Begin typing your search above and press return to search.

చింత‌ప‌ల్లి ఏజెన్సీలో బాహబ‌లి తండ్రి!

By:  Tupaki Desk   |   28 Sep 2016 11:03 AM GMT
చింత‌ప‌ల్లి ఏజెన్సీలో బాహబ‌లి తండ్రి!
X
బాహుబ‌లి చిత్రంలో తొలి స‌న్నివేశం చాలామందికి గుర్తుండే ఉంటుంది. తాను నీట్లో మునిగిపోతూ బిడ్డ‌ను ఒక చేత్తో ర‌మ్య‌కృష్ణ పైకెత్తి ప‌ట్టుకునే స‌న్నివేశం గుండెకి హ‌త్తుకునేలా ఉంటుంది. బిడ్డ కోసం తల్లి చేసిన సాహ‌సాన్ని తెర‌మీద చూసి క‌ళ్లు చెమ‌ర్చాం. నిజ జీవితంలో అలాంటి ఘ‌ట‌నే మ‌న‌కు ఎదురైతే.. ఒక చిన్నారిని కాపాడుకోవ‌డం కోసం స‌రిగ్గా ఇలాంటి సాహ‌స‌మే చేశాడు ఓ తండ్రి. త‌న చిన్నారికి వాగు దాటించ‌డం కోసం ఆ తండ్రి ప‌డ్డ అవ‌స్థ అంతాఇంతా కాదు.

విశాఖ‌పట్నం జిల్లాలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. చింత‌ప‌ల్లి ఏజెన్సీ ప్రాంతంలో వ‌ర్షాకాలం వ‌చ్చిందంటే వాగులూ వంక‌లూ పొంగి పొర‌లుతూ ఉంటాయి. ఆ ప్రాంతంలో గ్రామాల మ‌ధ్య సంబంధాలు తెగిపోతాయి. ఎక్క‌డికి వెళ్లాలన్నా నీరు దాటి వెళ్లాల్సిన ప‌రిస్థితి. మామూలు రోజుల్లోనే గిరిజ‌నులు వాగులు దాటుతూ ఇత‌ర ప్రాంతాల‌కు వెళ్తుంటారు. వ‌ర్షాలు ప‌డితే ఆ ప‌రిస్థితి ఎలా ఉంటుందో అనేది ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. చింత‌ప‌ల్లి మండ‌లంలో కుడుముసారి గ్రామ ప్ర‌జ‌లు ప‌క్క‌నున్న ఊరికి వెళ్లాలంటే వాగు దాటాల్సిందే. అయితే, మామూలుగానే ఈ వాగులో నిత్యం నీళ్లు ఉంటాయి. వ‌ర్షాకాలం వ‌స్తే దాదాపు 20 అడుగుల ఎత్తులో వాగు ప్ర‌వ‌హిస్తూ ఉంటుంది.

ఈ మ‌ధ్య వ‌ర్షాలు తీవ్రంగా కుర‌వ‌డంతో వాగు ఉద్ధృతి కూడా తీవ్రంగానే ఉంది. ఆ గ్రామానికి చెందిన స‌త్తిబాబుకి ఏడాది కుమార్తె ఉంది. రెండు రోజులుగా తీవ్ర‌మైన జ్వ‌రంతో బాధ‌ప‌డుతోంది. దాంతో త‌న బాబాయి సాయంతో చిన్నారిని అతి క‌ష్ట‌మ్మీద వాగు దాటించి అవ‌తలి ఊరికి చికిత్స‌కు తీసుకెళ్లాడు. అక్క‌డ చికిత్స పొందిన చిన్నారికి జ్వ‌రం త‌గ్గింది. మ‌ళ్లీ తిరిగి త‌న గ్రామానికి వ‌స్తూ ఇదిగో ఇలా... త‌ల‌పై బిడ్డ‌ను పెట్టుకుని తాను నీట్లో మునుగుతూ అతి జాగ్ర‌త్త‌గా వాగును దాటాడు. బిడ్డ కోసం తండ్రి చేస్తున్న సాహ‌సాన్ని గ‌మ‌నించిన ఓ ఉపాధ్యాయుడు త‌న స్మార్ట్‌ ఫోన్‌ తో ఈ చిత్రాల‌ను క్లిక్ మ‌నిపించాడు. బిడ్డ కోసం బాహుబ‌లి సాహ‌సం చేసిన తండ్రి స‌త్తిబాబుకి హ్యాట్సాఫ్‌. క‌నీసం ఈ ఫొటో అయినా పాల‌కుల్ని క‌దిలిస్తే... ఆ వాగు మీద వంతెన ప‌డుతుందని చాలామంది అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/