Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ అంశ అంటూ బ్రాండ్ వేసేస్తున్నారే

By:  Tupaki Desk   |   28 Nov 2015 6:38 AM GMT
ఎన్టీఆర్ అంశ అంటూ బ్రాండ్ వేసేస్తున్నారే
X
భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ముందు నుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోవటం రాజకీయాల్లో మామూలే. రాజరికం పోయి చాలాకాలమే అయినా.. ప్రజాస్వామ్య రాజరికం పేరిట.. ప్రజాస్వామ్యబద్ధంగా కుటుంబ పాలనను పెంచి పోషించే ధోరణి రోజురోజుకీ పెరిగిపోతోంది. దీనికి చంద్రబాబు నాయుడు లాంటి వాళ్లు మినహాయింపేమీ కాదు. సరిగ్గా.. ఒక్క ఏడాది కూడా లేని మనమడు విషయంలో చంద్రబాబు చాలా ముందుచూపుతో వ్యవహరించటం కనిపిస్తోంది. తాజాగా పుట్టు వెంట్రుకల కార్యక్రమం సందర్భంగా తన మనమడు దేవాన్ష్ ను ఎన్టీఆర్ అంశగా పో​ల్చటం దీన్లో భాగంగానే చెప్పాలి.

ముఖ్యమంత్రిగా తొమ్మిదిన్నరేళ్లు.. విపక్ష నేతగా 10​ ​ఏళ్లు.. మరోమారు ముఖ్యమంత్రిగా 18 నెలలుగా కొనసాగుతున్నప్పటికీ.. ఇప్పటికి ఎన్టీఆర్ పేరు పెట్టుకొనే పార్టీని.. ప్రభుత్వాన్ని నడ​పుతున్నారంటే​ ఎన్టీఆర్ పేరుకున్న బ్రాండ్ ఇమేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భవిష్యత్తు రాజకీయాలకు సైతం ఎన్టీఆర్ బ్రాండ్ అన్నది ఎంతో కీలకంగా మారుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే కాబోలు.. లోకేశ్.. బ్రాహ్మణి దంపతుల గారాల పట్టి దేవాన్ష్ మీద ఎన్టీఆర్ బ్రాండ్ వేసేస్తున్నారు.

తాజాగా జరిగిన కుటుంబ కార్యక్రమంలో పాల్గొన్న దేవాన్ష్ తాతల్లో ఒకరైన బాలకృష్ణ తన మనవడ్ని తన తండ్రి అంశగా చెప్పుకోవటం.. దానికి బావ కమ్ వియ్యంకుడైన చంద్రబాబు ముఖం వికసించటం చూసినప్పుడు.. గట్టిగా ఏడాది లేని పసిబిడ్డకు ఎన్టీఆర్ బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపించక మానదు. ఇప్పుడే బ్రాండ్ కోసం ఇన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయంటే.. రానున్న రోజుల్లో ఇదెంతవరకు వెళుతుందో చెప్పాల్సిన అవసరం లేదేమో.