెద్ద పెద్ద వాళ్లంతా భారీగా ఆస‌క్తి చూపుతారు. 1994లో రూ.450 ప‌లికిన బాలాపూర్ ల‌డ్డూ.. 2017 నాటికి రూ.15.60 ల‌క్ష‌ల‌కు చేరుకుంది. ఈసారి ఎంత ప‌లుకుతుంద‌న్న ఆస‌క్తి వ్య‌క్త‌మైంది.

ఇదిలా ఉంటే.. బాలాపూర్ ల‌డ్డూ వేలం తాజాగా ముగిసింది. వేలంలో ల‌డ్డూను శ్రీ‌నివాస్ గుప్తా సొంతం చేసుకున్నారు. వ్యాపార‌స్తుడైన ఆయ‌న ఈసారి రూ.16.60 ల‌క్ష‌ల‌కు బాలాపూర్ ల‌డ్డూను వేలంలో సొంతం చేసుకున్నారు. బాలాపూర్ ల‌డ్డూను తొలుత చార్మినార్ లోని గుల్ జ‌ల్ అగ్రాస్వీట్ హౌస్ వారు త‌యారు చేసేవారు. 22 కేజీల బ‌రువు ఉండేది. గ‌డిచిన నాలుగేళ్లుగా మాత్రం అదే బ‌రువుతో తాపేశ్వ‌రంలోని హ‌నీ ఫుడ్స్ త‌యారుచేస్తోంది. వేలంలో ల‌డ్డూను సొంతం చేసుకున్న విజేత‌కు ప్ర‌సాదంతో పాటు.. రెండు కేజీల బ‌రువున్న వెండి గిన్నెను బ‌హుమ‌తిగా ఇస్తున్న‌ట్లు హ‌నీ ఫుడ్స్ వెల్ల‌డించింది.